నేను వ్రాసిన ఈ వ్యాసాన్ని ప్రచురించిన మాలిక సంపాదక వర్గానికి కృతజ్ఞతలతో…..
ఈయన జనన సంబంధిత విషయాలు శ్రీ శివ పురాణంలో సూత మహర్షి శౌనకాది మునులకి చెప్తున్నట్టు వస్తుంది. ఆ ప్రకారంగా, పూర్వము కాంపిల్య నగరంలో యజ్ఞదత్తుడు - సోమిదమ్మ అనే బ్రాహ్మణ దంపతులు ఉండేవారు. వేద, వేదాంగాలు, శాస్త్ర, పురాణాలు అన్నిటిలో ప్రావీణ్యత ఉన్న యజ్ఞదత్తుడు రాజాదరణ పొంది రాజగురువుగా నియమింపబడ్డాడు. వీరి ఏకైక సంతానం గుణనిధి. అతను చెడు సావాసాల వలన జూదమునకు బానిసయ్యి, ఆ జూద క్రీడ కోసం దొంగతనాలు కూడా మొదలుపెట్టాడు. తల్లయిన సోమిదమ్మకి ఇవన్నీ తెలిసినా గారాబంతో మందలించకపోగా, భర్తకు ఈ విషయాలు తెలిస్తే ఎక్కడ కోప్పడతాడో అన్న భయంతో మౌనం వహించేది. యజ్ఞదత్తుడు రాజమందిరంలో కార్య కలాపాలలో నిమగ్నమై కొడుకుని పట్టించుకునేవాడు కాదు. ఎప్పుడయినా కొడుకు గురించి భార్యను వాకబు చేస్తే, ఆవిడ పుత్ర ప్రేమతో చదువుకోడానికి గురువు గారి వద్దకు వెళ్ళాడనో, గుడికి వెళ్ళాడనో అబద్ధం చెప్పి భర్తను మభ్య పెట్టేది. దానితో గుణనిధికి అడ్డు, అదుపు లేక ఇంటిలో నగలన్నీ దొంగిలించి మరీ జూదమాడి ఓడిపోతూ ఉండేవాడు. అలా తన తండ్రికి రాజుగారిచ్చిన వజ్రపు ఉంగరం కూడా జూదంలో పెట్టి ఓడిపోయాడు. ఆ ఉంగరం గెలుచుకున్న వ్యక్తి అనుకోకుండా యజ్ఞదత్తుని కంట పడటం, యజ్ఞదత్తుడు ఆ ఉంగరం తనదని గుర్తించి అతనిని నిలదీయటం, అతను జూదంలో గుణనిధి వద్ద గెలుచుకున్నానని చెప్పటంతో యజ్ఞదత్తుని నోట మాట రాలేదు. ఆ రోజు దాకా కొడుకు ఏమి చేస్తున్నదీ తనకు తెలియని పరిస్థితిలో ఉన్నందుకు సిగ్గుపడుతూ, భార్యా బిడ్డల మీద కోపంతో ఇంటికి వెళ్లి, కొడుకు చెడు సావాసాలకు లోనయిన విషయం తన వద్ద దాచినందుకు భార్యను మందలించాడు. ఇంతలో జరిగిన విషయం తెలుసుకున్న గుణనిధి ఇంటికి వచ్చే సాహసం చేయలేకపోయాడు. తన మిత్రులెవరూ కూడా తనకి తల దాచుకోవటానికి సహకరించలేదు. చెంతనే ఉన్న గౌతమీ నది దాటి ప్రక్క ఊరు చేరుకున్నాడు. ఆ రోజు మహాశివరాత్రి కావడంతో ఊరి చివరన ఉన్న శివాలయంలో భక్తులు నైవేద్యాలు సమర్పించి, తమ శక్తి కొలదీ జాగారాలు చేసి, మెల్లిగా నిద్రలోకి జారుకున్నారు. జనాలంతా పడుకున్నారని నిర్ధారించుకున్నాక, ఆకలితో ఉన్న గుణనిధి శివునికి అర్పించిన ప్రసాదాలను తీసుకుని తిందామని గర్భ గుడిలోనికి వెళ్ళాడు. చీకటిలో ఏమీ కనిపించక, తన పైవస్త్రాన్ని చించి వత్తిగా చేసి అక్కడ ఉన్న నూనెతో దీపాన్ని వెలిగించాడు. ఆ వెలుతురులో ప్రసాద పాత్రలు కనిపించేసరికి ఆనందంతో వాటిని తీసుకుని బయటకి నడుస్తుండగా గుడిలో నిద్రిస్తున్న ఒక భక్తుని కాలు తగిలి, నందీశ్వరుని మీద పడి, తల పగిలి చనిపోతాడు. ఊరి నుండీ పారిపోతూ పవిత్రమయిన గౌతమీ స్నానం, తిండి దొరకనందున ఉపవాసం, వెలుతురు కోసం శివాలయంలో వెలిగించిన దీపం, ప్రసాదాల కోసం చేసిన సగం జాగారం, ఇవన్నీ అనుకోకుండా చేసినా శివరాత్రి పర్వదినం నాడు చేసి మరణించటం వలన గుణనిధికి కైలాస ప్రాప్తి లభించింది. అందుకనే "జన్మానికో శివరాత్రి" అంటారు.
ఇదిలా ఉండగా, పులస్త్యుడు అనే బ్రహ్మర్షి ధర్మాన్ని గ్రహించాలన్న ఆసక్తితో, మేరు పర్వతానికి అతి చేరువలో ఉండే తృణబిందుని ఆశ్రమానికి వెళ్ళి, అక్కడ తనకనువయిన ఒక చోటు చూసుకుని తపస్సు ప్రారంభించాడు. ఆ ఆశ్రమ పరిసరాలు ఎంతో రమణీయమయిన ప్రకృతి శోభతో విలసిల్లుతూ ఉండేవి. అందుకే దేవతాంగనలు, అప్సరసలు, నాగకన్యలు అక్కడకి వెళ్ళి తమ ఆటపాటలతో కాలం గడిపి వెళ్ళిపోయేవారు. వీటి వలన పులస్త్యునికి తపోభంగం కలిగేది. దానితో ఆగ్రహించిన ఆయన, తన కంట పడిన కన్య గర్భవతి అవుతుందని శపించి తపస్సులో మునిగిపోతాడు. ఈ శాపం గురించి తెలిసినవారెవరూ అక్కడికి వెళ్ళేవారు కాదు. ఒకనాడు ఈ శాపం గురించి తెలియని తృణబిందుని కుమార్తె అయినటువంటి మానిని అక్కడికి వెళ్ళటం, గర్భం దాల్చటం జరగటంతో తన కుమార్తెను స్వీకరించమని తృణబిందుడు పులస్త్యుని అడుగగా దయతో ఆమెను స్వీకరించి, ఆమె సేవలకి మెచ్చి, తనతో సమానమయిన జ్ఞానం, శక్తి ఉన్న పుత్రుడు పుడతాడని ఆశీర్వదిస్తాడు. అలా పుట్టినవాడే విశ్రవుడు (వేదాధ్యాయమును విన్నవాడు అని అర్థం). విశ్రవుడు (ఇతనిని విశ్రవ బ్రహ్మ అని కూడా పిలుస్తారు) తన తండ్రితో అన్ని విషయాల్లోనూ సమానుడై, నిత్యం తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. యుక్త వయస్కుడైన విశ్రవునికి, భరద్వాజ మహర్షి తన కుమార్తె అయిన దేవవర్ణినిచ్చి వివాహం జరిపించారు. వీరిరువురికీ పుట్టినవాడు వైశ్రవణుడు. ఈ వైశ్రవణుడే (విశ్రవుని కుమారుడు) కుబేరుడు.
కుబేరుడు చిన్నతనం నుండీ శివ భక్తి తత్పరుడు. కైలాస ప్రాప్తి పొందిన గుణనిధే ఈ జన్మలో వైశ్రవణుడిగా (కుబేరునిగా) పుట్టాడని తన తపోశక్తి ద్వారా తెలుసుకున్న విశ్రవుడు, తన కుమారుడు చిన్నతనంలోనే తపస్సు చేసుకోవడానికి అంగీకరించాడు. దానితో కుబేరుడు కఠోరమైన తపస్సు చేయటం మొదలు పెట్టాడు. కొన్ని సంవత్సరాలు కేవలం ద్రవ పదార్ధాలను సేవించి, తరువాత కొన్ని సంవత్సరాలు కేవలం గాలి మాత్రమే భుజించి, అటు పిమ్మట గాలిని కూడా పీల్చకుండా వెయ్యి సంవత్సరాల పాటు చేసిన తపస్సుకు మెచ్చిన పరమ శివుడు ప్రత్యక్షమయ్యి, తనని లోకపాలకునిగా, ధనాధ్యక్షునిగా ఉండే వరమిచ్చి అంతర్ధామనవుతాడు. ఎక్కడ ఉండాలో తెలియని కుబేరుడు బ్రహ్మ కోసం తపస్సు చేయగా, ఆయన ప్రత్యక్షమయ్యి శంఖనిధి, పద్మనిధి మరియు పుష్పక విమానం ప్రసాదించి, త్రికూట పర్వతం మీద, సముద్ర మధ్యభాగంలో ఉన్న లంకా పట్టణంలో పూర్వం రాక్షసులు ఉండేవారనీ, శ్రీహరి వలన భయంతో వారంతా పాతాళానికి పారిపోయారు కనుక అక్కడకి వెళ్ళి ఉండమనీ చెప్పి మాయమవుతాడు.
రావణాసురుడు రాక్షసుడు కావడంతో తన తాతగారయిన సుమాలి వద్ద పాతాళంలో ఉండేవాడు. కుబేరుడు మాత్రం భోగ భాగ్యాలతో లంకలో రాజ్యపాలన చేయటం చూసి తట్టుకోలేక, లంక మీదకి దండెత్తాడు రావణాసురుడు. కుబేరునికి శారీరక బలం తక్కువ, యుద్ధం చేసి జనాలను చంపే క్రూరత్వం లేదు, పైగా రావణాసురుడు హఠాత్తుగా రావటంతో రావణాసురుడు లంకను పుష్పక విమానంతో సహా స్వాధీనం చేసుకుని కుబేరుని తరిమేశాడు. దానితో భయపడిపోయిన కుబేరుడు కాశీ చేరుకుని పరమేశ్వరుని కోసం ఘోర తపస్సు మొదలుపెట్టాడు. గాలిని సైతం బంధించి, ఒంటి కాలి మీద నిలిచి, శివుని మనసులో నిలుపుకుని తపస్సు చేయసాగాడు. తన శరీరం నుండి వచ్చిన తపోగ్ని జ్వాలలు ముల్లోకాలూ వ్యాపించాయి. ఈయనకి తపోభంగం కలిగించటానికి చేసిన ప్రయత్నాలన్నీ వృధా అయ్యాయి. కాలం గడిచిన కొద్దీ కుబేరుని శరీరం ఎముకల గూడులా మారిపోయింది. అయినా తపస్సు చేస్తూనే ఉన్న కుబేరుని మెచ్చిన శివుడు ప్రత్యక్షమయ్యి, "లంకా నగరాన్ని మించిన దివ్యభవనాలతో, అపురూపమయిన చైత్ర రథం అనే ఉద్యానవనముతో, నవ నిధులతో, మణి మాణిక్యాలతో, సర్వ సంపదలతో అలకాపురం అనే పట్టణాన్ని నిర్మించి నీకు ఇస్తున్నాను. ఇక నుండీ నీవు అక్కడే ఉంటూ, యక్షులకి, గంధర్వులకి, మయులకి, గుహ్యకులకి రాజువై ఉండమని అనుగ్రహిస్తాడు. ధనదుడవు, ధన దాతవు అయిన నిన్ను మించినవాడు ఈ సృష్టిలోనే ఉండరు. ఉత్తర దిక్కును పరిపాలిస్తూ, నా ప్రియ మిత్రుడవై, నాకు ఆప్తుడవై సంచరిస్తూ ఉండు" అని ఎన్నో వరాలిచ్చి కుబేరునికి మంచి రూపం ప్రసాదించి అదృశ్యమవుతాడు. అందుకనే అధిక ధనము కల వారిని "అపర కుబేరులు" అంటారు.
ఎంతోమంది అదృష్ట చిహ్నంగా, సిరిసంపదలనొసగుతూ ఆనందాన్ని పెంపొందించే దైవంగా భావించే "లాఫింగ్ బుద్ధ" మన కుబేరుడే అని చాలా మంది నమ్మకం. కుబేరుని పూజించిన వారికి ఆర్ధిక ఇబ్బందులు తొలగి, వ్యాపార వృద్ధి, సామాజిక గుర్తింపు లభిస్తాయని మన పురాణాలు చెప్తున్నాయి. అయితే, కుబేరుని ప్రతిమ కానీ, కుబేర దీపాలు కానీ ఎవరికి వారు కొనుక్కోవటం కన్నా కూడా ఎవరయినా కానుకగా ఇచ్చినది మనం తీసుకుని పూజిస్తే విశేషమయిన ఫలితం ఉంటుందని నమ్మిక. ధన త్రయోదశి నాడు కుబేర పూజలు, కుబేర వ్రతాలు, మొ., ఈ మధ్యన మనం ఎక్కువగా చూస్తున్నా, నిత్యం మనకి తెలిసో, తెలియకుండానో కుబేరుడిని మంత్రపుష్పం చదివేటప్పుడు స్మరిస్తూనే ఉంటాం.
"రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే
నమోవయంవై శ్రవణాయ కుర్మహే
సమే కామాన్ కామ కామాయ మహ్యం
కామేశ్వరోవై శ్రవణో దదాతు
కుబేరాయ వైశ్రవణాయ మహా రాజాయ నమః "
హిందువులే కాక, బౌద్ధ, జైన మతాల వారు కూడా అధికంగా పూజించే, నమ్మే దైవం కుబేరుడు. బౌద్ధులు ఈయనని వైశ్రవణుడు లేదా జంభాలుడు అని పిలుస్తారు. శ్రీ శివ పురాణం ప్రకారం, కుబేరుడి అసలు పేరు వైశ్రవణుడే! జైనులు ఈయనని సర్వానుభూతి అంటారు. టిబెటియన్లు మరియు జపనీయుల ప్రకారం ప్రపంచాన్ని నలుదిక్కులా పాలించే రాజులలో కుబేరుడు ఒకడు. బౌద్ధుల ప్రకారం ఈయన చేతిలో ఎల్లప్పుడూ బంగారు నాణెములు కల ఒక సంచీ కానీ వజ్రములను, మణులను వెదజల్లు ముంగీస కానీ ఉంటాయి. అదే విధంగా, మరొక చేతిలో ఎల్లప్పుడూ నిమ్మకాయ (జంబీరము) ఉండటం వలననే ఈయనకి జంభాలుడు అనే పేరు వచ్చిందని చెప్తారు. అగ్ని పురాణం ప్రకారం, ఈయన ఆయుధం గద, వాహనం నరుడు (మనిషి). దీని ద్వారా మనిషి డబ్బుకి, ఐశ్వర్యానికి బానిసగా మారే అవకాశాలు ఉన్నాయని తెలుస్తున్నది. కనుక మనిషి మనీ కి బానిస కాకుండా స్వీయ నియంత్రణతో బంధువుగా వుంటూ, ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో జీవించాలని ఆశిద్దాం.

21 comments:
యక్షులు రాక్షసులు కాదండి, మీలాటివారు మనుషులగురించి రాయాలి.
అభినందనలండీ!
అబ్బా! కుబేరుడికి ఇంత కథుందని తెలియనే తెలియదు. ఎన్నో రక రకాల విషయాలను క్షుణ్ణంగా పరిశీలించి మరీ రాసే మీ రచనలు ఎంత బాగుంటాయో...
అందుకనే పరాయి స్త్రీని చూస్తే “కళ్ళు పోతాయి” అంటారు.hahahahaha nijamgaana
బాగుంది రసజ్ఞ గారు!
మీ రచనల నుంచి చాలా విషయాలు తెలుసుకోవచ్చు :)
జయ గారన్నట్లే కుబేరుడి గురించి తెలియని చాలా విషయాలు తెలుసుకున్నామండీ..
చాలా బాగుంది. అభినందనలు :)
koththaga don vito corleone profile pic pettanu muchchataga anipichindhi danni choosukovalane ee comment,ofcourse nenu enni kothi veshalu vesina pattinchokorane nammakam kooda undanukondii
కంగ్రాట్స్.....కుబేరుడి గురించి బోలెడన్ని కొత్తవిషయాలు చెప్పారు!
బాగుందండి ఎన్నో కొత్త విషయాలు తెలిసాయి
కుబేరుడు మీద మీరు చేసిన విశ్లేషణ బాగుంది . అయితే "లాఫింగ్ బుద్ధ" కి కుబేరుడి కి కొంచెం వ్యత్యాసం ఉంది. మంచి టపా .విజ్ఞానదాయకంగా ఉంది .
నాకు గుణనిధి కథ తెలుసు, చినప్పుడు మా తెలుగు గురువుగారు "ఆరెమ్మారు మాస్టారు" ప్రార్ధన అయ్యాక చెప్పే రోజుకో మంచి కథల్లో ఇది ఒకటి, కాని అతనే వైశ్రవణుడు, కుబేరుడు అని తెలియదు.
ఇంకా యమునా కాళింది ఎలా అయ్యిందో తెలిసింది, కాని కృష్ణుడు కాళిందిపై అంటే యమునా నది పైనా లేదంటే ఆ కాళింది సర్పము పైన అని అర్ధమా!! బహుశా కాళింది నదిలో ఉంది కాబట్టి ఆ సర్పానికి ఆ పేరు వచ్చి ఉంటుందా?? ఎదో అజ్ఞానంతో అడుగుతున్నాను రసజ్ఞ ఏమి అనుకోకుండా చెప్పు...
Rasagna gaaru,
Your wrtings and wealth of knowledge are astounding. I always appreciate your writings.
I have a small request, I am using the meaning of bhramarapanam brahmavir slokam from your 'Jyothy' article.
My kids go to sunday ( hindu) class here in US and all the kids there learn this slokam as food prayer and they practice this at home when ever they are having food. I wanted to share your version of the meaning in the magazine.
Hope you will not mind.
Thanks
Surabhi
( there was no away to reach you so i am putting as comment in this article though it is irrelevant here)
కుబేరుడి చర్తిత్ర సమగ్రం గ బాగా వివరించారు...కుబేరుడు రావణుడు సోదరులు అని విశ్రవుడి కుమారులని తెలుసు గాని వారి వంశ చరిత్ర కూడా బాగా వివరించారు...అలాగే పాంచాలికుడి చరిత్ర ఆసక్తికరం గ ఉంది...
ఎప్పటి లాగే అద్భుతం ఐన టపా...
ilaa aDugutunnaanani tappugaa anukOkamDi whats meant by ఉన్మత్తత
ee madhyana meeru ekkuvaga post cheyatledhu..meerila chesthe naku jnananni ekkadanunchi techulomantaru cheppandi
@ vamkasannam గారూ
:) ఒక సాధారమయిన మనిషే తన కర్మఫలం వలన ఆ స్థితికి వెళ్ళాడు కదండీ! అయినా మీరు చెప్పినట్టుగా తప్పకుండా మనుషుల గురించి వ్రాస్తాను, ధన్యవాదాలు!
@ చిన్ని ఆశ గారూ
ధన్యవాదాలండీ!
@ జయ గారూ
నిజంగా నా రచనలు మీకు అంతగా నచ్చుతున్నందుకు చాలా సంతోషంగా ఉందండీ! ధన్యవాదాలు!
@ తనూజ్ గారూ
:) అలా అడిగితే నేను మాత్రం ఏమంటాను చెప్పండి :) ఇంతకీ మీ కొత్త పిక్ చూసుకున్నారా? మీరు పంపిన పాట విన్నానండీ బాగుంది! థాంక్స్ (చెప్పమన్నారుగా) కాకుండా ధన్యవాదాలు!
@ హర్ష గారూ
ప్రతీ టపానూ చదువుతూ ప్రోత్సాహాన్నందించే మీకు సర్వదా కృతజ్ఞురాలిని.
@ రాజి గారూ
మీ అభినందనలకు అభివాదాలండీ!
@ పద్మార్పిత గారూ
థాంక్యూ సో మచ్!
@ చైతన్య గారూ
చాలా సంతోషంగా వుంది, ధన్యవాదాలండీ!
@ నవజీవన్ గారూ
అవునండీ, మీరన్నది నిజమే! అందుకే ఆ వ్యత్యాసాలను వివరించకుండా, అది ఒక నమ్మకం అని మాత్రమే వ్రాశాను. మీకు నచ్చి స్పందించినందుకు కృతజ్ఞతలు!
@ యుగంధర్ గారూ
అయ్యో, భలేవారే ఇందులో అనుకోవడానికేముంది? కాళీయుడు (ఇది ఒక పేరు) అనే పాము రమణక ద్వీపంలో వుండేది, గరుత్మంతుడు తనను తినేస్తాడేమో అన్న భయంతో కాళింది నదిలో కుటుంబంతో సహా నివాసముంటుంది. శ్రీకృష్ణుడు ఈ కాళీయుని పడగల పైన మర్దనం చేయటం వలన ఆయన పాదాల గుర్తులు కాళీయుని పడగలపై వుంటాయి. ఆ పడగలు వుండగా గరుత్మంతుడు తినడు అన్న అభయం ఇవ్వటంతో మళ్ళీ తన కుటుంబంతో రమణక ద్వీపానికి వెళిపోతాడు. సప్తపది చిత్రంలో పాటలో కూడా వుంది కదండీ, "కాళింది మడుగులో కాళీయుని పడగల" అని. ధన్యవాదాలండీ!
@ సురభి గారూ
నిస్సంకోచంగా వాడుకోండి, వ్రాసినది చదివి, గుర్తు పెట్టుకోవటమే కాకుండా, మరికొంతమందికి పంచుతానంటే అంతకన్నా ఏమి కావాలి? ఇదనే కాదు, నా వ్రాతలలో ఏదయినా ఉపయోగపడే విషయాన్ని వాడుకోవాలనిపించినప్పుడు నిరభ్యంతరంగా వాడుకోండి. మీ మెచ్చుకోలుకి కృతజ్ఞతలు!
@ కృష్ణ గారూ
ప్రతీ టపానూ చదివి ప్రోత్సహించే మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు!
@ అజ్ఞాత గారూ
ఇందులో అనుకోవడానికి ఏముందండీ? ఉన్మత్తత అనే పదానికి అర్థం కొంచెం నాటుగా చెప్పాలంటే పిచ్చి. ధన్యవాదాలు!
@ శ్రీ కృష్ణ గారూ
అయ్యయ్యో! ముందు నాకు తెలియాలి కదండీ, ఇక్కడ ఏదైనా వ్రాయాలంటే :) తీరిక చిక్కక, పని పెరిగి, ఇటు వైపు రావటం కాస్త తగ్గించాను. త్వరలోనే వ్రాస్తానండీ! ధన్యవాదాలు!
చాలా విలువైన సమాచారాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు.
టీవీయస్.శాస్త్రి
Hi there! I'm at work surfing around your blog from my new apple iphone!
Just wanted to say I love reading your blog and look forward to all your posts!
Carry on the excellent work!
Here is my blog post :: dating sites (bestdatingsitesnow.com)
Post a Comment