Sunday, December 25, 2011

ప్రపోసల్


అబ్బాయి అల్లిన కొంటె కవితకి అబ్బురపడిన అమ్మాయి ఇచ్చిన సమాధానానికి అతనిలో క్రొత్త ఉత్సాహం ఉరకలు వేసింది. ఎలా అయినా తన మదిలోని మాటని ఆమెకి ఇలా చెప్పాడు:


ప్రియతమా పలుకుమా
ఈ హృదయ వేదనలు వీడి
ఆ మౌన శోధనలు మాని
ఈ ప్రియుని చెంతనే చేరి
ఆ వలపు వలల తోటి
ప్రియతమా పలుకుమా

నీ కలతే నా కలైతే మరి
నా నిదుర మాయమైపోతే సరి
నీ అలకే నా వ్యధైతే మరి
నా మనసు కరిగితే సరి
నువ్వే కదా నా జాబిలమ్మవి
నీకే కదా ప్రేమించే నా మది
నీకై ఎదురుచూపు నిదురకాపు
మధురమైన తలపు నాకు

నీ పిలుపే నేనైతే మరి
నేను లేను అది నువ్వే చెలి
నీ తలపే నాదైతే మరి
నా దిగులు తీరుతుంది చెలి
నేనే కదా నీ ప్రేమ పూజారి
నువ్వే కదా నా హృదయ దేవేరి
నిన్నే తలుచుకుంటూ పరితపిస్తూ
క్షణమొక యుగముగా గడుపుతున్నాను


Wednesday, December 21, 2011

కేళీ విలాసము



పలికెను మోహన మురళి
రవళించెను అందెల రవళి

మురళీలోలుని మోహన రాగం
రాధిక హృదిలో రసమయ గానం
రాగ రంజితం రాధిక హృదయం
సంగీత నాట్యాల సంగమం

వెదురు వేణువై పలికిన వేళ
రాధిక మది కదలాడిన వేళ
పరవశించెను యమునా తీరం
ప్రకృతి పురుషుల సంగమ వేళ

అందెల రవళి ఘల్లు ఘల్లున
మురళీ గానం మెల్లగా సాగగా
వేడుక చేసెను బృందావనమున
ఏమని తెలిపెద కేళీ విలాసము 

Saturday, December 17, 2011

కళా "శుచ"రితం



ఇవాళ మరొక గొప్ప కళాకారిణితో మీ ముందుకి వచ్చాను. ఈవిడ జనాలకి తెలియకపోయినా ఈ చిత్రాలలో కనీసం ఒక్కటయినా అందరూ చూసే ఉంటారు. ఈవిడ పేరు శుచి క్రిషన్

 
ఈవిడ చిత్రకళలో ఎంతో పేరు ప్రఖ్యాతలు గాంచిన సర్ల చంద్ర గారి మనవరాలు. చిన్ననాటినుండి చిత్రకళా వాతావరణంలో పెరిగిన ఈవిడ కూడా ఆ కళ మీద మక్కువ పెంచుకున్నారు. ప్రపంచంలోని అందాలకి సున్నితమయిన రంగులతో జీవం పోయాలని నిర్ణయించుకున్నారు. ఈవిడ చిత్రాలకి కుటుంబీకులతో పాటు జర్మన్ చిత్రకారుల స్ఫూర్తి కూడా తోడయ్యింది అని చాలా సందర్భాలలో చెప్పడం జరిగింది.   
 
తన తొలి అడుగును చుట్టూ ఉన్న పరిసరాలతో వేయాలని నిశ్చయించుకున్న ఈవిడ సొంత ఊరు ఢిల్లీ కావడంతో రాజస్థాన్ వాసులు ఈవిడ దృష్టిని ఆకట్టుకున్నారు. కనుక వారి చిత్రాలతో చిత్రకళను మొదలుపెట్టారు. మరుగున పడిపోతున్న శిల్పకళ, భవనాలు, కట్టడాలు అన్నీ ఈవిడ చిత్రాలలోని అంశాలు. రాజభవనాలు, హవేలీలు, స్తంభాలు, ఆలోచనలలో మునిగి ఉన్న స్త్రీలు,  మొదలయినవన్నీ చిత్రాలుగా రూపొందించటం ఈవిడకి చాలా ఇష్టం.
 
ఢిల్లీ పబ్లిక్ స్కూలులో (1976 - 1983) చదువుతున్నప్పుడు మొదటి సారిగా చిత్రాలు వేయటం ప్రారంభించిన ఈవిడ 1983 లో ఈవిడ +2 (మన పరిభాషలో ఇంటరు) పూర్తయ్యేసరికి ఈవిడ చిత్రాలు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అకాడమిక్ బోర్డు ద్వారా చిలె, నైజీరియా మొదలయిన చోట్ల ప్రదర్శనలకి ఎంపికయ్యాయి. ఈ ఉత్సాహంతో ఆవిడ Delhi College of Fine Arts లో చేరి 1986 కి ఆ చదువు పూర్తయ్యేసరికే ఇరాక్లో జరిగిన paintings exhibition లో ఈవిడ చిత్రాలు వీక్షకుల మనసు దోచుకున్నాయి. వాటిల్లో ముఖ్యమయినదే ఈ చిత్రం.     

ఆ తరువాత ఎన్నో దేశాలలో చిత్ర ప్రదర్శనల్లో సుస్థిర స్థానాన్ని పొందిన ఈవిడ చిత్రాలు ఎన్నో గొప్ప గొప్ప బహుమతులను తెచ్చిపెట్టాయి. ఆయిల్ మరియు వాష్ painting లో చేయి తిరిగిన ఈవిడ ప్రస్తుతం ఢిల్లీలో శిక్షణా తరగతులను నడుపుతున్నారు. ఆవిడ చిత్రాల గురించి Asian Spirit-Nationality and Tradition [KOREA] మరియు Artists of the Twentieth Century [U.S.A.] అనే పుస్తకాలలో మరింత వివరంగా చదవచ్చు. మరణిస్తున్న ఒక భారతీయ కళని కాపాడాలన్న తపనతో మొదలుపెట్టిన ఈ చిత్రకళ నా జీవితంలో ఒక చోదక శక్తిగా మారింది అని, రాజా రవి వర్మ చిత్తరువులను ఆరాధిస్తాను అని ఆవిడ చాలా సందర్భాల్లో చెప్పారు. అందువలన ఈ కళ మరుగున పడకుండా, మరణించకుండా తన వంతు కృషి ఆవిడ చేసినప్పటికీ తన కుమారుని కూడా ఇదే బాటలో నడుపుతున్నారు. ఇటువంటి కళాకారులెందరో మన భారతదేశంలో.............. 

ఈవిడ గీసిన మగువల చిత్రాలను చూడండి.....




ఈవిడ గీసిన రాజస్థానీ మగవారి చిత్రాలు......




ఈవిడ కళాపోషణకి మచ్చుతునకలు....



ఈవిడకి అత్యంత ఇష్టమయిన కళలను కుంచెతో రూపొందించిన తీరు..........

The Last Door of Notre Dame, Paris