Monday, September 16, 2013

సాంబే పరబ్రహ్మణి


పరమేశ్వరుని నామ వైభవాలను స్మరిస్తూ, మనకు బాగా తెలిసిన ఎన్నో కథల ఆధారంగా శ్రీ శంకరాచార్యుల వారు రచించిన "దశ శ్లోక స్తుతి"కి ఒక వ్యాఖ్యాన ప్రయత్నం చేశాను. దానిని ప్రచురించిన మాలిక సంపాదక వర్గానికి ధన్యవాదాలు.   

 

శ్రీ శంకరాచార్యుల గురించి తెలియని వారుండరు. భగవంతుని చేరుకునేందుకు ఎన్నో మార్గాలను చెప్పారు కనుకనే ఈయనని శంకర భగవత్పాదులు అని కూడా పిలుస్తారు. "మహేశ్వరః శంకర నారాయణః" అనగా మహేశ్వరుడే శంకరుడు, శంకరుడే నారాయణుడు అంటూ అద్వైతాన్ని ప్రబోధించిన మహనీయుడు శంకరాచార్యులు. ఈయనని ఈశ్వరుని అవతారంగా జనులు భావిస్తారు. వైష్ణవ, శాక్తేయ, గానాపత్య, సౌర, శైవ, కాపాలిక మతాలను సమన్వయించి షణ్మత స్థాపకులయ్యారు. బ్రహ్మ సూత్రాలకు భాష్యం వ్రాసిన మహానుభావులు. భగవంతుడు అవసరాన్ని బట్టీ ఒక్కో రూపంలో ఒక్కో పనిని చేస్తాడు కానీ ఈ సృష్టంతా ఒకే రూపంతో నిండి వుంది అని చెప్పిన ఈయన ఎన్నో ప్రబోధాలను చేశారు, ఎన్నో స్తుతులను, అష్టకాలను రచించారు. వాటిల్లో సాంబే పరబ్రహ్మణి అనే మకుటంతో వ్రాసిన "దశ శ్లోక స్తుతి"ని పరిచయం చేస్తున్నాను. అంబతో కూడిన పరమేశ్వరుడే సాంబుడు. సృష్టి స్థితి లయ కారకుడు, పరబ్రహ్మ అన్నీ ఈ సాంబమూర్తే. అటువంటి సాంబ మూర్తి రూపాన్ని హృదయంలో నిలుపుకుని మనస్ఫూర్తిగా ధ్యానిస్తూ సుఖంగా వుందామని, ఆనంద పారవశ్యంలో మనం కూడా రమిద్దామని తెలియజేసే స్తుతే ఈ దశ శ్లోక స్తుతి. 

 

సాంబో నః కులదైవతం పశుపతే సాంబ త్వదీయా వయం
సంబం స్తౌమి సురాసురోరగ గణాః సాంబేన సంతారితాః ।

సాంబాయాస్తు నమో మయా విరచితం సాంబాత్పరం నో భజే

సాంబస్యానుచరోఽస్మ్యహం మమ రతిః సాంబే పరబ్రహ్మణి ॥1॥

 

ప్రతీ కవీ ఒక శ్లోకాన్నో, శతకాన్నో, పుస్తకాన్నో వ్రాసే ముందు తన ఇష్టదైవాన్నో, విఘ్నాలు కలగకుండా పూర్తవ్వాలని వినాయకుడినో తలుచుకుని ప్రారంభించడం పరిపాటి. అదే బాటలో శంకరాచార్యుల వారు ఈ దశశ్లోకస్తుతి ని తన కులదైవాన్ని తలుచుకుంటూ మొదలుపెట్టారు. సాధారణంగా ఏ పూజ చేయాలన్నా ముందుగా కులదైవ పూజ చేసి కానీ మిగతావి మొదలుపెట్టరు, కులదైవానికి అంత ప్రాముఖ్యత కల మన భారత దేశంలో సాంబ శివుని గురించి వ్రాసే ఈ స్తుతికి ఆ పరమ శివుడే తన కులదైవం అని చెప్పి మొదలుపెట్టారు. శివుడే మన కులదైవం కాగా మనమంతా ఆయనకు సంబంధించిన వాళ్ళం, ఆయన పరిరక్షణలో వుండేవాళ్ళం. సురులు (దేవతలు), అసురులు (రాక్షసులు), ఉరగులు (నాగులు), మొదలగు అన్ని గణాల వాళ్ళూ ఆ సాంబుడిని పూజిస్తారు. ఇక్కడ గణాల ప్రసక్తి అంత ప్రత్యేకంగా చెప్పడానికి కారణం, కేవలం ఈశ్వరునికి మాత్రమే అన్ని గణాల వారూ పూజలు చేస్తారు కానీ మిగతా దైవ రూపానికీ (విష్ణువుతో సహా) అన్ని గణాల వాళ్ళూ పూజలు చేయరు. సాంబుడే నాకు సర్వస్వం, ఆయనకు మించినది ఏదీ లేదు కనుక నా ప్రేమ, పూజ, నమస్కారం అన్నీ ఆయనకే అని ఈ శ్లోకం ద్వారా చెప్పారు.

 

సాక్షాత్తు శ్రీహరే "ఏక ఏక హి విశ్వేశో ద్వితీయో నాస్తి కశ్చన" ఈ జగత్తు మొత్తానికి విశ్వేశ్వరుడు మాత్రమే దేవుడు తప్ప వేరొకడు లేడు అని అన్నట్టు శ్రీ స్కంద పురాణంలో వున్నది. మనం పరబ్రహ్మ అని ఎవరినయితే అంటామో ఆ పరబ్రహ్మ స్వరూపమే సాంబశివుడు. అటువంటి స్వామిని కొలుస్తూ ఆయన ధ్యానంలో నా మనసు లగ్నం చేసి ఆనందాన్ని, రసాస్వాదనను పొందుతాను అని చెప్పారు. ఈ మొదటి శ్లోకం తప్ప మిగతా తొమ్మిది శ్లోకాలకీ "తస్మిన్మే హృదయం సుఖేన రమతాం సాంబే పరబ్రహ్మణి" అనే మకుటం వాడినా పది శ్లోకాలనీ పరిశీలించి "సాంబే పరబ్రహ్మణి" ని మాత్రమే మకుటముగా పరిగణించడం జరిగింది.  

 

 విష్ణ్వాద్యాశ్చ పురత్రయం సురగణా జేతుం న శక్తాః స్వయం

యం శంభుం భగవన్వయం తు పశవోఽస్మాకం త్వమేవేశ్వరః ।

స్వస్వస్థాన నియోజితాః సుమనసః స్వస్థా బభూవుస్తత

స్తస్మిన్మే హృదయం సుఖేన రమతాం సాంబే పరబ్రహ్మణి ॥2॥

 

మొదటి శ్లోకంలో సాంబుడే తన కులదైవమని చెప్పిన భగవత్పాదులు ఈ శ్లోకంలో ఆయనే పశుపతి అంటున్నారు. పశువులమయిన మాకందరికీ అధిపతివి కనుకనే పశుపతివయ్యావు. మేమంతా కూడా నీ చేత నియమింపబడ్డవాళ్ళం కనుక నువ్వు చెప్పినట్టు చేయడమే మా వంతు తప్ప నీ అనుమతి లేకుండా మేమేమీ చెయ్యలేము. అందువలననే విష్ణాది దేవతలంతా కూడా త్రిపురాసుర సంహార విషయంలో అశక్తులయిపోయారు అంటున్నారు. మరి త్రిపురాసుర సంహార విషయంలో శివుడు దేవతలందరికీ ఏ విధమయిన పనులను అప్పచెప్పి సంహారం చేశాడో తరువాతి శ్లోకంలో వివరించారు. ఇంచుమించుగా ఇదే భావాన్ని శివానందలహరిలో కూడా మనమందరం శివుని ఆట కోసం సృష్టించబడిన పావులం కనుక మనల్ని కాపాడవలసిన, జరపవలసిన బాధ్యత అంతా కూడా ఆ శివునిదే అని చెప్పటం జరిగింది.

 

ఈ శ్లోకం చదువుతుంటే మరొక అంతరార్థం తోస్తోంది. ఈశావాస్యోపనిషత్తులో "దంతిని దారు వికారే దారు తిరోభవతి సోఽపి తత్రైవ జగతి తథా పరమాత్మా పరమాత్మన్యపి జగతి తిరోధత్తే" అన్నట్టుగా దంతి అంటే ఏనుగు. ఒక కఱ్ఱతో చేసిన ఏనుగు బొమ్మని చూస్తే కొంతమందికి అది కేవలం (కొయ్య లేదా చెక్క లేదా) కఱ్ఱ గానూ, మరికొంతమందికి అది ఏనుగు గానూ కనిపిస్తాయి. కఱ్ఱ అనే ఆలోచనతో చూసేవారికి ఏనుగు, ఏనుగు అనే ఎరుకతో చూసేవారికి కఱ్ఱ కనిపించవు. అదే విధంగా, ఈ జగత్తు అంతటికీ మూలమయిన పంచభూతాలు అనే ఏనుగు పరమాత్మ అనే కొయ్యతో చేయబడినది కనుక మనం పంచభూతాలను చూస్తే పరమాత్మ, పరమాత్మను చూస్తే పంచభూతాలు కనిపించవు. అలా విడి విడిగా కాకుండా పంచభూతాలు పరమాత్మ స్వరూపాలు (ఇదే భావాన్ని అష్టమూర్తి నామం ద్వారా తొమ్మిదవ శ్లోకంలో వివరించారు), పరమాత్మ చేత చేయబడినవి అని చూడాలని చెప్తోంది. దేవతలంతా కూడా ఆ ఈశ్వరుడు నియమించిన వారే కనుక శంకరాచార్యుల వారు మేమంతా నీ చేత చేయబడిన వాళ్ళం, నీ చేత నియమింపబడిన వాళ్ళం అని వాడారనుకుంట. సమస్తము ఆ పరమేశ్వరుని నివాసమే అన్న అంతరార్థాన్ని ఈ శ్లోకం ప్రతిబింబిస్తోంది.  

 

క్షోణీ యస్య రథో రథాంగ యుగళం చంద్రార్క బింబద్వయం

కోదండః కనకాచలో హరిరభూద్బాణో విధిః సారధిః ।

తూణీరో జలధిర్హయాః శ్రుతిచయో మౌర్వీ భుజంగాధిపః

తస్మిన్మే హృదయం సుఖేన రమతాం సాంబే పరబ్రహ్మణి ॥3॥

 

"క్షోణీ క్షీణా లయే చయా" అని శ్రీ బ్రహ్మ వైవర్త పురాణంలో చెప్పినట్టుగా లయకాలమున క్షీణించేది కనుక భూమికి క్షోణి అనే పేరు వచ్చింది. అటువంటి భూమిని రథంగా మలిచాడు. ఇక్కడ భూమి అని చెప్పడానికి పృథ్వి, వసుధ, ఉర్వి, మహీ, విశ్వంభర, అచల, ఇజ్య, మొదలగు ఎన్నో నామాలుండగా క్షోణీ అనే నామాన్ని ఎంచుకోవడంలో మనం కవి భావాన్ని గమనించాలి. ఇక్కడ జరిగేది త్రిపురాసుర సంహారం కదా, త్రిపురాసురుడు లయకాలానికి దగ్గరగా వున్నాడు కనుక రెంటికీ సరిపడా భగవత్పాదుల వారు ఈ క్షోణీ అనే నామాన్ని ఎన్నుకోవటం జరిగిందని నా అనుకోలు. సరే మళ్ళీ యుద్ధ సన్నివేశం లోనికి వెళదాం. భూమిని రథంగా మలచి రథ చక్రాలుగా సూర్య చంద్రులను పెట్టాడుట. ఇహ యుద్ధం చేయడానికి కావలసిన ముఖ్యమయినది కోదండము అనగా ధనుస్సు. ఆ ధనస్సుగా కనకాచలాన్ని (కనక + అచలము అంటే బంగారు కొండ) అనగా మేరు పర్వతాన్ని పెట్టాడుట. హరిః అనగా విష్ణుమూర్తి బాణం అభూత్ అనగా బాణంగా మారాడు. రథానికి ఒక సారధి కావాలి కాబట్టి ఆ పదవిని విధి అనగా బ్రహ్మ గారు చేపట్టారు.

తూణీరం అనగా అంబుల పొది. ఆ అంబుల పొదిగా మారినది సముద్రుడు. పాల సముద్రంలోనే కదా శ్రీహరి వుండేది? అందుకనే ఏకంగా సాగరాన్ని అంబుల పొదిగా మార్చేసి శ్రీహరిని బాణంగా మలచాడు. శ్రుతులు అనగా వేదములు కనుక అవి గుఱ్ఱములుగా మారాయి. మనకు చతుర్వేదములు కనుక ఈ శ్లోకంలో ప్రత్యేకంగా తెలుపకపోయినా ఇక్కడున్న రథానికి నాలుగు గుఱ్ఱములు అని అనుకోవాలి. యుద్ధానికి కావలసినవి అన్నీ అమరాయి ఒక్క వింటినారి తప్ప, ఆ పనిని పాములకి రాజు అయినటువంటి వాసుకికి (లేదా ఆది శేషువు అని కూడా అనుకోవచ్చు) అప్పగించాడు. ఆ విధంగా వీరందరినీ తనకు కావలసినట్టు మలచుకుని తాను చేయవలసిన కార్యాన్ని పూర్తి చేశాడు సాంబుడు.

  

యేనాపాదితమంగజాంగభసితం దివ్యాంగరాగైః సమం

యేన స్వీకృతమబ్జసంభవశిరః సౌవర్ణపాత్రైః సమమ్ ।

యేనాంగీకృతమచ్యుతస్య నయనం పూజారవిందైః సమం

తస్మిన్మే హృదయం సుఖేన రమతాం సాంబే పరబ్రహ్మణి ॥4॥

 

అంగజుడు అనగా మన్మధుడు. అటువంటి మన్మధుడిని భస్మం చేసిన శివుడే ఆ భస్మాన్ని అంగరాగం అనగా లేపనము లేదా పైపూత లాగా తన శరీరమంతా పూసుకున్నాడు. అబ్జము అనగా పద్మము కనుక అబ్జ సంభవుడు అనగా పద్మములో పుట్టినవాడు అంటే బ్రహ్మ. మన పురాణాల ప్రకారం విష్ణుమూర్తి నాభి నుండీ వచ్చిన పద్మము నుండీ ఉద్భవించినవాడే కదా బ్రహ్మ! మొదట్లో బ్రహ్మ గారికి అయిదు తలలుండేవనీ శివుడు ఒక తలను గిల్లేశాడనీ కథనం. ఆ విధంగా తీసేసిన తలకాయకు సంబంధించిన కపాలాన్నే తన భిక్షా పాత్రగా స్వీకరించాడు. అలా ఆది భిక్షువు అనే నామాన్ని సార్ధకం చేసుకున్నాడు. విష్ణుమూర్తి కన్నుని పూజా పుష్పంగా స్వీకరించినవాడు కూడా సాంబుడే కదా మరి! ఆయన కన్నుని ఈయన ఎందుకు తీసుకున్నాడో, ఏ సందర్భంలో తీసుకున్నాడో ఏడవ శ్లోకంలో వివరించారు.

 

మనమంతా శివుడిని ముక్కోపి అనీ, ప్రళయ కారుడు అనీ భయపడతాం కానీ శివ తత్వాన్ని సరిగ్గా అర్థం చేసుకోము. పార్వతీ పరమేశ్వరులు మనకు తల్లిదండ్రులు కనుక శివుని పనులన్నిటినీ మనం ఒక తండ్రి చేసే పనులతో పోల్చుకోవాలి. పగలంతా ఎన్నో పనులు చేసి అలసి, సొలసి, విసిగిన శరీరం స్వాంతన పొందేది కేవలం నిద్రలోనే! దీనినే నిత్య ప్రళయం అంటారు. నిద్రనిచ్చేది శివుడే కదా? రోజంతా అలసిపోయిన పిల్లలని ఇక ఆటలాపి విశ్రాంతి తీసుకొమ్మని నిద్రపుచ్చే తండ్రిని చూసి ఏ విధముగా భయపడమో అదే విధంగా శివుని లాలిత్యాన్ని కూడా అనుభవపూర్వకంగా పొందిన నాడు మనం భయపడము. బిడ్డ మీద కోప్పడి అరచిన తండ్రి కొంతసమయం తరువాత బాధపడి తనే మళ్ళీ అక్కున చేర్చుకుని ఓదారుస్తాడు కదా, శివుడు కూడా అదే విధంగా మన్మధుడిని దహించి వేసినా ఎందుకూ పనికి రాని బూడిద అని వదిలెయ్యకుండా, ప్రేమగా తీసుకుని తన శరీరమంతా పులుముకుని ఆ బూడిదకి కూడా దివ్యమయిన స్థానాన్ని కలిగించాడు. అలాగే బ్రహ్మ కపాలాన్ని కూడా భిక్షా పాత్రగా తన వద్దే పదిల పరుచుకున్నాడు. ఈ విధంగా ఆయన చేసే ప్రతీ పనిలోనూ ఒక తండ్రి లాలన కనిపిస్తూనే వుంటుంది. 

 

గోవిందాదధికం న దైవతమితి ప్రోన్చార్య హస్తావుభా

వుద్ధృత్యాథ శివస్య సంనిధిగతో వ్యాసో మునీనాం వరః ।

యస్య స్తంభితపాణిరానతి కృతా నందీశ్వరేణాభవ

త్తస్మిన్మే హృదయం సుఖేన రమతాం సాంబే పరబ్రహ్మణి ॥5॥

 

మొత్తం దశ శ్లోకాలలోనూ ఒక సేవకుని స్వామి భక్తికి తార్కాణమయిన ఈ శ్లోకం నాకు బాగా నచ్చింది. శివుని పరమ భక్తుడు, నిత్యం సేవలు చేసుకునే మహద్భాగ్యం కలవాడు, సాక్షాత్తు పరమశివుని వాహనం అయినటువంటి నందీశ్వరుని మహిమ, భక్తి తెలియచేసే శ్లోకం యిది. మునులలో గొప్పవాడయినటువంటి వ్యాసుడు - విష్ణుమూర్తే గొప్పవాడు అని ఈశ్వర సాన్నిధ్యంలో చేతులు పైకెత్తి మరీ మ్రొక్కినవాడు కాస్తా తరువాత ఈశ్వరునికి భక్తుడయ్యాడు. ఇది చదవగానే సర్వం తెలిసిన వ్యాస మహర్షి, "వ్యాసాయ విష్ణు రూపాయ" అని స్తుతించబడిన వేద వ్యాసుడు హరిహరులకి భేదం చెప్పడమేమిటి? శివుని వద్ద విష్ణువుని పొగడటం ఏమిటి? వంటి ఆలోచనలు ఎన్నో కలుగుతాయి. ఈ సందేహాలు తీరాలంటే మనకి శ్రీ స్కాంద పురాణంలోని మూల కథ తెలియాలి.

ఒకసారి నైమిశారణ్యంలో శౌనకాది మునులందరి మధ్యా ముక్తిని ప్రసాదించేది శివుడా? విష్ణుమూర్తా? అనే అంశం మీద చర్చలు జరుగుతున్నాయిట. చివరికి ఆ మునులంతా ఈశ్వరుడే ముక్తిని ప్రసాదించేది అని ఒక నిర్ణయానికి వచ్చారుట. అదే సమయంలో అక్కడకి వచ్చిన వ్యాసుల వారిని చూసి, అతిధి మర్యాదలు చేసి, వేదాలు విభజించినవాడు, ఎన్నో పురాణాలు రచించినవాడు కనుక ఈయనని అడుగుదామని అడుగగా, వ్యాసుడు "వేదాలలోనూ, పురాణాలాలోనూ, ఇతిహాసాలలోనూ కూడా వర్ణింపబడినవాడు విష్ణుమూర్తి మాత్రమే కనుక ఆయనే సృష్టి స్థితి లయ కారకుడు, ఆది దేవుడు, మోక్ష దాత" అనేసరికి అక్కడి మునులంతా నిర్ఘాంతపోయి, మీకంటే తెలిసిన వారు వుండరు కానీ మా తృప్తి కోసం యిదే మాటని కాశీ విశ్వేశ్వరుని సన్నిధిలో చెప్పమని కోరారు. దానికి అంగీకరించిన వ్యాసుడు తన శిష్యులతో, మునులందరితో కలిసి కాశీకి వెళ్లి, పవిత్ర స్నానమాచరించి, మాధవుని ప్రార్ధించి, చేతులు రెండూ పైకి ఎత్తి మాధవుడే మోక్ష దాత అన్న వెంటనే ఆగ్రహించిన నందీశ్వరుడు వ్యాసుడు ఎత్తిన చేతులు ఎత్తినట్టే స్తంభించిపోయేలా, నోట మాట రాకుండా చేశాడు. గోవిందుడే గొప్పవాడు అని అంటుంటే శివుడు చిన్మందహాసంతో వింటూ గోవిందుడూ నేను వేరు కాదు కనుక వ్యాసుల వారు చెప్పినది నిజమే కదా అని వూరుకున్నారుట. స్వామి వూరుకున్నా సేవకుడు వూరుకోలేదు. వ్యాసులవారి భేద బుధ్ధి చూసి మిక్కిలి ఆగ్రహించాడు నందీశ్వరుడు. అప్పుడు విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యి "ఈ విశ్వమంతటికీ కూడా ఈశ్వరుడే దేవుడు, ఆయన వలననే నేను సుదర్శన చక్రం, లక్ష్మీదేవిని పొందాను. ముల్లోకాలనీ రక్షించగల సామర్ధ్యం కూడా నాకు ఆయనే ఇచ్చాడు కనుక నీవు ఆయననే ప్రార్ధించు" అని చెప్పెను. అప్పుడు శివుని ప్రార్ధించగా సంతసించిన నందీశ్వరుని అనుగ్రహం వలన వ్యాసునికి మాట, చేతులు తిరిగి స్వాధీనంలోకి వచ్చాయి. ఆనాటి నుండీ వేద వ్యాసుడు "లింగే ష్వేకో హి విశ్వేష స్తీర్థేషు మణికర్ణికా" అని చాటుతూ అద్వైతామృతాన్ని పంచాడు. శంకరాచార్యుల వారు కూడా అద్వైతులే కనుక ఈ శ్లోకం ద్వారా మరొక్కసారి ఆ సన్నివేశాన్ని మనకు గుర్తు చేశారు.

 

శ్లోకం అంతటిలో కేవలం మూడవ పాదానికి నాకు మరొక అన్వయం తోస్తోంది. అదే కుమార సంభవంలోని ఘట్టం. తారకాసుర సంహారం కోసం జరగవలసిన ముఖ్యమయినవి శివపార్వతుల వివాహం, కుమారస్వామి జననం కనుక దేవతలందరూ మన్మధుడికి మలయమారుతాన్నిచ్చి తపస్సులో వున్న శివుని వద్దకు పంపారు. మన్మధుని ప్రభావం చేత ఆ ప్రదేశమంతా ఆహ్లాదకరంగా మారి వసంత ఋతువు వచ్చింది. అసందర్భంగా వచ్చిన వసంతాన్ని చూసి, ఆశ్చర్యపోయిన నంది శివుని ధ్యానానికి భంగం కలుగకుండా తన చేతి సైగతో శాసించడం వలన ప్రకృతంతా ఒక చిత్రం గీసినట్టు నిలిచిపోయింది. ఈ రెండు సందర్భాలలోనూ కూడా సాంబుని నిత్యం పూజించడం వలన నందీశ్వరునికి వచ్చిన మహిమలను, శివుని మీద నందికి వున్న ప్రేమను మన ముందుకు తెచ్చారు.

 

 ఆకాశశ్చికురాయతే దశదిశాభోగో దుకూలాయతే

శీతాంశుః ప్రసవాయతే స్థిరతరానందః స్వరూపాయతే ।

వేదాంతో నిలయాయతే సువినయో యస్య స్వభావాయతే

తస్మిన్మే హృదయం సుఖేన రమతాం సాంబే పరబ్రహ్మణి ॥6॥

 

సాంబ మూర్తి రూపం మనకి యీ శ్లోకం ద్వారా తెలుస్తున్నది. ఆకాశమే ఆయనకు చికురములు అనగా కేశములు. శ్రీ శివాష్టోత్తర నామాలలో "ఓం వ్యోమ కేశాయ నమః" అనే నామము కూడా ఇదే విషయాన్ని తెలుపుతున్నది. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, వాయువ్యం, నైఋతి, ఈశాన్యం, ఆగ్నేయం, ఊర్ధ్వం, అథో అనే పది దిక్కులని తెల్లని పట్టు వస్త్రంగా ధరించాడు. ఆయన కేశపాశం చూస్తే ఆకాశం, ఆయన ధరించిన వస్త్రమేమో పది దిక్కులు. దానికి తోడు చల్లని కిరణములను ప్రసరింపచేయు చంద్రుడు ఆయన ఆభరణం. అల్లసాని పెద్దన గారు రచించిన మనుచరిత్రలో కూడా ఇదే భావాన్ని కొంచెం మార్చి శివుని జడ అనే తోటలో పూసిన అనావర్తం పువ్వు చంద్రుడు అని అభివర్ణించారు. ఇహ సాంబుని రూపమేమిటయ్యా అంటే స్థిరమయిన ఆనందం. "ఆనందో బ్రహ్మ" అన్నట్టుగా ఆనంద స్వరూపం సాంబశివుడు అని వర్ణన వున్నప్పటికీ యిక్కడ భగవత్పాదుల వారు స్థిరతరానందః అనగా స్థిరమయిన ఆనందమే ఆయన స్వరూపం అన్నారు. ఆశకు లొంగని, సమయముతో మారని (యివాళ వుండి రేపు పోయే ఆనందము కాదు), ఇంద్రియ వ్యాపారం వలన కలుగని ఆనందము కనుకనే స్థిరమయిన ఆనందమే సాంబశివుని రూపమని చెప్పారు. ముగ్ధ ముఖారవిందంతో, శాంతంగా, ఆనందంగా కనిపించే సాంబుని రూపమే దక్షిణామూర్తి.

 

ఎలా వుంటాడో చెప్పాక, యెక్కడ వుంటాడో కూడా చెప్పడం ముఖ్యం కనుక వేదాంతో నిలయాయతే అంటూ వేదాంతాలు అయినటువంటి ఉపనిషత్తులే ఆయన నివాసం అన్నారు. ఆకాశాన్ని కేశాలుగా, పది దిక్కులని దువ్వలువగా, చంద్రుడిని ఆభరణంగా లేదా అలంకారంగా చేసుకుని అక్కడెక్కడో వేదాంతాలలో ఆనందంగా వుండే ఆయన మనకి అంత సులభంగా దర్శనమిస్తాడా? అనే ఆలోచన రాకుండానే సువినయోయస్య స్వభావాయతే అంటూ సాంబునిది వినయంగా వుండే స్వభావమని వర్ణించారు. ఒక్క స్తోత్రం చేస్తే చాలు, ఒక్క నమస్కారం చేస్తే చాలు, జిల్లేడు, తుమ్మి మొదలైన పిచ్చి పూలతో పూజ చేసినా చాలు పరవశుడై అనుగ్రహాన్ని కుమ్మరించేస్తాడు. వినయ స్వభావుడు కనుకే ప్రేమగా, భక్తితో తిన్నడు మాంసం పెట్టినా స్వీకరించాడు, కాలితో తన్నినా నా బిడ్డే కదా అని ఆనందించాడు. ఈశ్వరానుగ్రహం పొందిన వారిలో చెప్పులు కుట్టేవాళ్ళు, చేపలు పట్టేవాళ్ళు, మొదలైన వారే ఎక్కువ. అటువంటి సర్వజన సులభుడు కనుకనే ఆయనకు ఆశుతోషుడు, భోలా శంకరుడు అనే నామాలు వచ్చాయి.  

 

విష్ణుర్యస్య సహస్రనామ నియమాదంభోరుహాణ్యర్చయ

న్నేకోనోపచితేషు నేత్రకమలం నైజం పదాబ్జద్వయే ।

సంపూజ్యాసుర సంహతిం విదలయంస్త్రైలోక్యపాలోఽభవ  

త్తస్మిన్మే హృదయం సుఖేన రమతాం సాంబే పరబ్రహ్మణి ॥7॥

 

విష్ణుమూర్తి శివుని భక్తుడని అందరికీ తెలిసినదే కదా! ఈ శ్లోకం ఆ భక్తిని వివరిస్తున్నది. విష్ణుమూర్తి నిత్యం శివ సహస్రనామ పారాయణం మానస సరోవరంలో వుండే సహస్ర కమలాలతో చేసేవాడుట. అలా చేస్తుండగా, ఒకానొక రోజున విష్ణువుని పరీక్షించదలచిన శివుడు ఒక కమలాన్ని తగ్గించి వేశాడుట. ఆఖరి నామానికి శివునిని పూజించడానికి కమలం లేనందున విష్ణువుకి వున్న రెండు కనులలో ఒక కన్నును తీసి అదే కమలముగా శివునికి అర్పించాడు. అప్పటినుండే విష్ణువుకి కమలాక్షుడు అనే పేరు వచ్చింది. అంతటి గొప్ప భక్తితో శివుడిని పూజించి ధ్యానించడం వలననే విష్ణుమూర్తి మిగతా దేవతలందరిలో కూడా గొప్పవాడయ్యి అందరితో పూజింపబడుతున్నాడు అని ఈ శ్లోకార్థం.

 

ఈ విషయాన్ని తెలియచేసే కథలు మనకెన్నో వున్నా ఇప్పటికీ చాలా మందికి ఇది కల్పితమో లేదా పుక్కిటి పురాణమో అనుకునే అవకాశం లేకపోలేదు. విష్ణుపురానికి సమీపంలో వుండే "తిరువీళిమిళలై" అనే క్షేత్రంలో కొలువున్న స్వామి పేరు నేత్రార్పణేశ్వరుడు అనీ, విష్ణుమూర్తి శివునికి తన కన్నును కమలముగా అర్పించిన ప్రదేశం ఇదే అనీ అక్కడి స్థల పురాణం. ఇప్పటికీ విష్ణుమూర్తి ఇక్కడ కొలువున్న స్వామిని నిత్యం పూజిస్తాడని నమ్మిక. లింగ పురాణంలోని శివ సహస్రనామ స్తోత్రంలోని ఫలశ్రుతిలో కూడా యిదే విషయం వుంది. 

 

 శౌరిం సత్యగిరం వరాహవపుషం పాదాంబుజా దర్శనే

చక్రే యో దయయా సమస్త జగతాం నాథం శిరోదర్శనే ।

మిథ్యావాచమపూజ్యమేవ సతతం హంస స్వరూపం విధిం

తస్మిన్మే హృదయం సుఖేన రమతాం సాంబే పరబ్రహ్మణి ॥8॥

 

ఈ శ్లోకం శివుని లింగోద్భవ కాలంలో ఆది, అంతము తెలుసుకోవాలని బయలుదేరిన బ్రహ్మ, విష్ణువుల గురించి తెలుపుతున్నది. లింగానికి ఆది ఎక్కడుందో తెలుసుకుని, లింగ పాద దర్శనం చేసుకుందామని శ్రీ హరి వరాహావతారం ఎత్తి భూమిలోనికి వెళ్ళాడుట. అదే సమయంలో బ్రహ్మ గారు లింగ శిరోదర్శనం చేసుకుందామని హంసలా మారి పైకి ఎగిరాడుట. విష్ణుమూర్తి మొదలు కనుక్కోలేకపోయిన విషయం నిజాయితీగా ఒప్పుకున్నా, బ్రహ్మ గారు మాత్రం శిరస్సు చూడలేదన్న నిజాన్ని ఒప్పుకోలేక మిథ్యా వాచం అనగా అబద్ధం చెప్పారుట. దానితో బ్రహ్మ మీద ఆగ్రహించిన శివుడు ఆయనకు అపూజ్యం అనగా పూజలు జరగకుండా శపించడం వలననే ఆయనకు ప్రత్యేక దేవాలయాలు లేవని అంటారు. నిజం ఒప్పుకున్న విష్ణువును మెచ్చిన శివుడు శ్రీహరికి పూజార్హతను, ఆలయాలను ఇచ్చాడుట. దీనిని మరింత లోతుగా ఆలోచిస్తే, పరమాత్మ వద్ద ఎన్నడూ అసత్యం ఆడకూడదు, నిజాయితీగా వుండాలి అని తెలుస్తుంది.

సాధారణంగా ఈశ్వరుని పరిపూర్ణ రూపానికి పరిమాణం లేదు కానీ లింగ రూపానికి మాత్రం ఒక పరిమాణం వుంది. "ఆపాతాళ సభ స్థలాంత భువన బ్రహ్మాండ మావిస్ఫురత్। జ్యోతి స్ఫాటిక లింగ మౌళి విలసత్ పూర్ణేందు వాతామృతైః" అనే శ్లోకం శివుని లింగ రూపాన్ని, పరిమాణాన్ని తెలియచేస్తున్నది. పాతాళం నుండీ ఆకాశం వరకూ సమస్తం ఒక లింగం. రూపం బ్రహ్మాండం (బ్రహ్మ + అండం) అనగా ఒక కోడి గుడ్డు లాగా వుంటుందిట. శుధ్ధమయిన స్ఫటికతో చేసిన జ్యోతిర్మయమయిన లింగం. మౌళి అంటే శిరస్సు కనుక ఆ శిరస్సు స్థానంలో చంద్రమండలం వుందిట. ఆ చంద్రమండలంలో అమృతం ఘనీభవమై వుంది, చంద్రుడే కదా మరి అమృతాన్నిచ్చేది! ఆ అమృతం శివలింగం శిరస్సు నుండీ క్రిందకి అభిషేకంలాగా జాలువారుతున్నది. ఆ విధంగా బ్రహ్మాండంలో వుండే భువనాలన్నిటికీ కూడా ఈ అమృత ధార వలన శీతలత్వం కలిగి చల్లబడుతోందిట! అందువలననే శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు ఈ శ్లోకం చదువుతూ ఈ సృష్టంతా వ్యాపించి వున్న ఆ మహాలింగానికి అభిషేకం చేస్తున్నామని భావించి చెయ్యాలి. 

 

యస్యాసన్ధరణీ జలాగ్నిపవన వ్యోమార్క చంద్రాదయో

విఖ్యాతాస్తనవోఽష్టధా పరిణతా నాన్యత్తతో వర్తతే ।

ఓంకారార్థ వివేచనీ శ్రుతిరియం చాచష్ట తుర్యం శివం

తస్మిన్మే హృదయం సుఖేన రమతాం సాంబే పరబ్రహ్మణి ॥9॥

 

ఈ సృష్టిలో ప్రతీదీ శివుడే అని తెలియచేస్తున్నదీ శ్లోకం. భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం అనే పంచ భూతాలూ, చంద్రుడు, సూర్యుడు, బ్రహ్మ (జీవునిలో కొలువుండే బ్రహ్మ) మొత్తం కలిపి ఎనిమిది కూడా సాంబశివుని రూపాలే. అందువలననే ఆయనకి అష్టమూర్తి అనే నామము వచ్చింది. ఈ ఎనిమిది లేని సృష్టే లేనందున ఈశ్వరుడు లేని చోటు లేదని తెలుపకనే తెలుపుతున్నాడు. సృష్టికి మూలమయిన ఓం కారం నుండే వేదాలన్నీ పుట్టాయని నమ్మే మనకి ఓం కార రూపమే ఆ పరమేశ్వరుడు.

 

ఇదే విషయాన్ని శంకరాచార్యుల వారే శ్రీ దక్షిణామూర్తి శ్లోకంలో కూడా "భూరంభాంస్యనలోనిలోఽoబర మహర్నాధో హిమాంశుః పుమానిత్యాభాతి చరాచరాత్మిక మిదం యస్యైవమూర్త్యష్టకం" అని రచించారు. భూమి, నీరు (అంభాంసి), అగ్ని (అనల), గాలి (అనిల), ఆకాశం (అంబరం), సూర్యుడు (అహర్నాధ), చంద్రుడు (హిమాంశు) మరియు జ్ఞాన/కర్మ కాండలకు అధికారి అయినటువంటి జీవుడు (ఈయననే బ్రహ్మ అంటారు, అహం బ్రహ్మాస్మి అంటాం కదా) కూడినటువంటి సముదాయమే సచ్చిదానంద రూపుడయిన పరమశివుని అష్టమూర్తి రూపం అన్నారు. తాళ్ళపాక అన్నమాచార్యులు కూడా బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే అన్నారు. శ్రీమద్భగవద్గీతలో కూడా "భూమిరాపోఽనలో వాయుఃఖం మనో బుద్ధి రేవచ అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టధా" అనే శ్లోకం ఇదే విషయానికి మరింత బలాన్ని చేకూరుస్తోంది. 

 

 విష్ణుబ్రహ్మసురాధిప ప్రభృతయః సర్వేఽపి దేవా యదా

సంభూతాజ్జలధేర్విషాత్పరిభవం ప్రాప్తాస్తదా సత్వరం ।

తానార్తాంశరణాగతానితి సురాన్యోఽరక్ష దర్ధక్షణా

త్తస్మిన్మే హృదయం సుఖేన రమతాం సాంబే పరబ్రహ్మణి ॥10॥

 

క్షీర సాగర మథన ఘట్టాన్ని వివరిస్తున్నదీ శ్లోకం. బ్రహ్మ, విష్ణు, మొదలయిన దేవతాధిపులందరూ కూడా నిన్నే ఆది దేవునిగా పూజించి విషాన్ని నీకు అర్పించారు. దానిని కూడా లోక రక్షణ కోసం స్వీకరించి అందరినీ కాపాడావు అని అర్థం. క్షీర సాగర మథనం జరిగినప్పుడు మొట్టమొదటగా వచ్చినది హాలాహల విషం. మనకున్న నవ విషాలయినటువంటి హాలాహల, కాలకూట, బచనాగ, శృంగక, ప్రదీపన, బ్రహ్మపుత్ర, హరిద్ర, సౌరాష్ట్రిక, సక్తక లలో అత్యంత భయంకరమయినది హాలాహల విషం. ఒప్పందం ప్రకారం ముందుగా వచ్చినది దేవతలకే చెందాలి కనుక ఈ విషాన్ని కూడా దేవతలే స్వీకరించాలి. ఆ విధంగా, దీనిని దేవతలంతా తీసుకెళ్ళి బ్రహ్మకు యిస్తారు. విష్ణువు నాభి నుండీ పుట్టినవాడు కనుక ఆ విషాన్ని బ్రహ్మ గారు విష్ణువుకి యిస్తారు. విష్ణువు ఈశ్వర రూపమే కనుక ఆది దేవుడయిన శివునికి అగ్ర తాంబూలాన్ని స్వీకరించమని హాలాహలాన్ని యిస్తాడు. అది కఠినమయిన విషమని తెలిసినా లోకరక్షణ కోసం పార్వతీదేవి సమ్మతితో ఆ విషాన్ని సేవించి తన గరళంలో బంధించాడు పరమేశ్వరుడు. ఆ విష ప్రభావానికి శివుని కంఠం నీలంగా మారిపోయింది. అందువలననే ఆయనకి గరళ కంఠుడు, నీల కంఠుడు అనే నామాలు వచ్చాయి.

 

విష ప్రభావం వలన శివునిలోని వేడిని చల్లార్చేందుకే చల్లని కిరణాలను ప్రసరింప చేసే చంద్రుడిని, చల్లని గంగమ్మ తల్లిని తన తల మీద పెట్టుకున్నాడు. ఇన్ని వున్నా కూడా శివునికి వేడి భరించలేనంతగా వుందిట, అందుకనే శివలింగానికి నిత్యం ఉదకాభిషేకం చేస్తారు. అలా శివుడు అభిషేక ప్రియుడనమాట! ఈ క్షీరసాగర మథన సమయంలో శివుడు చంద్రుడిని నెత్తి మీద పెట్టుకున్న విషయాన్నే శ్రీనాథుడు తను రచించిన శృంగార నైషధంలో చెప్తూ చంద్రుడిని ధవళగరళం అని చమత్కరించారు. మరి విషానికి విరుగుడు విషమే కదా? ఆ విధంగా, హాలాహల ప్రభావం వలన కలిగిన తాపము ధవళ గరళము అయినటువంటి చంద్రుని వలన ఉపశమనం పొందుతోందనమాట!


వివిధ రూపాలలో ఆ మహాశివుని కొలుస్తూ రచించిన ఈ స్తవం అద్వైతానికి ఎలా సరిపోతుంది అనే ఆలోచన రావచ్చును. వైష్ణవులు విష్ణువుని, శైవులు శివుని గొప్పవానిగా చెప్పుకుంటారు. అద్వైతులు మాత్రం ఇద్దరూ ఒకటే అని నమ్ముతారు. మనకున్న రెండు నేత్రాలలో ఏది ముఖ్యం, ఏది గొప్పది అంటే ఏం చెప్తాం? అదే విధంగా శివకేశవులిరువురూ సమానులే. మనకున్న త్రిమూర్తులకి త్రిగుణాలను ఆపాదించినప్పుడు బ్రహ్మకు రజో గుణం, విష్ణువునకు సత్వ గుణం, శివునికి తామస గుణం చెప్తారు. బ్రహ్మ గారిని కాసేపు ప్రక్కకు పెడితే, శివుడు భస్మాన్ని పూసుకుంటాడు కనుక ఆయన రంగు తెలుపు, నివాసం కైలాసం కనుక అదీ తెలుపే, వాహనము నంది కనుక అదీ తెలుపే, ఆయన లింగం కూడా స్ఫటికం అని చెప్పుకున్నాం కనుక అదీ తెలుపే. ఇవన్నీ కూడా సత్వగుణ సూచకాలు. మరి శివుడు చేసేది ప్రళయం, సంహారం ఇవేమో తమోగుణ సూచకాలు. విష్ణువు రంగు నలుపు, స్థితి నిద్ర కనుక ఇవన్నీ తమోగుణ సూచకాలు. మరి ఆయన చేసే పని మాత్రం లోక రక్షణ, లోకపాలన ఇవేమో సత్వగుణ సూచకాలు. శివకేశవులిరువురూ సత్వ-తమో గుణములు రెండూ కలిగివున్నందున వీరిరువురూ సమానులే. శం కరోతీతి శంకరః అన్నారు అంటే సుఖమును కలిగించువాడు శంకరుడు. మన అద్వైత సిద్ధాంతం తెలియచేసేది మొక్షానందం గురించే కనుక భగవత్పాదుల వారు శంకర నామ వైభవం ద్వారా అపరోక్షానుభూతిని వ్యాపింపచేశారు.


 

నమః శంభవే చ మయో భవే చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ

Monday, February 04, 2013

తౌర్యత్రిక కళ


మానవుడు మనోహీనుడై జీవించలేడు. కనుక మానవునిగా మహోన్నత స్థితిని పొందాలన్నా, మానసిక ఆనందాన్ని పొందాలన్నా కళల సాన్నిహిత్యం తప్పనిసరి. తనంతట తాను ప్రకాశిస్తూ ఇతరులను సైతం ప్రకాశింపచేసేది కళ. "మనిషిలో మంచిని పెంచి, అమానుష లక్షణాలను త్రుంచి, పురుషోత్తమునిగా మలచుటకు, సర్వమానవ కళ్యాణానికీ, సాంస్కృతిక ఉన్నతికీ, దోహదపరచుటే కళకు ప్రయోజనం" అని ధర్మపురి కృష్ణమూర్తి గారు చెప్పారు. కళకు ఒక నిర్వచనం చెప్పటం అంత సులభం కాదు, ప్రకృతిలోని ప్రతీ దృశ్యమూ కళాత్మకమయినదే. "కళా సమన్వితమయిన జగత్తు సుందరమయినది, సుందరమయిన జగత్తు విశాలమైనది, విశాలమైన జగత్తు అనంత చైతన్యముతో విలసిల్లునది. ఈ బహుముఖ ప్రజ్ఞా తేజస్సు కళ వల్లనే ఆవిర్భవించుచున్నది" అని కళాశబ్దం ప్రస్తుతింపబడినది. మనకున్న 64 కళలలో, కొన్ని (చిత్రలేఖనం, సంగీతము, నృత్యము, నాటకము, మొ.) మాత్రమే ఇప్పుడు చెప్పుకున్న లక్షణాలను చూపిస్తాయి, వాటినే లలిత కళలు అంటారు. ఈ లలిత కళలనే జయదేవుడు గీత గోవిందంలో (మూడవ శ్లోకం) విలాస కళలుగా పేర్కొన్నాడు. వీటిల్లో ప్రథమ గణ్యమైనదీ, పరమోదాత్తమైనదీ, సర్వకాల సర్వావస్థలయందు మానవుని మనుగడతో పెనవేసుకొన్న అపూర్వ కళాసృష్టి, సర్వకళల సమాహార స్వరూపంగా చెప్పబడేదే తౌర్యత్రిక కళ.

సంగీత, సాహిత్య, నాట్య కళల సమాహార స్వరూపమయిన కళను తౌర్యత్రిక కళ అంటారు. ఇటువంటి తౌర్యత్రిక కళలలో ముఖ్యమయినది "హరికథ". సాధారణంగా గాయకుడు గానంలోనూ, సాహిత్యకారుడు సాహిత్యంలోనూ, నాట్యకారుడు నాట్యంలోనూ మాత్రమే తన ప్రతిభను చూపిస్తాడు. కానీ  తౌర్యత్రిక కళగా చెప్పబడుతున్న హరికథను చెప్పేవాడు మాత్రం అభినయ కళను కూడా జతచేసి ఈ మూడిటిలోనూ (సంగీత, సాహిత్య, నాట్యాలలో) ప్రతిభను చూపించాలి. హరికథలు వేదకాలం నుండీ ఉండేవి, అగ్నివేశాది మహర్షులు సృజించగా, బ్రహ్మమానస పుత్రుడైన నారదుడు భక్తి సూత్రాలను ఉపదేశిస్తూ నిత్యం హరికథా గానం చేస్తాడు. లవకుశలు ఇరువురూ హరికథా గానం చేసినట్టు రామాయణంలో కూడా ఉంది కదా! హరికథ దివ్యమయిన (దివిభవం దివ్యం - అనగా స్వర్గమున పుట్టినది అనే వ్యుత్పత్తి ఆధారంగా ఇది దివ్యం) కళ. "ఈ హరికథా ప్రక్రియ మహారాష్ట్రలో రెబ్బటిల్లి, తమిళ దేశంలో చిగిర్చి, ఆంధ్ర దేశంలో పూసి, కాసి, ఫలించింది" అని శ్రీ కడలి వీరదాసు గారు (హరికథా మహోత్సవ ప్రత్యేక సంచికలో) తెలియచేశారు.

యావదాంధ్ర వాఙ్మయములో బహుముఖ వైవిధ్యమును, వైశిష్ట్యమును కలిగిన విశాల సాహిత్య శాఖగానూ, సాహితీ ప్రక్రియలన్నింటిలోనూ పరమోత్కృష్టమైన శాఖగానూ పేరు ప్రఖ్యాతలు పొందిన యక్ష గానమే హరికథగా రూపాంతరము చెందినదని విజ్ఞుల అభిప్రాయము. హరికథా పితామహులుగా ప్రసిద్ధుడైన శ్రీ మదజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు గారు రచించిన ప్రహ్లాద చరిత్ర అను హరికథావతారికలో యక్షగానాలకు హరికథలకు అభేదం చెప్పారు. అయితే, ఈ రెంటికీ ప్రదర్శన విషయంలో కొంత భేదం కనిపించినా, అంగాలు, కీర్తనలూ, తత్వనలూ అన్నీ ఒకే విధంగా వుంటాయి. మరి రెంటికీ భేదం ఎక్కడుందంటే, యక్షగానంలో బహుపాత్రలను అనేకమంది నిర్వహిస్తే, హరికథలో ఒకే వ్యక్తి బహుపాత్రలను నిర్వహిస్తాడు. అందువలననే యక్షగానము కన్నా కూడా హరికథ ఉత్కృష్టమయినది. ముల్లోకాలనూ పునీతం చేసి, జాతిని తీర్చిదిద్ది, భారతీయ సంస్కృతికి నిజమైన దర్పణంగా నిలిచి, ఆబాల గోపాలాన్నీ ఆహ్లాదపరుస్తూ, అవ్యక్త మధురానుభూతిని ప్రసాదించే మహోన్నతమయిన కళ హరికథ. హరిని కీర్తించుటే హరికథ. "అనగా బ్రహ్మము అనగా వుండునది. బ్రహ్మమును కలిగి వుండి, వినుట ద్వారా బ్రహ్మమును పరిచయం చేసేదే  కథ" అని శ్రీ తంగిరాల సుబ్రహ్మణ్య శాస్త్రిగారు నిర్వచించారు. హరికథ చెప్పేవారిని కథకుడు అంటారు. భక్తి రస ప్రధాన పురాణ గాథలలో ఏదైనా ఒక అంశం తీసుకుని, గద్యములు, పద్యములు, గానము, హాస్యము, చతురత, సమయస్ఫూర్తి, మొదలైన వాటిని చొప్పించి శ్రోతలను ఆకట్టుకుంటూ ప్రవచించటమే హరికథ. 

భావంబొప్పవలెన్ ముఖాన నిసలౌ పాండిత్య మేతత్కళా
జీవంబై రససిద్ధి బొందవలె నౌచిత్యంబుపన్యాసవా
ణీవిన్యాసమునన్ ఘటిల్లవలెన్ దానేసర్వపాత్రంబులై
ప్రావీణ్యంబులన్ నటింపవలె విద్వాంసుడు సమ్యద్గతిన్   

అంటూ శ్రీ పెద్దింటి సూర్యనారాయణ దీక్షితదాసు గారు కథకుడు బహుపాత్రలను పోషిస్తూ కథకు రక్తినీ, తుష్టినీ చేకూర్చాలని చెప్పారు. కథకుడు సందర్భాన్ని బట్టే కాకుండా సభికులను బట్టి కూడా కథాగమనం కొనసాగించాలి. కనుక ముందుగా బాగా సాధన చేసి వెళ్లి హరికథ చెప్పేసి వచ్చేస్తే అది రక్తి కట్టదు. కథకుడు ఎప్పుడూ కూడా సభికులను ఆకట్టుకొనే విధంగా వ్యాకరణ పండితులున్న సభలో వ్యాకరణ పరిజ్ఞానాన్ని, సాహిత్యజ్ఞులున్న సభలో కవితా ప్రాభవాన్ని, సంగీతజ్ఞులున్న సభలో సంగీత ప్రజ్ఞను ప్రదర్శిస్తూ, పామరులు వున్న సభలో వారిని రంజింప చేసే విధంగా పిట్ట కథలు, ఉప కథలు, హాస్యం జోడిస్తూ మూల కథకు అడ్డు రాకుండా, ప్రచార విషయానికి భంగం కలిగించకుండా సభనంతటినీ ఆకట్టుకుంటూ చెప్పగలిగినవాడే తన లక్ష్యాన్ని సాధించి, ప్రజలలో తాననుకున్న మార్పును తీసుకువచ్చి, వారికి మార్గ దర్శకుడవుతాడు. ఇంకా సూటిగా చెప్పాలంటే హరికథకుడు నవరసాలూ పోషిస్తూ, అన్ని రసాలకూ ఏకాగ్రచిత్తుడై వుండాలి. ఇన్ని చేయాలి కనుకనే హరికథ కష్టమయినా కానీ అన్ని వర్గాల వారినీ అలరిస్తుంది.

మొదట భక్తి తత్వమే ప్రాణంగా హరికథలు ఆవిర్భవించాయి. అద్వైత సిద్ధి మొదలు ఆటవిక విశ్వాసం వరకు ఏ రకంగా ప్రదర్శింపబడినా అది భక్తిగానే పరిగణించారు. వీటి వలన ఆధ్యాత్మిక ప్రభోదం కూడా జరిగేది. ఇటువంటి హరికథల వలన కథకులు మోక్షసాధన కోసం సంగీత, సాహిత్య, నాట్యాలను ఆలంబనగా చేసుకుని, వైష్ణవాన్నీ, శైవాన్నీ సమానంగా భావించి, సామాజికుల చేత కూడా భావింపచేసి సర్వమత సామరస్యాన్ని చాటేవారు. కొంతకాలం ఇటువంటి హరికథలు కేవలం హిందువులకే పరిమితమయ్యి, హైందవ సంప్రదాయాన్ని ఎక్కువగా ప్రదర్శించడం వలన హైందవ మత ప్రచారానికే ఎక్కువగా దోహదం చేస్తూ వచ్చాయి. కాలం గడిచే కొద్దీ, ఇతర మతస్థులైన క్రైస్తవులను, మహమ్మదీయులను కూడా విశేషంగా ఆకర్షించింది. ప్రజల్లో ఏ విషయాన్ని ప్రచారం చేయాలన్నా (అప్పట్లో మరి ప్రచార సాధనాలు తక్కువ కదా!) హరికథా ప్రక్రియే సరైన, శక్తివంతమైన మార్గమని గుర్తించారు. వారి మత ప్రచారానికి ఆలంబనగా "హరి" శబ్దాన్ని అడ్డుగా భావించకుండా ఒక కథా కాలక్షేపంగా వారు ఏసు ప్రభువు జీవిత చరిత్రను, మహమ్మదీయుల చరిత్రలను కూడా కథా రూపాలుగా చేసుకుని వానిని హరికథలుగా మలచుకుని ప్రచార యోగ్యంగా కూర్చుకున్నారు. రాన్రాను కాలానుగుణంగా భగవత్సంబంధిత గాథలే కాక, దేశనాయకులు, క్విట్ ఇండియా, కుటుంబ నియంత్రణ, సమాజాన్ని పీడిస్తున్న అంశాలు, మొదలయినవెన్నో ఇతివృత్తాలుగా చేసుకుని హరికథలు చెప్పటం ప్రారంభించారు. ప్రజల నుండీ ఇటువంటి కథలకు మునుపటి వాటికంటే ఆదరణ, ప్రోత్సాహం ఎక్కువగా లభించాయి.

హరికథలు చెప్పటమే కాదు, వ్రాయటమూ ఒక కళే. శ్రీ రాంపల్లి శ్రీరామచంద్రమూర్తి గారు "కుమార సంభవము" ను, శ్రీ పెద్దింటి సూర్యనారాయణ దీక్షితులు గారు "అభిజ్ఞాన శాకుంతలం" ను, చక్రవర్తుల కృష్ణమాచార్యులు గారు "మాళవికాగ్ని మిత్రమ్" ను హరికథలుగా రచించారు. వీటి ప్రదర్శనల ద్వారా మన దేశానికే పరిమితమయిన హరికథలను విదేశీయులు సైతం అబ్బురపడేలా చేశారు మన హరికథకులు. శ్రీ అమ్ముల విశ్వనాధం గారు మలేషియాలో, శ్రీ వీరగంధం వెంకట సుబ్బారావు భాగవతార్ గారు అమెరికాలో, శ్రీ బోడావుల సీతారామయ్య భాగవతార్ గారు జర్మనీ, పారిస్, లండన్ వంటి దేశాలలో పలు ప్రదర్శనలిచ్చి, వాటి ద్వారా వారిలో భారతీయ సంస్కృతీ, సాంప్రదాయాల పట్ల అవగాహన ఏర్పరచడమే కాక, భారతీయ కళల పట్ల వారికి ఉన్నతమైన అభిప్రాయాన్ని కూడా కలిగించారు. ఇంతటి మహోన్నతమయిన హరికథకు పితామహులైన శ్రీ మదజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు గారి గురించి ఒక్క మాటలో (తాతారావు గారి పలుకుల్లో) చెప్పాలంటే: 

హరికథా ప్రక్రియకు ఆద్యుండు కవితలో
కాళిదాస పోతనలకు సాటి
ఆదిభట్ట బుధుడు అన్నిటన్ మొనగాడు
ఆట పాట మాట లందు మేటి
ఇంతటి అపూర్వమయిన కళ అంతరించిపోకుండా ఎంతో మంది నేర్చుకోవాలనే సదుద్దేశ్యంతో హరికథా శిక్షణకు ప్రత్యేకంగా ప్రప్రధమంగా 10-6-1973న కపిలేశ్వరపురం (రాజమహేంద్రవరానికి 36కిలోమీటర్ల దూరం), తూర్పు గోదావరి జిల్లాలో "హరికథా పాఠశాల"ను శ్రీ యస్.బి.పి.బి.కె.సత్యనారాయణ రావు (కపిలేశ్వరపురం జమీందారు)గారు స్థాపించి, ప్రధానాచార్యులుగా శ్రీ కడలి వీరదాసు (శ్రీ మదజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు గారి శిష్యుడు) గారిని నియమించారు. మన జాతి కళలు కాపాడుకోవలెనన్న ఆశయంతో ప్రభుత్వం వారు ఇక్కడ శిక్షణ పొందుతున్న విద్యార్ధులలో కొంతమందిని ఎంపిక చేసి స్కాలర్షిప్ కూడా ఇస్తారు. ఈ పాఠశాలలో అయిదు సంవత్సరాల శిక్షణాకాలం పూర్తయిన తరువాత పరీక్షలను నిర్వహించి, "హరికథా ప్రవీణ"  అను ధృవీకరణ పత్రాన్ని ఇచ్చి, వారిని ప్రదర్శనకు యోగ్యులుగా నిర్ణయిస్తుంది. ఈ సంస్థ నుండి తయారైన బాలబాలికలు తెలుగులో మాత్రమే గాక సంస్కృతంలో కూడా హరికథలు చెబుతూ ఎన్నో సత్కారాలు పొందారు. వారిలో ప్రముఖులు దాలిపర్తి ఉమామహేశ్వరి గారు. ఉజ్జయినిలో  కాళిదాస అకాడమీ వారు నిర్వహించే అంతర్జాతీయ సెమినార్ లో ఈవిడిచ్చిన ప్రదర్శనల ద్వారా హరికథా ప్రక్రియకు ఒక ప్రత్యేక స్థానం, గుర్తింపు లభించాయి.

మన రాష్ట్రంలో జానపద కళారూపాలుగా చెప్పబడుతున్న హరికథలు, బుఱ్ఱకథలు, మొదలైన వాటిని ప్రోత్సహించాలని తెలుగు విశ్వవిద్యాలయం వారు హరికథా రచనా పోటీలు, హరికథా ప్రవచనా పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ తెలుగు విశ్వవిద్యాలయానికి కులపతి గారైన ఆచార్య శ్రీ దోణప్ప గారు రచించిన "తెలుగు హరికథా సర్వస్వం" అనే పుస్తకాన్ని (హరికథకు సంబంధించిన ప్రతీ విషయాన్నీ పొందుపరుస్తూ) అత్యున్నత ప్రమాణాలతో తీర్చిదిద్దారు. డా. డి. శారద గారు రచించిన "హరికథా ప్రక్రియ - సామాజిక ప్రయోజనాలు" (ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండీ పి.హెచ్.డి. పొందిన గ్రంధం) అనే పరిశోధనా గ్రంధంలో హరికథల వలన దేశానికి జరిగే మేలు ఎలాంటిదో కూడా బాగా వివరించారు. ఈ రెండు పుస్తకాలనూ క్షుణ్ణంగా చదవటం వలన హరికథా ప్రక్రియల ప్రాచీన స్వరూపం నుండీ ఆధునిక స్వరూపం దాకా ప్రతీ విషయమూ వివరంగా తెలుస్తుంది.

కొన్ని చక్కని హరికథలను ఇక్కడ వినవచ్చును. పాత చలన చిత్రాలలో హరికథలు ఎక్కువగానే కని, వినిపించేవి కానీ ఈ మధ్యన వచ్చిన చిత్రాలలో దేవస్థానం అనే చలనచిత్రంలో చాలా కాలం తరువాత దండిభట్ల నారాయణమూర్తి గారు, స్వర వీణాపాణి గారు రచించిన హరికథలను (సామాజిక) వినిపించి మరచిపోతున్న హరికథా ప్రక్రియను గుర్తుచేశారు.

One must die as an artist to be reborn as a Yogi అన్న అరవిందుని సూక్తి కళాకారులకున్న ఔన్నత్యాన్ని చాటుతోంది. దీనిని ఎప్పుడూ జ్ఞప్తిలో వుంచుకుని, ఇటువంటి కళలను కాపాడుకుంటూ, తరువాతి తరాలకు పంచవలసిన (కనీసం పరిచయం చేయవలసిన) బాధ్యత మనందరి మీదా వుందని భావిస్తున్నాను. హరికథకు పూర్వ వైభవం దక్కాలని మనసారా కోరుకుంటూ...............

Monday, January 07, 2013

కుబేరుడు



నేను వ్రాసిన ఈ వ్యాసాన్ని ప్రచురించిన మాలిక సంపాదక వర్గానికి కృతజ్ఞతలతో…..

సిరి సంపదలకు, నవ నిధులకు అధిపతి అయిన కుబేరుడు ఉత్తర దిక్పాలకుడు, లోకపాలకుడు, ధనదుడు, ధనాధిపతి, యక్షరాజు, రాక్షసాధిపతి, భూతేశుడు, గుహ్యకాధిపతి, కిన్నెరరాజు, మయురాజు, నరరాజు. అథర్వణ వేదం ప్రకారం ఈయన గుహ్యాధిపుడు కూడా! కుబేరుడు అనగా అవలక్షణమయిన (లేదా అవలక్షణాలున్న) శరీరము కలవాడు (బేరము అంటే శరీరము) అని అర్థము. పేరుకి తగ్గట్టుగానే ఈయన పొట్టిగా (మరగుజ్జులా), పెద్ద కుండ వంటి పొట్టతో, మూడు కాళ్ళు, ఒకే కన్ను, ఎనిమిది పళ్ళతో ఉంటాడని మన పురాణాలలో చెప్పబడింది. శ్రీ విష్ణు ధర్మోత్తర పురాణం ప్రకారం, కుబేరుడు రత్నగర్భుడు. బంగారు వస్త్రాలతో, మణులు పొదగబడిన బంగారు ఆభరణాలతో ఉంటాడు. ఈయన ముఖము ఎడమవైపుకి వాలినట్టు ఉంటుందనీ, మీసం, గడ్డం కలిగి ఉంటాడనీ, దంతాలు బయటకి వచ్చి (వినాయకుని దంతాల వలె) ఉంటాయనీ ఉంది. అదే విధముగా, శ్రీ శివ, మత్స్య, స్కాంద పురాణాల ప్రకారం, కుబేరుని శరీరం మాత్రం వినాయకుని పోలి ఉంటుందని చెప్పబడింది. కైలాసం వద్దన ఉండే అలకానగరం కుబేరుని నివాస స్థలం.

ఈయన జనన సంబంధిత విషయాలు శ్రీ శివ పురాణంలో సూత మహర్షి శౌనకాది మునులకి చెప్తున్నట్టు వస్తుంది. ఆ ప్రకారంగా, పూర్వము కాంపిల్య నగరంలో యజ్ఞదత్తుడు - సోమిదమ్మ అనే బ్రాహ్మణ దంపతులు ఉండేవారు. వేద, వేదాంగాలు, శాస్త్ర, పురాణాలు అన్నిటిలో ప్రావీణ్యత ఉన్న యజ్ఞదత్తుడు రాజాదరణ పొంది రాజగురువుగా నియమింపబడ్డాడు. వీరి ఏకైక సంతానం గుణనిధి. అతను చెడు సావాసాల వలన జూదమునకు బానిసయ్యి, ఆ జూద క్రీడ కోసం దొంగతనాలు కూడా మొదలుపెట్టాడు. తల్లయిన సోమిదమ్మకి ఇవన్నీ తెలిసినా గారాబంతో మందలించకపోగా, భర్తకు ఈ విషయాలు తెలిస్తే ఎక్కడ కోప్పడతాడో అన్న భయంతో మౌనం వహించేది. యజ్ఞదత్తుడు రాజమందిరంలో కార్య కలాపాలలో నిమగ్నమై కొడుకుని పట్టించుకునేవాడు కాదు. ఎప్పుడయినా కొడుకు గురించి భార్యను వాకబు చేస్తే, ఆవిడ పుత్ర ప్రేమతో చదువుకోడానికి గురువు గారి వద్దకు వెళ్ళాడనో, గుడికి వెళ్ళాడనో అబద్ధం చెప్పి భర్తను మభ్య పెట్టేది. దానితో గుణనిధికి అడ్డు, అదుపు లేక ఇంటిలో నగలన్నీ దొంగిలించి మరీ జూదమాడి ఓడిపోతూ ఉండేవాడు. అలా తన తండ్రికి రాజుగారిచ్చిన వజ్రపు ఉంగరం కూడా జూదంలో పెట్టి ఓడిపోయాడు. ఆ ఉంగరం గెలుచుకున్న వ్యక్తి అనుకోకుండా యజ్ఞదత్తుని కంట పడటం, యజ్ఞదత్తుడు ఆ ఉంగరం తనదని గుర్తించి అతనిని నిలదీయటం, అతను జూదంలో గుణనిధి వద్ద గెలుచుకున్నానని చెప్పటంతో యజ్ఞదత్తుని నోట మాట రాలేదు. ఆ రోజు దాకా కొడుకు ఏమి చేస్తున్నదీ తనకు తెలియని పరిస్థితిలో ఉన్నందుకు సిగ్గుపడుతూ, భార్యా బిడ్డల మీద కోపంతో ఇంటికి వెళ్లి, కొడుకు చెడు సావాసాలకు లోనయిన విషయం తన వద్ద దాచినందుకు భార్యను మందలించాడు. ఇంతలో జరిగిన విషయం తెలుసుకున్న గుణనిధి ఇంటికి వచ్చే సాహసం చేయలేకపోయాడు. తన మిత్రులెవరూ కూడా తనకి తల దాచుకోవటానికి సహకరించలేదు. చెంతనే ఉన్న గౌతమీ నది దాటి ప్రక్క ఊరు చేరుకున్నాడు. ఆ రోజు మహాశివరాత్రి కావడంతో ఊరి చివరన ఉన్న శివాలయంలో భక్తులు నైవేద్యాలు సమర్పించి, తమ శక్తి కొలదీ జాగారాలు చేసి, మెల్లిగా నిద్రలోకి జారుకున్నారు. జనాలంతా పడుకున్నారని నిర్ధారించుకున్నాక, ఆకలితో ఉన్న గుణనిధి శివునికి అర్పించిన ప్రసాదాలను తీసుకుని తిందామని గర్భ గుడిలోనికి వెళ్ళాడు. చీకటిలో ఏమీ కనిపించక, తన పైవస్త్రాన్ని చించి వత్తిగా చేసి అక్కడ ఉన్న నూనెతో దీపాన్ని వెలిగించాడు. ఆ వెలుతురులో ప్రసాద పాత్రలు కనిపించేసరికి ఆనందంతో వాటిని తీసుకుని బయటకి నడుస్తుండగా గుడిలో నిద్రిస్తున్న ఒక భక్తుని కాలు తగిలి, నందీశ్వరుని మీద పడి, తల పగిలి చనిపోతాడు. ఊరి నుండీ పారిపోతూ పవిత్రమయిన గౌతమీ స్నానం, తిండి దొరకనందున ఉపవాసం, వెలుతురు కోసం శివాలయంలో వెలిగించిన దీపం, ప్రసాదాల కోసం చేసిన సగం జాగారం, ఇవన్నీ అనుకోకుండా చేసినా శివరాత్రి పర్వదినం నాడు చేసి మరణించటం వలన గుణనిధికి కైలాస ప్రాప్తి లభించింది. అందుకనే "జన్మానికో శివరాత్రి" అంటారు.

ఇదిలా ఉండగా, పులస్త్యుడు అనే బ్రహ్మర్షి ధర్మాన్ని గ్రహించాలన్న ఆసక్తితో, మేరు పర్వతానికి అతి చేరువలో ఉండే తృణబిందుని ఆశ్రమానికి వెళ్ళి, అక్కడ తనకనువయిన ఒక చోటు చూసుకుని తపస్సు ప్రారంభించాడు. ఆ ఆశ్రమ పరిసరాలు ఎంతో రమణీయమయిన ప్రకృతి శోభతో విలసిల్లుతూ ఉండేవి. అందుకే దేవతాంగనలు, అప్సరసలు, నాగకన్యలు అక్కడకి వెళ్ళి తమ ఆటపాటలతో కాలం గడిపి వెళ్ళిపోయేవారు. వీటి వలన పులస్త్యునికి తపోభంగం కలిగేది. దానితో ఆగ్రహించిన ఆయన, తన కంట పడిన కన్య గర్భవతి అవుతుందని శపించి తపస్సులో మునిగిపోతాడు. ఈ శాపం గురించి తెలిసినవారెవరూ అక్కడికి వెళ్ళేవారు కాదు. ఒకనాడు ఈ శాపం గురించి తెలియని తృణబిందుని కుమార్తె అయినటువంటి మానిని అక్కడికి వెళ్ళటం, గర్భం దాల్చటం జరగటంతో తన కుమార్తెను స్వీకరించమని తృణబిందుడు పులస్త్యుని అడుగగా దయతో ఆమెను స్వీకరించి, ఆమె సేవలకి మెచ్చి, తనతో సమానమయిన జ్ఞానం, శక్తి ఉన్న పుత్రుడు పుడతాడని ఆశీర్వదిస్తాడు. అలా పుట్టినవాడే విశ్రవుడు (వేదాధ్యాయమును విన్నవాడు అని అర్థం). విశ్రవుడు (ఇతనిని విశ్రవ బ్రహ్మ అని కూడా పిలుస్తారు) తన తండ్రితో అన్ని విషయాల్లోనూ సమానుడై, నిత్యం తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. యుక్త వయస్కుడైన విశ్రవునికి, భరద్వాజ మహర్షి తన కుమార్తె అయిన దేవవర్ణినిచ్చి వివాహం జరిపించారు. వీరిరువురికీ పుట్టినవాడు వైశ్రవణుడు. ఈ వైశ్రవణుడే (విశ్రవుని కుమారుడు) కుబేరుడు.

కుబేరుడు చిన్నతనం నుండీ శివ భక్తి తత్పరుడు. కైలాస ప్రాప్తి పొందిన గుణనిధే ఈ జన్మలో వైశ్రవణుడిగా (కుబేరునిగా) పుట్టాడని తన తపోశక్తి ద్వారా తెలుసుకున్న విశ్రవుడు, తన కుమారుడు చిన్నతనంలోనే తపస్సు చేసుకోవడానికి అంగీకరించాడు. దానితో కుబేరుడు కఠోరమైన తపస్సు చేయటం మొదలు పెట్టాడు. కొన్ని సంవత్సరాలు కేవలం ద్రవ పదార్ధాలను సేవించి, తరువాత కొన్ని సంవత్సరాలు కేవలం గాలి మాత్రమే భుజించి, అటు పిమ్మట గాలిని కూడా పీల్చకుండా వెయ్యి సంవత్సరాల పాటు చేసిన తపస్సుకు మెచ్చిన పరమ శివుడు ప్రత్యక్షమయ్యి, తనని లోకపాలకునిగా, ధనాధ్యక్షునిగా ఉండే వరమిచ్చి అంతర్ధామనవుతాడు. ఎక్కడ ఉండాలో తెలియని కుబేరుడు బ్రహ్మ కోసం తపస్సు చేయగా, ఆయన ప్రత్యక్షమయ్యి శంఖనిధి, పద్మనిధి మరియు పుష్పక విమానం ప్రసాదించి, త్రికూట పర్వతం మీద, సముద్ర మధ్యభాగంలో ఉన్న లంకా పట్టణంలో పూర్వం రాక్షసులు ఉండేవారనీ, శ్రీహరి వలన భయంతో వారంతా పాతాళానికి పారిపోయారు కనుక అక్కడకి వెళ్ళి ఉండమనీ చెప్పి మాయమవుతాడు. 
 
శ్రీ విష్ణు ధర్మోత్తర పురాణం ప్రకారం, లంకానగరాన్ని దేవశిల్పి అయినటువంటి విశ్వకర్మ ఇంద్రుని కోసం సుమనోహరంగా నిర్మిస్తాడు. అయితే, రాక్షసులంటే భయపడే ఇంద్రుడు ఎప్పుడూ లంకలో ఉండటానికి ఇష్టపడలేదు. దానితో ఆ నగరాన్ని దేవాసుర భయంకరుడయిన సుకేశుని కుమారులకి (మాలి, సుమాలి, మాల్యవంతుడు) ఇస్తాడు. వీరిలో మాల్యవంతుడు ధర్మ వర్తనుడు. నర్మద అనే అప్సరసకి సుందరి, కేతుమతి, వసుతి అని ముగ్గురు కుమార్తెలు ఉండేవారు. లంకా నగర పాలకులయిన ముగ్గురూ ముగ్గురినీ అనగా మాల్యవంతుడు - సుందరినీ (వీరి కుమారులు - వజ్రముష్టి, విరూపాక్ష, దుర్ముఖ, సుప్తఖ్న, యజ్ఞకోశ, మత్త, ఉన్మత్త మరియు కుమార్తె - నల), సుమాలి - కేతుమతిని (వీరి కుమారులు - ప్రహస్త, అకంబన, వికట, కలకముఖ, దుమ్రక్ష, దండ, సుపార్శ్వ, సంహ్రద, ప్రక్వత, భాసకర్ణ మరియు కుమార్తెలు - వేక, పుష్పోల్కత, కైకసి, కంభినది) మరియు మాలి - వసుతినీ (వీరి కుమారులు - అనల, అనిల, అహ, సంపతి) వివాహం చేసుకుని లంకా నగరాన్ని పరిపాలించసాగారు. వీరి రాక్షస కృత్యాలు మితి మీరటంతో శ్రీ హరి రోజూ తన సుదర్శన చక్రాన్ని లంకా నగరం మీదకి వదిలేవాడు. దానితో మాలితో పాటు కొంతమంది చనిపోగా, మిగిలిన రాక్షసులంతా పాతాళం వెళ్లి దాక్కుంటారు. 
 
అటువంటి రాక్షస నగరమయిన లంకకు ఇప్పుడు కుబేరుడు అధిపతి కనుక రాక్షసాధిపతి అయ్యాడు. ఆ విధంగా కుబేరుడు లోకపాలకుడు, ధనాధ్యక్షుడు, రాక్షసాధిపతే కాక పుష్పక విమానాన్ని కూడా పొందాడు. దానితో కుబేరుడు తన తల్లిదండ్రులతో లంకను చేరి పరిపాలించసాగాడు. కుబేరుని ఐశ్వర్యాన్ని, వైభవాన్ని చూసిన సుమాలి (పాతాళ రాజు) అసూయ చెందాడు. సుమాలి కుమార్తె కైకసి, విశ్రవ బ్రహ్మ రెండవ భార్య అనగా కుబేరుని సవతి తల్లి. కైకసికి కూడా కుబేరుని వంటి ఐశ్వర్యవంతుడయిన కుమారుడు కావలెనన్న కోరికతో విశ్రవుని ఆశ్రమానికి వెళ్ళింది. విశ్రవుడు కైకసితో తప్పనిసరి పరిస్థితుల్లో, వేళ కాని వేళ కలిసినందున రావణుడు, కుంభకర్ణుడు (ఏనుగు యొక్క "కుంభ"స్థల ప్రమాణము కల కర్ణములు అనగా చెవులు కలవాడు అని అర్థం) అను రాక్షసులు జన్మిస్తారు. ఈ విషయం తెలుసుకున్న కైకసి తనకొక సత్పుత్రుడు కావలెనని అడగటంతో, విశ్రవుని అనుగ్రహం వలన విష్ణు భక్తి కల విభీషణుడు (దుష్టులకు విశేషమయిన భీతిని కలిగించువాడు అని అర్థం) పుడతాడు. అలా కుబేరుడు రావణాసురుడి సోదరుడనమాట!

రావణాసురుడు రాక్షసుడు కావడంతో తన తాతగారయిన సుమాలి వద్ద పాతాళంలో ఉండేవాడు. కుబేరుడు మాత్రం భోగ భాగ్యాలతో లంకలో రాజ్యపాలన చేయటం చూసి తట్టుకోలేక, లంక మీదకి దండెత్తాడు రావణాసురుడు. కుబేరునికి శారీరక బలం తక్కువ, యుద్ధం చేసి జనాలను చంపే క్రూరత్వం లేదు, పైగా రావణాసురుడు హఠాత్తుగా రావటంతో రావణాసురుడు లంకను పుష్పక విమానంతో సహా స్వాధీనం చేసుకుని కుబేరుని తరిమేశాడు. దానితో భయపడిపోయిన కుబేరుడు కాశీ చేరుకుని పరమేశ్వరుని కోసం ఘోర తపస్సు మొదలుపెట్టాడు. గాలిని సైతం బంధించి, ఒంటి కాలి మీద నిలిచి, శివుని మనసులో నిలుపుకుని తపస్సు చేయసాగాడు. తన శరీరం నుండి వచ్చిన తపోగ్ని జ్వాలలు ముల్లోకాలూ వ్యాపించాయి. ఈయనకి తపోభంగం కలిగించటానికి చేసిన ప్రయత్నాలన్నీ వృధా అయ్యాయి. కాలం గడిచిన కొద్దీ కుబేరుని శరీరం ఎముకల గూడులా మారిపోయింది. అయినా తపస్సు చేస్తూనే ఉన్న కుబేరుని మెచ్చిన శివుడు ప్రత్యక్షమయ్యి, "లంకా నగరాన్ని మించిన దివ్యభవనాలతో, అపురూపమయిన చైత్ర రథం అనే ఉద్యానవనముతో, నవ నిధులతో, మణి మాణిక్యాలతో, సర్వ సంపదలతో అలకాపురం అనే పట్టణాన్ని నిర్మించి నీకు ఇస్తున్నాను. ఇక నుండీ నీవు అక్కడే ఉంటూ, యక్షులకి, గంధర్వులకి, మయులకి, గుహ్యకులకి రాజువై ఉండమని అనుగ్రహిస్తాడు. ధనదుడవు, ధన దాతవు అయిన నిన్ను మించినవాడు ఈ సృష్టిలోనే ఉండరు. ఉత్తర దిక్కును పరిపాలిస్తూ, నా ప్రియ మిత్రుడవై, నాకు ఆప్తుడవై సంచరిస్తూ ఉండు" అని ఎన్నో వరాలిచ్చి కుబేరునికి మంచి రూపం ప్రసాదించి అదృశ్యమవుతాడు. అందుకనే అధిక ధనము కల వారిని "అపర కుబేరులు" అంటారు.
 
మణిమాణిక్యాలు, నిధులు, సంపదలతో నిండి వుండే ఈ అలకాపురం 100 యోజనాల పొడవు, 70 యోజనాల వెడల్పు కలిగి, కల్పవృక్షం నుండీ వీచే చల్లని గాలితో పరిమళ భరితంగా ఉంటుంది. అక్కడ తుంబురులు, గంధర్వ కన్యలు గానం చేస్తుంటే, రంభ, చిత్రసేన, మిశ్రకేశి, మేనక, సహజన్య, ఊర్వశి, శౌరభేయి, బుల్బుద, లత, మొదలగు ఎంతోమంది అప్సరసలు నాట్యం చేస్తూ ఉంటారు. మణిభద్రుడు, గంధకుడు, గజకర్ణుడు, హేమనేత్రుడు, హాలకక్షుడు, మొదలయినవారు కుబేరుని కొలువులో ముఖ్యమయిన వారు. కుబేరుని ప్రధాన సహాయకుడు విరూపాక్షుడు. శివుడు నిత్యం దర్శించే ప్రదేశము ఈ అలకానగరం అంటూ ఆ నగర శోభని మహాభారతంలో నారదుడు ధర్మరాజుకి చెప్తున్నట్టు వస్తుంది. 
 
కుబేరునికి ఉన్న మరొక పేరు ఏకాక్షి పింగళుడు. ఈ పేరు తనకి ఎందుకు, ఎలా వచ్చిందో రామాయణంలో వస్తుంది. సీతా దేవిని బంధించిన రావణునితో పర స్త్రీని గౌరవంగా చూడాలనీ, చెడు ఉద్దేశ్యంతో చూడరాదనీ, సీతమ్మని విడిచి పెట్టమనీ హితవు బోధిస్తూ ఒక లేఖను పంపుతాడు కుబేరుడు. ఆ లేఖలో ఒకసారి పార్వతీదేవి అలకానగరం వెళ్ళినప్పుడు ఆవిడని కుబేరుడు ఐమూలగా చూడగా, ఆవిడ తేజస్సు వలన తన ఎడమ కన్ను మాత్రమే మూసుకునిపోవటం, అది గమనించిన పార్వతీదేవి కుబేరునికి కన్ను పోయేలా చేయటం, తద్వారా తన కన్ను పింగళ వర్ణం లోనికి మారిపోవటం వలన తనకి ఆ పేరు వచ్చిందనీ, అనుకోకుండా పరాయి స్త్రీని చూస్తేనే అలా జరిగిందనీ, తెలిసి మరీ పరాయి స్త్రీని ఆశించవద్దనీ వ్రాసి పంపిస్తాడు. అందుకనే పరాయి స్త్రీని చూస్తే "కళ్ళు పోతాయి" అంటారు. తన ప్రియమిత్రుడయిన కుబేరునికి ఇలా జరిగిందని తెలుసుకున్న శివుడు కుబేరునికి చెడు ఉద్దేశ్యము లేదని జరిగిన సంఘటనను వివరించి, అమ్మవారిని అనుగ్రహించమని అనునయించటంతో ఆ రెండవ కన్ను మళ్ళీ మామూలుగా మారి చూపు సంతరించుకుంటుంది. అందుకనే కుబేరుని ఎడమ కన్ను కుడి కన్ను కన్నా చిన్నదిగా ఉంటుంది. ఈ సంఘటన వలన అమ్మవారి అనుగ్రహం కూడా పొందగలిగాడు కుబేరుడు. 
 
కుబేరుని భార్య చిత్ర రేఖి (కానీ మహాభారతంలోని ఆదిపర్వం ప్రకారం, కుబేరుని భార్య పేరు భద్ర), పుత్రులు - పాంచాలికుడు, మణిగ్రీవుడు, నలకూబరుడు మరియు పుత్రిక - మీనాక్షి. వీరిలో మణిగ్రీవుడు, నలకూబరుడు భాగవతం ద్వారా మనందరికీ సుపరిచితులే (నారద మహాముని శాపం వలన వారిరువురూ మద్ది చెట్లై ఉంటే శ్రీకృష్ణుడు వారికి శాప విమోచనం కలిగిస్తాడు). ముఖ్యంగా చెప్పుకోవలసిన వ్యక్తి పాంచాలికుడు. తండ్రయిన కుబేరుని లాగానే ఇతను కూడా శివ భక్తి కలవాడు, శివునికి ప్రీతి పాత్రుడు. దక్ష యజ్ఞంలో తనకి జరిగిన అవమానాన్ని తట్టుకోలేని సతీ దేవి అగ్నికి ఆహుతయ్యింది. ఈ విషయం తెలిసిన పరమ శివుడు ఆగ్రహంతో దక్ష యజ్ఞాన్ని విధ్వంసం చేసినా, భార్య మీద ఉన్న ప్రేమతో ఆమె దూరమవటాన్ని తట్టుకోలేక దుఃఖంతో అంతా సంచరిస్తున్నాడు. అటువంటి సమయంలో మన్మధుడు ఈశ్వరుని మీదకు "ఉన్మాదనాస్త్రాన్ని" ప్రయోగిస్తాడు. ఆ అస్త్ర ప్రభావం వలన విపరీతమయిన విరహ తాపానికి గురవుతూ, ఆ బాధ తట్టుకోలేక యమునా నదిలోనికి దిగుతాడు. ఈ వేడి జ్వాలలు ఆ నదిని దహించివేస్తాయి. దానితో ఆ నదీ జలం నల్లగా మారిపోవటంతో యమునా నదికి "కాళింది" అనే పేరు వచ్చింది. కానీ శివుని విరహ తాపం మాత్రం తీరటం లేదు. ఇంతలో మన్మధుడు "సంతాపనాస్త్రాన్ని" వేస్తాడు. ఈ అస్త్ర ప్రభావంతో మరింతగా బాధపడుతూ అగ్ని జ్వాలల్లాంటి నిట్టూర్పులను విడుస్తూ ప్రపంచాన్నంతా తాపంతో ముంచెత్తాడు. ఈ సారి మన్మధుడు "విజృంభణాస్త్రాన్ని" ప్రయోగించేసరికి శివుడు మరింత ఉన్మత్తుడై తిరగసాగాడు.    
 
ఆ సమయంలో శివునికి కుబేరుని కుమారుడయిన పాంచాలికుడు కనిపిస్తాడు. వెంటనే అతని వద్దకు వెళ్ళి సహాయం కోరతాడు. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా, తనకి వచ్చిన అదృష్టావకాశానికి పొంగిపోతూ ఆజ్ఞాపించమంటాడు. దానితో తన బాధను పాంచాలికునికి వివరించి, తన మీద ప్రయోగింపబడిన మూడు (ఉన్మాదన, సంతాపన, విజృంభణ) అస్త్రాల వేడినీ తీసుకోమని కోరతాడు. మహా శివుడే తట్టుకోలేని వేడిని తాను మాత్రం ఎలా తట్టుకోగలడు? వాటిని తీసుకుంటే ఆ అస్త్రాల ప్రభావానికి తన జీవితమే నాశనమయిపోతుంది అని తెలిసినా కూడా అడిగినది పరమేశ్వరుడు కనుక నిస్సంకోచంగా, దైవాజ్ఞను ఆచరించి తీరాలి అనే ఆశయంతో ఆ మూడు అస్త్రాల వేడినీ తాను తీసుకుని శివునికి ఉపశమనం కలిగిస్తాడు. అతని భక్తికి, చిత్తశుద్ధికి మెచ్చిన శివుడు ఎంతో ఆనందించి ఆ వేడి పాంచాలికుడిని బాధించకుండా వరం ప్రసాదించి, మహోన్నతమైన దైవత్వాన్ని అనుగ్రహిస్తాడు. ఆ రోజు నుండీ పాంచాలికుడు కాలింజరానికి ఉత్తర భాగంలో, హిమవత్పర్వతానికి దక్షిణాన ఉన్న ప్రదేశంలో పాంచాలికేశ్వరుడిగా కొలువవుతాడనీ, చైత్ర మాసంలో ఈయనని చూసినా, విగ్రహాన్ని ముట్టుకున్నా, భక్తిగా స్మరించుకున్నవారు ఎవరయినా (చిన్న/పెద్ద, ఆడ/మగ భేదం లేకుండా) ఉన్మత్తులు అవుతారని చెప్తాడు. అయితే ఈ ఉన్మత్తత వ్యాధిలాగానో, అగ్నిలాగానో బాధించకుండా నాట్యగానాలలో, వాద్య సంగీతాలలో నేర్పుతో పాటు చతురోక్తులు విసరటం వంటి కళలలో అత్యున్నత స్థానానికి చేరి తిరుగులేని వారిగా ఉంటారని, అదే వారు అనుభవించే ఉన్మత్తమనీ వివరిస్తాడు. ఆ విధంగా పాంచాలికుడు కళాకారులకి ఆరాధ్య దైవంగా మారి, తనను కొలిచిన వారందరికీ వరాలనిచ్చే శక్తిని పొందాడనీ వామన పురాణం వివరిస్తోంది.
 

ఎంతోమంది అదృష్ట చిహ్నంగా, సిరిసంపదలనొసగుతూ ఆనందాన్ని పెంపొందించే దైవంగా భావించే "లాఫింగ్ బుద్ధ" మన కుబేరుడే అని చాలా మంది నమ్మకం. కుబేరుని పూజించిన వారికి ఆర్ధిక ఇబ్బందులు తొలగి, వ్యాపార వృద్ధి, సామాజిక గుర్తింపు లభిస్తాయని మన పురాణాలు చెప్తున్నాయి. అయితే, కుబేరుని ప్రతిమ కానీ, కుబేర దీపాలు కానీ ఎవరికి వారు కొనుక్కోవటం కన్నా కూడా ఎవరయినా కానుకగా ఇచ్చినది మనం తీసుకుని పూజిస్తే విశేషమయిన ఫలితం ఉంటుందని నమ్మిక. ధన త్రయోదశి నాడు కుబేర పూజలు, కుబేర వ్రతాలు, మొ., ఈ మధ్యన మనం ఎక్కువగా చూస్తున్నా, నిత్యం మనకి తెలిసో, తెలియకుండానో కుబేరుడిని మంత్రపుష్పం చదివేటప్పుడు స్మరిస్తూనే ఉంటాం.


"రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే

నమోవయంవై శ్రవణాయ కుర్మహే
సమే కామాన్ కామ కామాయ మహ్యం
కామేశ్వరోవై శ్రవణో దదాతు
 కుబేరాయ వైశ్రవణాయ మహా రాజాయ నమః "

హిందువులే కాక, బౌద్ధ, జైన మతాల వారు కూడా అధికంగా పూజించే, నమ్మే దైవం కుబేరుడు. బౌద్ధులు ఈయనని వైశ్రవణుడు లేదా జంభాలుడు అని పిలుస్తారు. శ్రీ శివ పురాణం ప్రకారం, కుబేరుడి అసలు పేరు వైశ్రవణుడే! జైనులు ఈయనని సర్వానుభూతి అంటారు. టిబెటియన్లు మరియు జపనీయుల ప్రకారం ప్రపంచాన్ని నలుదిక్కులా పాలించే రాజులలో కుబేరుడు ఒకడు. బౌద్ధుల ప్రకారం ఈయన చేతిలో ఎల్లప్పుడూ బంగారు నాణెములు కల ఒక సంచీ కానీ వజ్రములను, మణులను వెదజల్లు ముంగీస కానీ ఉంటాయి. అదే విధంగా, మరొక చేతిలో ఎల్లప్పుడూ నిమ్మకాయ (జంబీరము) ఉండటం వలననే ఈయనకి జంభాలుడు అనే పేరు వచ్చిందని చెప్తారు. అగ్ని పురాణం ప్రకారం, ఈయన ఆయుధం గద, వాహనం నరుడు (మనిషి). దీని ద్వారా మనిషి డబ్బుకి, ఐశ్వర్యానికి బానిసగా మారే అవకాశాలు ఉన్నాయని తెలుస్తున్నది. కనుక మనిషి మనీ కి బానిస కాకుండా స్వీయ నియంత్రణతో బంధువుగా వుంటూ, ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో జీవించాలని ఆశిద్దాం.

"ఓం యక్షరాజాయ విద్మహే అలకాధీశాయ ధీమహి తన్నో కుబేరః ప్రచోదయాత్"