Tuesday, August 21, 2012

"మా" రుచులు



శీర్షిక చూసి నేను కూడా ఏదో తయారీ విధానం చెప్పబోతున్నాను అని అనుకుంటున్నారా? అలా తొందరపడి నన్ను అపార్థం చేసేసుకుంటే ఎలా? చిన్నప్పుడు ఎవరన్నా నీకు వంట చేయటం వచ్చా అమ్మా? అని అడిగితే ఓహ్! నాకు ఉప్పు, మంచినీళ్ళు, పెరుగు వండటం వచ్చు అని చెప్పేదానిని. చూశారా? చిన్నతనంలోనే ఎన్ని వండటం నేర్చేసుకున్నానో!!! నాకు తెలిసిన వంటలన్నీ చెప్పేస్తే మీరంతా కూడా నేర్చేసుకుని మీకు వచ్చినవి మర్చిపోతారు కనుక ప్రస్తుతానికి నేను చెప్పబోయే వంటకాలు ఎలా ఉంటాయి? ఎక్కడ దొరుకుతాయో మాత్రం పరిచయం చేస్తాను.

కోనసీమ అనగానే అందరికీ ఎక్కువగా గుర్తొచ్చే వంటలు కొన్ని ఉంటాయి. అవే ఆత్రేయపురం పూతరేకులు, తాపేశ్వరం మడత కాజా, కాకినాడ కోటయ్య కాజా, మామిడి తాండ్ర, గంగరాజు పాలకోవా, పనసపొట్టు కూర, పులసలు (పుస్తెలు అమ్ముకుని అయినా పులస తినమంటారు), ఇలా ఎన్నో ఎన్నెన్నో. అయితే ఇవి కొనసీమకే పరిమితం కాకుండా ప్రస్తుతం ఇంచుమించు అన్నీ చోట్లా దొరుకుతున్నాయని నా అభిప్రాయం. వాటిని రుచి చూడాలనుకున్న వాళ్ళు ఎక్కడయినా కొనుక్కోవచ్చును. ఈ టపాలో అంతగా గుర్తింపు లేకపోయినా కోనసీమలో మాత్రం ప్రాముఖ్యతని సంపాదించుకున్న వాటిల్లో నాకు తెలిసిన కొన్ని
వంటలని మీ ముందుకి తెస్తాను.

పూర్వ కాలం నుండీ కోనసీమ అనగానే గుర్తు వచ్చేవి తరవాణీ కుండలు. నిజమే! వేసవి వచ్చిందంటే చాలు ప్రతీ ఇంట్లోనూ ఈ కుండలు ఉండి తీరాల్సిందే. వార్చిన గంజి నీళ్ళు కుండలో పోసి, మొదటి సారి మాత్రం మజ్జిగ వేసి, నీళ్ళు, ఉప్పు వేసి దబ్బాకు వేసి అన్నం అందులో ఉంచి తరువాతి రోజు దానిని తినేవారు. ఎండ గాడ్పు కొట్టకుండా ఈ తరవాణీ నీళ్ళు తాగితే చాలా చల్లగా ఉంటుంది. 

కాయావకాయ
వేసవి అనగానే అందరూ ఎదురు చూసేది కొత్త ఊరగాయల కోసం. అయితే మా కోనసీమలో మాత్రం ఎక్కువగా ఉండేది కాయావకాయ. కాయలతో కాక పళ్ళతో పెడతారా ఏమిటి? అనుకోకండి. కాయావకాయ అంటే కాయని పూర్తిగా ముక్కలు చేయకుండా ఉన్న పళాన్న పెట్టడం. మాంచి మామిడికాయలు తీసుకుని గుత్తి వంకాయ కూరకి కోసినట్టు మామిడికాయని నాలుగు పక్కల కోసి, జీడి తీసేసి, ఆవపిండి బాగా కుక్కి పెడతారు.  దానిని బాగా ఊరపెట్టి మూడవ రోజున నూనేసి నిలువ ఉంచుతారు. ఆ రోజుల్లో మామిడికాయ మొత్తం ఒక్కరే తినేవారు. తరువాత ఒక కాయ తీస్తే పెద్ద కుటుంబాల్లో అదే అందరికీ సరిపోతోంది. ఎన్నాళ్ళయినా ఆవ ఘాటు తగ్గకుండా భలే రుచిగా ఉంటుందిలెండి.

తరవాణి కుండ అన్నము - ఈ కాయావకాయ మంచి జోడీ.


కొట్టెక్క బుట్టలు
ఇడ్డెన్లు లేదా ఇడ్లీలు అందరూ చేసుకున్నా కోనసీమలో వాటిని ప్రత్యేకంగా చేస్తారు. మామూలు ఇడ్లీలలాగా కాకుండా కొట్టెక్క బుట్టలు లేదా వాసినపోలె రూపాలలో చేస్తారు. ఈ కొట్టెక్క బుట్టలనే పొట్టెక్కలు అని కూడా అంటూ ఉంటారు. పనస ఆకులని బుట్టలుగా చేసి అందులో ఇడ్లీ పిండి వేసి ఆకుతో సహా ఆవిరిలో ఉడికిస్తారు. వీటిని అంబాజీపేట ప్రాంతంలో ఎక్కువగా చేస్తూ ఉంటారు. పోలాల అమావాస్యకి ఇవి ప్రత్యేకంగా చేసి ముత్తయిదువులకి వాయినాలు ఇస్తారు. వేడి వేడిగా తింటే రుచి భలే ఉంటుంది. 
వాసినపోలె
తరువాత వాసినపోలె. వాటిని కొంతమంది ఆవిరి కుడుములు అని కూడా అంటారు. ఇడ్లీ పిండిని గిన్నెకి కట్టిన గుడ్డ లేదా బట్ట మీద వేసి మూత పెట్టి ఆవిరి మీద ఉడికిస్తారు. బట్ట వాసన పిండికంటి ఒకరకమయిన వాసనతో ఉంటుంది కనుక దాని పేరు వాసినపోలె అనమాట! ఇది ఎక్కువగా విశ్వేశ్వరాయపురం ప్రాంతంలో చేస్తారు.    

బలుసాకు
బలుసు లేని తద్దినం, బులుసు లేని యజ్ఞం ఉండదని నానుడి. మిగతా ప్రాంతాల వాళ్ళు అక్కడక్కడా చేసుకున్నా కోనసీమలో ప్రతీ ఇంట్లో తద్దినానికి ఉండి తీరేది బలుసాకు. పితృ దేవతలకి అదంటే చాలా ఇష్టమట. అందుకనే తద్దినాలకి బలుసాకు పచ్చడి తప్పనిసరిగా ఉండి తీరాలి, ఒకవేళ పచ్చడి చేయలేకపోతే కనీసం చారులో అన్నా శాస్త్రానికి ఒకాకు వేస్తారు.
బొంగు(లో) చికెన్
బొంగు(లో) చికెన్ అనేది రంపచోడవరం ప్రాంతంలో బాగా ప్రసిద్ధి చెందింది. అక్కడ వెదురు బొంగులలో దీనిని చేస్తారు కనుక ఆ పేరు వచ్చింది.  ఉప్పు, పసుపు, కారం, మసాలాలు బాగా దట్టించిన పచ్చి కోడి మాంసాన్ని పచ్చటి వెదురు బొంగులలో పెట్టి ఆకులతో అంచులు కట్టేసి నిప్పుల మీద కాలుస్తారు. బొంగులలో ఉడికిన కోడి మాంసం రుచిని ఎంత వర్ణించినా తక్కువే అని జనాల అభిప్రాయం. 

గరాజు
ఇహ, నాకెంతో ఇష్టమయిన దాని గురించి చెప్పబోతున్నాను. అదే గరాజు. రాజులకే రాజు రారాజయితే రారాజులకే రాజు మా గరాజు. సాధారణంగా తీపి తింటే నాలిక మీద ఆ తీపి అలానే ఉంటుంది అంటారు కానీ గరాజులకి మాత్రం వెఱ్ఱి తీపి ఉండదు. వాటిని తయారు చేసే ఏకైక చోటు నగరం. ఆ చుట్టుప్రక్కల ఊళ్ళల్లో కూడా దొరకవు. కేవలం నగరంలో మాత్రమే దొరికే అసలు సిసలయిన కోనసీమ స్వీటు గరాజు. వీటిని చూస్తే నాకు వెంటనే గుర్తుకొచ్చేది పిచ్చుక గూడు.  గూడు కట్టడానికి పిచ్చుకలు గడ్డిని తెచ్చి ఒక గోడలాగా ఎలా తయారు చేస్తాయో వీటిని కూడా అలానే బియ్యపు పిండితో చేసే ఖారప్పూస లాంటి దానితో చేస్తారు. అందుకే నాలాంటి వాళ్ళు చాలా మంది వీటిని పిచ్చుక గూళ్ళు అని ముద్దుగా పిలుచుకుంటారు. కావాలంటే మీరే చూసి చెప్పండి అలా ఉన్నాయో లేదో!! (నాకు గరాజు చిత్రం కావాలి అనగానే నగరం వెళ్ళి వీటిని కొని మరీ ఈ చిత్రాన్ని పంపిన నాగేశ్వరరావు గారికి ధన్యవాదాలు)
 
మొక్క గుడ్లు
మా కోనసీమంతా ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరికేవి మొక్క గుడ్లు. మొక్కలకి గుడ్లు ఉండటం ఏమిటి అనుకుంటున్నారా??? అదే అండీ కొబ్బరి పువ్వునే (కొబ్బరి కాయ లోపల వచ్చే పువ్వు) అలా పిలుచుకుంటారు. మా రాజమండ్రీలో కూడా దేవీ చౌక్ శివాలయం దగ్గర అమ్ముతూ ఉంటారు. పల్లెటూర్లల్లో అయితే చెప్పనే అక్కర్లేదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎన్ని కావాలంటే అన్ని. మా చుట్టాల ఇళ్ళకి వెళితే తోటల్లోంచి బస్తాలతో తెచ్చి ఉంచుతారు మా అందరికోసం. వాటిని తింటే మాత్రం ఒక పువ్వుతో ఎవ్వరూ ఆపలేరు. 
 
నేనెంతో అభిమానించే ఒక బ్లాగరు ఈ మధ్యన నాకు "గోదావరి కథలు" అనే పుస్తకం పంపారు. అవి చదువుతున్న కొద్దీ ఇంటి మీద, ఊరి మీద బెంగ ఎక్కువయిపోతోంది. అదే సమయములో దొంతరలోంచి ఎన్నో జ్ఞాపకాలు బయటకి వస్తున్నాయి. ముఖ్యంగా ఇంటికి దూరంగా ఉండే ఎవరికయినా గుర్తొచ్చేది అమ్మ చేతి వంట. అంతే ఇహ వెంటనే కోనసీమ రుచులన్నిటికీ నా
అక్షరాల తాలింపు వేసేసి ఇలా మీ ముందుకి కొన్ని తెచ్చాను. ప్రస్తుతానికి వీటిల్లో ఏవి ఎంతమందికి తెలుసు? ఎంతమందికి తినాలనుంది చెప్పండి? మీరు రుచి చూసే పూచీ నాది. 

Thursday, August 02, 2012

జ్యోతి



నేను వ్రాసిన ఈ వ్యాసాన్ని ప్రచురించిన మాలిక సంపాదక వర్గానికి కృతజ్ఞతలతో...

నిరాకారమయిన బ్రహ్మ జ్యోతి (అగ్ని) స్వరూపం. అందుకే జ్యోతి స్వరూపుడు, స్వయం ప్రకాశితుడు, అనంతుడు, ధనపతి, చైతన్యమయుడు అయిన అగ్ని ఈ సకల విశ్వానికి ఆరాధ్యుడయ్యాడు. ఈయన లేనిదే నాగరికతే లేదని చెప్పవచ్చు. అగ్ని పవిత్రతకి, శక్తికి మారు పేరు. వేదాలలో అగ్ని దేవుడు దేవతల పురోహితుడు అని చెప్పబడింది. పంచభూతాలలో ఒకటయిన ఈయన ఆగ్నేయానికి దిక్పాలకుడు. శంకరుని అవతారమే అగ్ని అని శ్రీ శివ పురాణంలో చెప్పబడింది. ఋగ్వేదం ప్రకారం అగ్నిదేవుడు పరమాత్మ నోటి నుండి ఉద్భవించాడు. మన పురాణాలలో ఈయన అంగీరసుని పుత్రునిగా చెప్తారు. ఈయన భార్య స్వాహా దేవి, వాహనము తగరు, ఆయుధం శక్తి, నివాసము తేజోవతి. అగ్నికి స్పర్శ, శబ్ద, రూప అనెడి త్రిగుణాలున్నాయి. అగ్ని- భూమి, ఆకాశం, అగ్ని, వాయువు, పాతాళము, జలము, సూర్య, ఔషధి, వనస్పతి, శరీరం ఇలా ఎక్కడయినా పరిభ్రమిస్తుంది. అగ్ని భక్తులకు విద్యుత్తు, అగ్ని, అజీర్తి, అకాల మరణముల భయము, మొ. ఏ కాలంలోనూ ఉండవు.  అగ్ని భక్షించిన ధూపదీప నైవేద్యాలు, పాలు, పెరుగు, నెయ్యి, చెఱుకు రసం, మొ. వానిని మాత్రమే స్వర్గములోని దేవతలందరూ కూడా స్వీకరిస్తున్నారని శ్రీ శివ పురాణములో చెప్పబడింది. "గుహా హితః గుహాయాం నిహితః" అన్నారు. "అంగీరసుడు" అనబడే మన పూర్వీకుడు మనుషుల అవసరాల కోసం అగ్నిని గుహలో దాచి ఉంచాడుట. అలా దానిని ఉపయోగించుకుని క్రమేణా క్రూర మృగాల నుంచి రక్షణగా కుటీరాన్ని ఏర్పాటు చేసుకునే జ్ఞానాన్ని మనిషి పెంచుకున్నాడుట. అందువలన అగ్ని ముఖ్య పాత్రని పోషిస్తుంది. 

పంచభూతాలలో ఒకటయిన అగ్ని ఎన్నో కర్మలకి సాక్షీభూతం అని మన పురాణాలలో వ్యవహరించారు. అగ్ని సాక్షిగా వివాహం అనేది మన హిందూ సాంప్రదాయం. అయితే అగ్నినే ఎందుకు సాక్షిగా పెడతాం అన్న విషయం ఋగ్వేదంలో వివరించారు.

"సోమః ప్రధమో వివిధే, గంధర్వో వివిధ ఉత్తరః
తృతీయాగ్నిష్టే పతిః తురీయప్తే మనుష్యచౌః"

అని వివాహ సమయములో వరుడు స్త్రీతో అంటాడు. అంటే నిన్ను ప్రారంభ కాలంలో సోముడూ, తరువాత గంధర్వుడూ, ఆ తరువాత అగ్నీ ఏలారు. ఇహ నాల్గవ వానిగా నేను నిన్ను ఏలుతాను అని అర్థం. అమ్మాయి పుట్టిన వెంటనే తన ఆలనా పాలనా చూడవలసినది సోముడు (చంద్రుడు). ఎన్ని సార్లు చూసినా చంద్రుడు ఎంత ఆకర్షణీయంగా ఉంటాడో అలానే పసి పాపను చూసినప్పుడు కూడా అదే భావన కలగటానికి కారణం చంద్రుని పాలన. కొంత వయసు వచ్చాక గంధర్వునికి ఇచ్చేసి చంద్రుడు వెళిపోతాడు. ఇప్పుడు ఆమెని చంద్రుని సాక్షిగా గంధర్వుడు స్వీకరించాడు. "లావణ్యవాన్ గంధర్వః" అన్నట్టు గంధర్వుడు ఆమెలో అందాన్ని ప్రవేశ పెడతాడు. గంధర్వులు గాన ప్రియులు కనుక అందమయిన కంఠాన్ని లేదా సంగీతాన్ని ఇష్టపడే మనసుని ఇస్తాడు. అలా అందాన్ని, చందనాన్ని ఇచ్చేసి నా పనయిపోయింది ఇక నీదే పూచీ అని కన్యని అగ్నికి అప్పచెప్పి గంధర్వుడు వెళిపోతాడు. ఇప్పుడు ఆమెని గంధర్వుని సాక్షిగా అగ్ని స్వీకరించాడు. "అగ్నిర్వై కామ కారకః" అన్నట్టు అగ్ని ఆమె శరీరంలోకి కామ గుణాన్ని (కామాగ్ని) ప్రవేశ పెడతాడు. ఇలా ఒక కన్య చంద్రుని ద్వారా ఆకర్షణని, గంధర్వుని ద్వారా లావణ్యతని, అగ్ని ద్వారా కామ గుణాన్ని పొందుతుంది. ఇహ ఆమె వివాహానికి యోగ్యురాలని భావించిన అగ్ని, ఆమెను వేరొకరికి ఇచ్చి తను వెళ్ళాలి కనుక కళ్యాణ సమయములో ఆమెను నరునికి ఇస్తాడు. అలా ఆమెను "అగ్ని సాక్షిగా" వరుడు స్వీకరిస్తాడు.

వాయుపురాణంలో అగ్ని జనన, అగ్ని వంశ సంబంధిత విషయాల ప్రస్తావన ఉంది. ఆ ప్రకారముగా స్వాయంభువ మన్వంతరంలో అగ్ని బ్రహ్మమానసపుత్రునిగా జన్మించాడు. ఈయన నుండి స్వాహా దేవి పుట్టింది. ఈవిడకి పావకుడు (అపవిత్ర వస్తువులన్నీ అగ్ని సోకితే పవిత్రం అవుతాయి కనుక అగ్నికి పావకుడు అనే పేరు వచ్చింది. ఈయననే పావమానుడు అని కూడా అంటారు), శౌరుడు, శుచి అనే ముగ్గురు పుత్రులు పుట్టారు. వీరిలో పావకునికి పుట్టిన అగ్ని సంరక్షకుడు, శుచికి జన్మించిన అగ్ని హవ్యవాహనుడు (ఇతను అగ్నిదేవతలకు, పితృదేవతలకు హవ్యాన్నీ, రాక్షసులకు హుతమును మోసుకుని వెళ్తాడు). అయితే ఇందులోనే, విద్యుత్తు సంబంధమయిన లౌకికాగ్నిని బ్రహ్మ తొలి పుత్రునిగా చెప్పబడింది. ఈయన పుత్రుని పేరు బ్రహ్మౌదవాగ్ని భరతుడు. నిర్మధుడు అని కవుల చేత వర్ణింప బడిన అగ్నే పావమానుడుగా చెప్పబడిన అగ్ని. ఈయననే గార్హపత్యాగ్ని (త్రేతాగ్నులలో ఒకటి) అని కూడా అంటారు. ఇతనికి హవ్యవాహనుడు అనే ఆహవనీయాగ్నీ, ప్రణీయమానుడు (కుండానికి తీసుకుని వెళ్ళేవాడు) అను ఇద్దరు కుమారులు. వీరిలో ఆహవనీయాగ్నిని శంస్యుడు అనీ, ప్రణీయమానుడుని శుక్రుడు అనీ అంటారు.  పదహారు నదులతో (గోదావరీ, కావేరీ, కృష్ణవేణీ, నర్మదా, యమునా, వితస్థ, చంద్రభాగ, ఇరావతి, విపాచ, కౌశిక, శతద్రు, సరయు, సీతా, సరస్వతీ, హ్రాదిని, పావని) ఈ శంస్యునికి పుట్టిన అగ్నులని ధిష్ణులు అంటారు. వీరిలో ముఖ్యమయిన అగ్నులు సమ్రాట్ (ఈ అగ్నిని ఎనిమిది మంది వేద పండితులు ఎల్లప్పుడూ ఉపాసిస్తూ ఉంటారు), పర్హతే (సమ్రాట్ క్రింద ఉంటుంది), అజైకపాద్ (ఉపాసించడానికి అనువయిన అగ్ని) లేదా అహిర్భుద్యగ్ని లేదా గృహపతి, క్రతుప్రహణం మరియు అగ్నీధ్రం. వీటిల్లో మళ్ళీ పర్హతే అనే అగ్ని నాలుగు అగ్నులు క్రింద చీలుతుంది. అవే బ్రహ్మజ్యోతి (బ్రహ్మ స్థానంలో ఉండే అగ్ని), హవ్యమః (యాగములలో కనిపించే అగ్ని), ఋతుధామం (జ్యోతిర్వంతమయిన అగ్ని) మరియు జౌదుంబరి (మేడి చెట్టులో ఉండే అగ్ని). ఈ విధముగా అగ్నులు చేసే ఒక్కో పని ప్రకారం ఒక్కో రూపంలో అవతరించాయని వాయు పురాణంలో ఉంది.

వీటన్నిటినీ ప్రక్కన పెడితే, అగ్ని ఉన్న ప్రదేశాన్ని బట్టి వివిధ నామాలతో పిలువబడుతుంది. అవి:

క్రోధాగ్ని:
కోపము వలన పుట్టేది క్రోధాగ్ని. ఇది ఎక్కువగా కళ్ళలో ఉంటుంది. పరమేశ్వరునికి మూడు కన్నులూ సూర్యుడు, చంద్రుడు మరియు అగ్ని. అందువలననే శివుడు మూడవ కన్ను తెరిస్తే అది అగ్ని రూపము కనుక క్రోధాగ్ని జ్వాలలలో భస్మం అవుట తధ్యం.

బడబాగ్ని: ఇది సముద్రము అడుగుభాగములో ఉండే అగ్ని. దీనినే బ్రహ్మాగ్ని అని కూడా అంటారు. దీనికి ఆహారం సముద్రోదకం అనగా సముద్రములోని నీరు. దీని జననం వెనుక చాలా కథలున్నాయి.

శ్రీ శివ పురాణం ప్రకారం, మన్మధుని దహనానంతరం కూడా శివుని మూడవ కన్ను నుండి పుట్టిన అగ్ని (క్రోధాగ్ని) అంతా వ్యాపించగా ముల్లోకాలలోని వారంతా భయభీతులై బ్రహ్మని శరణు కోరతారు. అప్పుడు ఆయన ఆ అగ్నిని స్థంబింపచేసి, ముల్లోకాలనూ దహించి వేయగల శక్తి ఉన్న ఆ క్రోధాగ్నిని సౌమ్యమయిన అగ్ని జ్వాలలను వెదజల్లే ముఖము కల బడబా (గుఱ్ఱము) అగ్నిగా మార్చి తానే స్వయముగా సముద్రునికి అప్పగిస్తాడు. అంత భయంకరమయిన అగ్నిని దాచుకున్న ఈ బడబము నోటి నుండి నిప్పులు క్రక్కుతోంది కావున దీనికి సముద్ర జలము మాత్రమే నిత్య భోజనముగా ప్రళయ కాలము దాకా సముద్రములోనే ఉండవలెనని అక్కడ ఉంచటం జరిగింది.

శ్రీ విష్ణు ధర్మోత్తర పురాణం ప్రకారం, ఒకసారి భృగువులకు, హైహయులకు పెద్ద వైరము వచ్చి హైహయులు వెళ్ళి భృగువులు అందరినీ (గర్భములో ఉన్న పిండాలతో సహా) చంపేస్తారు. అప్పుడు భృగు మహర్షి దుఃఖించి మిక్కిలి తేజస్సు కల "అరుణుడు" అనే శిశువుని ఆయన గర్భమందు ధరిస్తారు. ప్రసవ సమయములో ఆ శిశువు ఆయన తొడను ఛేదించుకుని పుడతాడు. పుట్టిన వెంటనే హైహయులు భృగువులని చంపినప్పుడు దేవతలెవ్వరూ అడ్డుకోనందున దేవతలనందరినీ చంపుతానని కోపముతో బయలుదేరతాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు బడబా ముఖదారి అయ్యి ఆ శిశువు శరీరము నుండి వెలువడి సముద్రము అంతర్భాగములోనికి వెళ్తాడు. అంటే దీని ప్రకారము కూడా క్రోధాగ్ని బడబా ముఖములోకి మారుట వలన బడబాగ్ని అయ్యింది.

శ్రీ పద్మ పురాణం ప్రకారం, బడబాగ్ని విష్ణువు ప్రతిరూపమయిన జువ్వి చెట్టు నుండి ఉద్భవించింది. ఆ బడబాగ్ని తాపాన్ని భరించలేని దేవతలు ఈ అగ్నిని సముద్రములోనికి తీసుకుని వెళ్ళి దాచమని సరస్వతీ దేవిని వేడుకుంటారు. బ్రహ్మ ఆజ్ఞానుసారం సరస్వతీ దేవి నది రూపములో ఆ చెట్టు వద్దకు వెళ్ళి విష్ణువు ఆశీర్వచనం చేత తను దహనం కాకుండా ఈ అగ్నిని జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి సముద్రునిలో ఏకం చేస్తుంది. దీనిని బట్టి బడబాగ్ని అనేది ముందుగా భూమి మీద పుట్టి సముద్రములో చేరింది అని తెలుస్తోంది. 

జఠరాగ్ని: ఇది ప్రతీ ప్రాణి ఉదరములోనూ ఉండి ఆహార జీర్ణనకి ఉపయోగపడుతుంది. దీని విలువ గురించి ప్రతీ ఒక్కరూ తెలుసుకోవలసిన అవసరం ఎంతయినా ఉంది.


"అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః
ప్రాణాపాన సమాయుక్తా పచామ్యన్నం చతుర్విధం"

అని భగవద్గీతలో చెప్పారు. ఈ శ్లోకం నిత్యం భోజనం చేసేముందు చదువుకుని తినటం ఒక అలవాటు. ఇక్కడ అహం అంటే పరమాత్మ, వైశ్వానరుడు అనే పేరుతో ప్రాణుల (ఇవి నాలుగు రకాలు - జరాయుజాలు అనగా తల్లి గర్భం నుండి ఉద్భవించేవి, అండజాలు అనగా గ్రుడ్డు నుండి పుట్టేవి, స్వేదజాలు అనగా చెమట నుండి పుట్టేవి మరియు ఉద్భిజ్జములు అనగా భూమిని చీల్చుకుని పుట్టేవి) దేహములో (శరీరములో) ఉన్నాడు. అన్నం చతుర్విధం అన్నారు అంటే నాలుగు విధములయిన పదార్థాలు [అవేమనగా భక్ష్యం (కొరికి తినేవి), భోజ్యం (నమిలి తినేవి), లేహ్యం (నాకి తినేవి), చోష్యం (పులుసు, మొదలయినవి)] మన భోజనములో ఉంటూ ఉంటాయి. మనం తినే భోజనం జీర్ణమయ్యి మన ప్రాణాన్ని నిలపెడుతుంది. అంటే అగ్నిలో ఆహుతయ్యి ఆ అగ్ని (హవ్యా వాహనుడు) శరీరమంతా ప్రాణ వాయువు రూపములో వ్యాపిస్తుంది. తిన్న ఆహారమును జీర్ణము చేసి మలమూత్ర శుక్ర రూపములో క్రిందకి తోసేది అపాన వాయువు. త్రాగిన వాటినీ, తిన్న వాటినీ రక్తముగా, పిత్తముగా, శ్లేష్మముగా మార్చి శరీరానికి సమానముగా అందించేది సమాన వాయువు. ఇది ఈ శ్లోకం యొక్క అర్థం. ఇటువంటి భోజనాన్ని మనలో ఉన్న వైశ్వానరుడు అనే అగ్నికి ఇచ్చే హవిస్సు క్రింద భావించాలి. అప్పుడే మనకి యజ్ఞం చేసినంత పుణ్య ఫలము లభించును. కనుక భోజనం చేసే ముందు ఈ శ్లోకాన్ని చదువుకుంటూ హోమం చేస్తున్నంత శ్రద్ధగా తినాలి.

"బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం
బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినా"

అన్నారు. అంటే హవిస్సు బ్రహ్మే, అగ్నీ బ్రహ్మే, హోత అనగా హోమం చేసేవాడూ బ్రహ్మే అన్నీ ఆయనే కనుక మనం చేసిన యజ్ఞం కాని, అన్నం కాని ఏదయినా సరే ఆ బ్రహ్మకే అర్పిస్తున్నాం అన్న భావనతో ఉండాలి. "సర్వం కల్విదం బ్రహ్మ" అన్నారు కదా! అందుకే "అన్నం పరబ్రహ్మ స్వరూపం" అంటారు. 

జ్ఞానాగ్ని: ఆత్మలో నిత్యం రగిలే అగ్నిని జ్ఞానాగ్ని అంటారు. "జ్ఞానాగ్నిః  సర్వ కర్మాణి భస్మసాత్ కురుతేర్జునా" అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్తాడు. అంటే జ్ఞానం అనే అగ్ని పుడితే సర్వ కర్మలూ (ఆగామి, సంచితం, ప్రారబ్ధం) భస్మమయిపోతాయి అని అర్థం. ఈ అగ్ని మనకి ముఖ్యముగా రామాయణములో తారసపడుతుంది. సీతాదేవి అగ్ని ప్రవేశం వెనుక ఉన్న అంతరార్థాన్ని గ్రహిస్తే ఈ జ్ఞానాగ్ని మనకి బోధపడుతుంది.

రావణ సంహారం తరువాత తన వద్దకు వస్తున్న సీతాదేవిని చూసిన రాముడు "దీపో నేత్రా తురస్యేవ ప్రతికూలాతి భామిని" అంటాడు. అంటే కళ్ళ జబ్బున్న వాళ్ళు ఏ విధముగా అయితే దీపాన్ని చూడలేరో అదే విధముగా నువ్వు నాకు ప్రతికూలముగా కనిపిస్తున్నావు కనుక నేను నిన్ను చూడలేకున్నాను అంటాడు. అప్పుడే చాలా స్పష్టముగా "బాలిశో పత కామాత్మా రామో దశరధాత్మజః చిర కాలాధ్యుషితాం సీతాం" (అంటే చాలా కాలం రావణుని వద్ద ఉన్న సీతని బాలిశుడై అనగా నీచుడై, కామాత్ముడైన రాముడు ఏలుకున్నాడు) అని లోకం అనుకుంటుందేమో అన్న కంటి జబ్బు నాది కానీ నీలో దోషం లేదు. కనుక లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, సుగ్రీవుడు, విభీషణుడు ఈ అయిదుగురిలో ఎవరి వద్దకు వెళతావో నువ్వే నిర్ణయించుకో అంటాడు. ఇది మన అందరికీ తెలిసిన బాహ్యార్థం. అంతరార్ధంలోకి వెళితే, సీతాదేవి జీవుడికీ, శ్రీరామచంద్రమూర్తి పరమాత్మకీ ప్రతీకలు. సీతాదేవి బంగారు లేడిని కోరటం వలన రాముడికి దూరమయ్యింది. అంటే జీవుడికి కోరికలు కలుగుట వలన పరమాత్మ నుండీ దూరమవుతాడు. ఇక్కడ ఉపనిషత్తులలో చెప్పబడిన ఒక చిన్న కథను చెప్పుకోవాలి. శరీరము అనే మామిడి చెట్టు మీద జీవ పక్షి, ఈశ్వర పక్షి ఉన్నాయిట. చెట్టు నిండా ఉన్న మామిడి పండ్లను చూసిన జీవ పక్షి తింటాను అంటే ఈశ్వర పక్షి వద్దని వారిస్తుందిట. అయినా వినకుండా జీవ పక్షి ఆ చెట్టుకి ఉన్న పండ్లన్నీ తినేస్తుందిట. తిన్నాక ఆ వనంలో ఉన్న మరొక చెట్టు, మరొక చెట్టు అలా తినాలి అన్న కోరిక వలన ఎన్నో చెట్లు మారుతూ ఈశ్వర పక్షికి దూరమవుతుంది. అదే విధముగా జీవుడు కూడా కోరికలని పెంచుకుంటూ ఎన్నో జన్మలెత్తుతూ పరమాత్మకి దూరమవుతున్నాడు. ఇలా దూరమయిన జీవుడు పంచాభూతాలకి మాత్రమే వశమవుతాడు అది వివరించేందుకే అయిదుగురిలో ఎవరివద్దకన్నా వెళ్ళమంటాడు రాముడు. "బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే" అని భగవద్గీతలో చెప్పినట్టు అసలు నేను ఎవరిని? ఎక్కడ నుండి వచ్చాను అన్న జ్ఞానాన్ని తెచ్చుకున్నప్పుడు కైవల్యం పొంది పరమాత్మ వద్దకు తిరిగి చేరగలడు. ఈ జ్ఞానం సన్యాసాశ్రమంలో తురీయావస్థలో పొందగలరు. సన్యాసాశ్రమం లోకి ప్రవేశించే ముందు వీరి సర్వ కర్మలు, కోరికలు అన్నీ భస్మం చేయటం కోసం విరజా హోమం చేస్తారు. అదే విధముగా సీతాదేవి రూపములో ఉన్న జీవుడు, రాముని రూపములో ఉన్న పరమాత్మను చేరటానికి విరజా హోమమనే జ్ఞానాగ్నిలో అగ్ని ప్రవేశం చేసి, సర్వ కర్మలూ, కోరికలనూ భస్మం చేసి పరమాత్మ అయిన రాముని వద్దకు వచ్చింది అని అంతరార్థం. దీనిని స్వయముగా చేసి జనానికి చూపించటమే సీతమ్మ వారి అగ్ని ప్రవేశ ఘట్టంలోని ఆంతర్యం.

"మర్త్యావతారం త్విః మర్త్య శిక్షణం
రక్షోవధాయై న చ కేవలం విభోః"

అన్నారు. మర్త్యులు (మరణం కలిగిన వారు) అనగా మానవులు. శ్రీహరి మానవావతారం అయిన రామావతారంలో కేవలం రాక్షస సంహారం కోసమే కాక, మానవులు ఎలా క్రమశిక్షణలో ఉండాలి అని ఆయన నడిచి చూపించాడు. అందుకనే రాముడు నడిచినట్టు నడవాలి, కృష్ణుడు చెప్పినట్టు చెయ్యాలి అంటారు.

దావాగ్ని: ఇది ఎండు పుల్లల రాపిడి, ఘర్షణ వలన పుడుతుంది. ఎక్కువగా అడవులలో పుట్టడం వలన ఇది కలుగ చేసే నష్టం కూడా తీవ్రమయినది. యజ్ఞ యాగాదులకి ఉపయోగించేది కూడా దావాగ్నే. గుంటలు త్రవ్వి, అందులో కర్రలను పేర్చి, నిప్పును రగల్చి ఉంచేవారు. వీటినే గుండాలు అని అంటారు. మెల్లిగా వీటి నుంచే వాడుకని బట్టీ అగ్ని గుండాలు, హోమ గుండాలు వచ్చాయి.

ఎండు పుల్లల రాపిడితో పాటూ, కవ్వంతో మజ్జిగ చిలికినట్టు అరణిలో మధించి అగ్నిని పుట్టించేవారు. ఈ రకముగా తయారయినటువంటి, యజ్ఞ యాగాదులకి ఉపయోగించే అగ్ని మూడు రకాలు. అవి దక్షిణాగ్ని, ఆహవనీయం (ఆహుతులిచ్చేది), గారహపత్యం (గృహస్థాశ్రమంలో ఉన్నవారు చేసేది). ఈ మూడిటినీ కలిపి త్రేతాగ్నులు అంటారు. ఇది వరకు నిత్యాగ్నిహోత్రులు ఉండేవారు. అటువంటివారు ఈ త్రేతాగ్నులనీ ఖచ్చితముగా వెలిగించేవారు. యజ్ఞము వలన ఉద్భవించిన అగ్ని పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుంది. సప్త జిహ్వాయనుడు (ఏడు నాలుకలు కలవాడు) అని ఈయన పేరుకి తగ్గట్టుగా హోమం చేసిన ఆహుతులని ఏడు నాలుకలతో ఈయన స్వీకరిస్తాడుట.

వజ్రాగ్ని: ఇది ఇంద్రుని వజ్రాయుధంలో ఉండే అగ్ని. దధీచి మహర్షి వెన్నుముక వజ్రాయుధం అని మనందరికీ తెలిసినదే. మన పురాణాల ప్రకారం ప్రప్రధమంగా నిప్పును కనుగొన్నది దధీచి మహర్షి. అందుకనే ఆయన గౌరవార్థం మన భారత ప్రభుత్వం ఒక తపాలా స్టాంపును కూడా విడుదల చేసింది. మెరుపులు, పిడుగులు అగ్ని స్వరూపాలే కదా! మన పురాణాల ప్రకారం మెరుపు ఇంద్రుని వజ్రాయుధమనీ, పిడుగు వజ్రాయుధా ఘాతమనీ ఉంది. ఇక్కడ మనం తెలుసుకోవలసిన విషయం వెన్నుముకకీ అగ్నికీ ఉన్న సంబంధం. మనిషి వెన్నెముక ఒక గొట్టంలా ఉంటుందనీ అందులో కొన్ని నాడులు ఉంటాయనీ మనకి తెలిసినదే. అయితే ఈ వెన్నెముక అనే గొట్టములో ఉండే ప్రధానమయిన నాడి సుషుమ్న నాడి. ఆ సుషుమ్న లోపల వజ్ర నాడి (దీనినే సూర్య నాడి అంటారు), ఈ వజ్ర నాడి లోపల చిత్ర నాడి (దీనినే చంద్ర నాడి అంటారు) ఉంటాయి. ఈ మూడు (సుషుమ్న, వజ్ర, చిత్ర) నాడులనీ కలిపి spinal cord అంటారు. వీటిలో సుషుమ్న నాడి ఎఱ్ఱగా అగ్ని లాగా ఉంటే, అందులో ఉండే వజ్ర నాడి వజ్రము వలే ప్రకాశముతో ఉంటుంది. ఆ ప్రకారముగా ఈ రెంటినీ కలిపి వజ్రాగ్ని అన్న వాడుక వచ్చింది. అలా వెన్నెముకలో వజ్రాగ్ని ఉంటుంది.

సూర్యాగ్ని
: సూర్యుని రూపములో కనిపించే అగ్నిని సూర్యాగ్ని అంటారు. దీనినే ఆదిత్యాగ్ని అని కూడా అంటారు. "అగ్ని సోమాత్మకం జగత్" అని తైత్తరీయోపనిషత్తులో చెప్పబడింది. అంటే ఈ ప్రపంచం మొత్తం అగ్నీ, చంద్రుల రూపములో ఉందనీ, ఈ అగ్నే సూర్యుని రూపములో ప్రకాశిస్తోందనీ అర్థం. శివ-శక్తులు, ప్రకృతి-పురుషులు, వెలుగు-నీడలు లాగానే సూర్య-చంద్రుల ప్రమేయం సృష్టి వికాసానికి మూలమన్నది వాస్తవం. ప్రశ్నోపనిషత్తులో "కర్మ సాక్షి"గా సూర్యుడిని ఎన్నుకున్నారు అని చెప్పబడింది. అందువలననే అగ్నిసాక్షిగా అని వాడినా సూర్యుని సాక్షి అన్న అర్థం అంతర్లీనంగా ఉంటుంది. ఆ విధముగా రక్షకునిగా, సృష్టి వికాస ప్రక్రియా ప్రేరకునిగా అగ్నిని సాక్షిగా నియమించారని తెలుస్తున్నది.

యోగాగ్ని: అంటే కేవలం యోగము లేదా ఆలోచన వలన పుట్టేది. ఈ యోగాగ్నిని సతీదేవి, దధీచి మహర్షి పుట్టించారు. దక్షయజ్ఞ సమయములో తనకి పరాభవం ఎదురయ్యిందని సతీదేవి బాధతో కన్నీటి చుక్కను వదిలి దానిని కాలి బ్రొటన వేలితో రాసినప్పుడు అగ్ని పుట్టి అందులో ఆవిడ దగ్ధమయ్యింది. అలానే దేవతల ఆయుధాలన్నీ కావాలన్నప్పుడు దధీచి మహర్షి యోగాగ్నిని పుట్టించి దగ్ధమయ్యి తన అవయవాలను ఇచ్చాడు. దీనిని బట్టి చూస్తే గొప్ప వాళ్ళు, మహా యోగులు వారి యోగా శక్తితో తలుచుకున్న వెంటనే అగ్నిని పుట్టించి వారి శరీరాన్ని వారే దగ్ధం చేసుకునేవారని తెలుస్తుంది.

ప్రేతాగ్ని: దీనినే స్మశానాగ్ని అని కూడా అంటారు. దీనిని తలుచుకోగానే నాకు రామాయణములోని ఒక ఉపమానం జ్ఞప్తికొస్తుంది. అదేమిటంటే స్మశానాగ్ని కూడా అగ్నే అయినా మంచి పనులకి ఎలా పనికి రాదో అదే విధముగా రావణుడు ఎంత తేజోసంపన్నుడైనా రాముని ముందు పనికి రాలేదు అని. మానవ దేహం పంచభూతాలతో చేసినదే కనుక మనిషిని దహనం చేసి మళ్ళీ ఆ పంచభూతాలలో ఐక్యం చేస్తారు. ఇలా శరీర దహనానికి ఉపయోగపడే అగ్నినే ప్రేతాగ్ని అంటారు.

మన మంత్రపుష్పంలో ఈ అగ్ని గురించిన ప్రస్తావన ఉంది. ప్రతీ మనిషిలోనూ భగవంతుడున్నాడు. ఎలా ఉన్నాడయ్యా అంటే ఒక అగ్నిశిఖ రూపములో, నల్లని మబ్బులో విద్యుల్లత (మెరుపు) వెలిగినట్టు, సూక్ష్మంగా, పచ్చగా ఉన్నాడుట. ఆ అగ్నిశిఖ మధ్యలో ఉన్న ఈయనే శివుడు, ఈయనే బ్రహ్మ, ఈయనే విష్ణువు అని చెప్పబడింది. dee మనది పవిత్రమయిన భారత దేశం. భా అంటే వెలుగు లేదా కాంతి. "భాయాం రతః" భారతః అన్నారు. ఎవరయితే ఈ  అగ్ని రూపములో ఉన్న పరమాత్మ వెలుగుని ఉపాసన చేసి మనోవాక్కాయ ("భా" అంటే భావం అనగా మనసు, "ర" అంటే రవం అనగా వాక్కు, "త" అంటే తనువు అనగా కాయం) కర్మలలో ఏకత్వాన్ని పొందుతారో వారే భారతీయులు అని చెప్పబడింది. అంతటి గొప్ప ప్రఖ్యాతలు ఉన్న మనం వీటన్నిటినీ ఆచరించి, ఆలంబించినప్పుడే ఈ జన్మకి, మన పుట్టుకకి ఒక సార్థకత.