Friday, March 28, 2014

"మన్వ" చరిత్ర


శీర్షిక చూసి అచ్చు తప్పు అని మాత్రం అనుకోకండి, నేను ఇక్కడ వ్రాయదలుచుకున్నది మన్వంతరాల గురించి కనుక ఏదో అలా కలిసొస్తుందని పెట్టాను అంతే. వేరే దేశంలో వున్నవాళ్ళని తప్పకుండా అడిగే ప్రశ్నలు - మీకు టైం ఎంత?, అక్కడ ఉష్ణోగ్రత ఎంత? అని. ఆలోచిస్తే చాలా విచిత్రంగా, కొంచెం అర్థమయినట్టు, అస్సలేమీ అర్థం కానట్టు అనిపిస్తుంది నాకయితే. కాల చక్రానికి, జీవుల ఉనికికి, ఉష్ణోగ్రతకి వున్న సంబంధాన్ని వెతుకుతూ నా పరిధి మేరకు ఆలోచించి వ్రాస్తున్న టపా. తప్పులుంటే సరిదిద్ది, కాస్త ఓపిక చేసుకుని చదవండి. 


ముందుగా మన కాల ప్రమాణాలను ఒకసారి గుర్తు చేసుకుందాం.
2 పరమాణువులు = 1 అణువు
3 అణువులు = 1 త్రెస రేణువు
3 త్రెస రేణువులు దాటడానికి సూర్యునికి పట్టే కాలాన్ని 1 తృటి అంటారు
100 తృటులు = 1 వేధ
3 వేధలు = 1 లవం
3 లవాలు = 1 నిమేషం (మన సెకనులో 16/75వ భాగం)
3 నిమేషాలు = 1 క్షణం
5 క్షణాలు = 1 కాష్ట
15 కాష్టలు = 1 లఘువు
15 లఘువులు = 1 నాడి లేదా 1 ఘడియ
2 నాడులు = 1 ముహూర్తం
7 నాడులు = 1 యామం; 7 1/2 ఘడియలు = 1 ఝాము
8 ఝాములు లేదా 8 యామాలు = 1 రోజు
15 రోజులు = 1 పక్షం
2 పక్షాలు = 1 మాసం లేదా నెల; 40 రోజులు = 1 మండలం 
2 నెలలు = 1 ఋతువు
3 ఋతువులు = 1 ఆయనం
2 ఆయనాలు = 1 మానవ సంవత్సరం
30 మానవ సంవత్సరాలు = 1 నెల (దేవతలకు) - అనగా మన కాల ప్రమాణము కన్నా దేవతల కాల ప్రమాణము 360 రెట్లు ఎక్కువ.
43,20,000 మానవ సంవత్సరాలు = 1 మహా యుగం (1 కృత లేదా సత్య యుగము + 1 త్రేతా యుగము + 1 ద్వాపర యుగము + 1 కలి యుగము = 17,28,000 + 12,96,000 + 8,64,000 + 4,32,000 మానవ సంవత్సరాలు)
71 మహా యుగాలు = 1 మన్వంతర కాలం = ప్రజాపతి ఆయుర్దాయం
14 మన్వంతరాలు = 1 కల్పం 
30 కల్పాలు = 1 మహాకల్పం 

శ్రీ స్కాంద పురాణం ప్రకారంగా ఆ 30 కల్పాలూ - శ్వేత వరాహ, నీలలోహిత, వామదేవ, రత్నాంతర, రౌరవ, ప్రాణ, బృహత్, కందర్ప, సద్యత, ఈశాన, ధ్యాన, సారస్వత, ఉదాన, గరుడ, కౌర్మ, నారసింహ, సమాధి, ఆగ్నేయ, విష్ణుజ, సౌర, సోమ, భావన, సుపుమ, వైకుంఠ, అర్సిస, వలి, వైరజ, గౌరీ, మహేశ్వర మరియు పితృ. 



వీటినే మరికాస్త వివరంగా ఈ చిత్రంలో పొందుపరిచాను. అయితే, ఇందులో క్రొత్తగా చేర్చినది సంధి కాలము. ప్రతీ యుగ కాలానికీ ముందు, వెనుక వుండే కాలాన్నే సంధి కాలం అంటారు. యుగ కాల మొత్తం = యుగ కాలం + యుగానికి ముందు వచ్చే సంధికాలం + యుగానికి తరువాత వచ్చే సంధి కాలం. ఉదా: మానవ కలియుగం తీసుకుందాం 
కలియుగ కాల మొత్తం = కలియుగ కాలం + 2 (కలి యుగ సంధి కాలం)
                          = 3,60,000 + 2 (36,000) = 4,32,000

ఒక యుగం నుండీ మరొక యుగానికి కాల మొత్తాన్నీ, ఆయుర్దాయాన్నీ గమనిస్తే వాటి నిష్పత్తులు ఈ విధంగా వున్నాయి కృత:త్రేతా:ద్వాపర:కలి = 4:3:2:1 కనుక దీనినే నేను 1 మహా యుగం = 10 కలియుగాలు అని అంటాను. ఎందువలననగా, 1 మహాయుగం = కృత యుగం (4 x కలియుగం) + త్రేతా యుగం (3 x కలియుగం) + ద్వాపర యుగం (2 x కలియుగం) + కలియుగం = కలియుగం x (4+3+2+1). అలాగే ప్రతీ మన్వంతరానికీ అటు, ఇటు కూడా సంధి కాలాలు వుంటాయి. 1 మన్వంతర సంధి కాలం 1 కృత యుగ కాలంతో సమానం కనుక 1మన్వంతర సంధి కాలం = 4 కలియుగాలు. 

బ్రహ్మగారి ఆయుర్దాయము వంద సంవత్సరాలు కాగా, ప్రతీ నెలకీ ఒక మహాకల్ప కాలం గడుస్తుంది. మొదటి కల్ప కాలం బ్రహ్మకి పగలు, దానినే సర్గము అంటారు. రెండవ కల్ప కాలం బ్రహ్మకి రాత్రి, దానినే ప్రళయం అంటారు. మళ్ళీ మూడవ కల్ప కాలం సర్గ, నాల్గవ కల్ప కాలం ప్రళయం అవుతాయనమాట! ఈ విధంగా చూసుకుంటే ఇదొక నిరంతర చక్రం. సర్గ కాలంలో సృష్టి జరిగితే ప్రళయ కాలంలో సృష్టంతా నశిస్తుంది.  ప్రళయ కాలంలో సృష్టి ఎలా నశిస్తుంది అంటే: 

చతుర్విధాని భూతాని సమయాంతి పరిక్షయం
తదా తప్త శిఖాకారై రూపేతో ఘర్మ దీధితిః
మయూఖై రగ్ని సదృశైః వమద్భిః పావకచ్ఛటాః
తతో విధాతుర్గాత్రేభ్యః సముత్పన్నా మహాఘనాః 

అనగా పంచ భూతాలలో నాలుగు (ఆకాశం, గాలి, నీరు, భూమి) నశించిపోగా, అయిదవదయిన అగ్ని మాత్రం విజృంభిస్తుంది. ఈ అగ్ని జ్వాలలకే గ్రామాలు, అడవులు, కొండలు, అన్నీ మాడి మసి అయిపోతాయి. కాల్చిన ఇనుప గుండు లాగా భూగోళం మారిపోతుంది. ఆ విధంగా సృష్టంతా నశించిపోతుంది. ఆ తరువాత మళ్ళీ కల్ప కాలం సర్గతో మొదలవుతుంది, మళ్ళీ సృష్టి మన్వంతరాలతో మొదలవుతుంది. మన్వంతర కాలాన్ని పరిపాలించే ప్రభువే మనువు. మనకు 14 మన్వంతరాలు కనుక 14 మనువులున్నారు. వారు  

1) స్వాయంభువుడు - స్వాయంభువ మన్వంతరం      2) స్వారోచిషుడు - స్వారోచిష మన్వంతరం 
3) ఉత్తముడు - ఉత్తమ మన్వంతరం                     4) తామసుడు - తామస మన్వంతరం
5) రైవతుడు - రైవత మన్వంతరం                        6) చాక్షుషుడు - చాక్షుష మన్వంతరం 
7) వైవస్వతుడు - వైవస్వత మన్వంతరం                8) సూర్య సావర్ణి - సూర్య సావర్ణ మన్వంతరం
9) దక్ష సావర్ణి - దక్ష సావర్ణ మన్వంతరం                10) బ్రహ్మ సావర్ణి - బ్రహ్మ సావర్ణ మన్వంతరం
11) ధర్మ సావర్ణి - ధర్మ సావర్ణ మన్వంతరం             12) రుద్ర సావర్ణి - రుద్ర సావర్ణ మన్వంతరం             
13) దేవ సావర్ణి - దేవ సావర్ణ మన్వంతరం              14) చంద్ర సావర్ణి - చంద్ర లేదా భౌమ్య సావర్ణ మన్వంతరం
    
మన్వంతరాల గురించి మనకు తెలిసిన విషయాలనన్నిటినీ క్రూడీకరించి చూస్తే సృష్టి పరిణామ క్రమం తెలుస్తుంది. సరిగ్గా ఈ విషయాన్నే వివరిస్తూ IAS అధికారి అయినటువంటి డా.సుఖ్ లాల్ ధని గారు ఒక వ్యాసాన్ని వ్రాశారు. ఆ వ్యాసంలోని ముఖ్యమయిన అంశాలను మనకు తెలిసిన అంశాలతో పోలుస్తూ, నా ఆలోచనలను యిక్కడ వ్రాస్తున్నాను.  

1) స్వాయంభువ మన్వంతరం (ప్రస్తుత కాలానికి 1973-1665 మిలియన్ సంవత్సరాల క్రితం) - Matter evolved into solar system: 
గ్రహాలూ, నక్షత్రాలూ, ఏమీ లేకుండా కేవలం శూన్యం మాత్రమే నిండి వున్న సమయంలో అనుకోకుండా ఎక్కడనుండో ఘర్.. ఘర్.. అనే శబ్దం వచ్చి, దాని నుండీ సృష్టి చక్రం మొదలయ్యింది. చీకటి నుండీ ఒక చిన్న మెరుపు (nebula), ఆ మెరుపు నుండీ క్రమంగా పరిణామ చక్రం మొదలయ్యాయి. ఇవన్నీ వాటంతట అవే, వేరేవాటి ప్రమేయం లేకుండా జరిగిపోయాయి కనుకనే ఈ సమయానికి స్వాయంభువు అనే పేరు కలిసింది. స్వయంభువు అనగా తనంతట తానుగా అని అర్థం కదా! అయితే దీనినే ఆధ్యాత్మికంగా చూస్తే, ప్రణవమయిన "ఓం" అనే శబ్దం నుండీ సృష్టి చక్రం మొదలయ్యింది. అలాగే నిరాకారమయిన జ్యోతి నుండే పరిణామ చక్రం కూడా మొదలయ్యింది. మన పురాణాల (శ్రీ బ్రహ్మ వైవర్త పురాణం) ప్రకారం బ్రహ్మ ముఖము నుండీ స్వాయంభువ మనువు ఉద్భవించాడు. బ్రహ్మ- జ్యోతి స్వరూపుడు కనుక, ఆయన నుండీ వచ్చిన స్వాయంభువ మనువుని పరిణామ చక్రానికి మూలాధార పురుషునిగా పరిగణించి ఉండవచ్చును అని నా అనుకోలు.  

2) స్వారోచిష మన్వంతరం (ప్రస్తుత కాలానికి 1665-1356 మిలియన్ సంవత్సరాల క్రితం) - Sun assumes self-shining quality: 
మొదట చిన్నగా ఆవిర్భవించిన మెరుపు కొంతకాలానికి బాగా వేడెక్కి, మండే గోళంలా మారింది. అనగా చిన్నగా వున్న మెరుపు ఒక స్వయం ప్రకాశిత గోళంలా మారింది కనుకనే ఈ సమయానికి స్వారోచిషము అన్న పేరు సరిపోయింది. స్వారోచిషము అనగా స్వయం ప్రకాశితం అని అర్థం కదా! ఇదే సమయములో, మెరుపు వేర్వేరు స్వయం ప్రకాశిత గోళాలుగా కూడా విభజన చెందింది. శ్రీ బ్రహ్మ వైవర్త మహాపురాణం ప్రకారం స్వారోచిష మనువు అగ్నిదేవుని పుత్రుడు. కానీ శ్రీ దేవీ భాగవతం పరంగా చూస్తే, స్వారోచిష మనువు స్వాయంభువ మనువు యొక్క మనవడు  (స్వాయంభువుని పుత్రుడైన ప్రియవ్రతుని కుమారుడు). ఇతను 12 సంవత్సరాలు ఘోర తపస్సు చేసి అమితమయిన కాంతితో కూడిన దేవీ కృపను మరియు మన్వంతర రాజ్యాన్ని పొందాడు. ఇక్కడ మెరుపు గోళంలా మారి, అనేక గోళాలుగా విభజన చెందడం అనే విషయాన్నే వేరొక తరముగా (next generation) చూపించి వుండవచ్చును. 

3) ఉత్తమ మన్వంతరం (ప్రస్తుత కాలానికి 1356-1047 మిలియన్ సంవత్సరాల క్రితం) - Sun becomes golden yellow star: 
స్వయం ప్రకాశిత గోళంలా వున్న వెలుగు, ఒక నిర్దిష్టమయిన ఆకారాన్ని, పరిమాణాన్ని, ఉష్ణోగ్రతను చేరుకొని, సకల జీవకోటిని, సృష్టిని నిర్వహించగల సామర్ధ్యాన్ని సంపాదించుకుని సూర్యునిగా స్థిరపడింది. అనగా సూర్యుడు ఒక సంపూర్ణ నక్షత్రంగా మారి, అన్నిటికీ అధిపతి అయ్యాడు కనుకనే ఈ సమయానికి ఉత్తమ అనే పేరు బాగా నప్పింది. శ్రీ దేవీ భాగవతంలో  ప్రియవ్రతుని పుత్రుడే ఉత్తముడు అనే పేరుతో ప్రసిద్ధికెక్కాడు అని వుంది. ఇందాకా అన్వయించుకున్నట్టు తరువాతి తరం మార్పుని సూచిస్తే, ఒకే తరం వున్నదానిలోనే చిన్న చిన్న సర్దుబాట్లు చేసుకుని ఒక స్థానాన్ని పొందింది అనుకోవచ్చుననుకుంట. 

4) తామస మన్వంతరం (ప్రస్తుత కాలానికి 1047-738 మిలియన్ సంవత్సరాల క్రితం) - Era of darkness: 
స్వారోచిష సమయమప్పుడు ఏర్పడిన మిగతా స్వయం ప్రకాశిత గోళాలలో భూమి ఒకటి. అది కొంతకాలానికి ఘనీభవించి తన ప్రకాశాన్ని కోల్పోయింది. దానితో, సూర్యునికి భూమి ఎటువైపు వుంది అన్నదాన్ని బట్టీ పగలు, రాత్రీ ఏర్పడ్డాయి. ఈ సమయంలో జరిగిన ముఖ్యమయిన పరిణామాలు - భూమి ప్రకాశాన్ని కోల్పోవడం (వెలుగు లేకపోవడం),  రాత్రి ఏర్పడటం కనుక దీనికి తామసము అనే పేరు సరయినది. తామసి అనగా చీకటి అని అర్థం కదా! శ్రీ దేవీ భాగవతం ప్రకారంగా తామసుడు కూడా ప్రియవ్రతుని కుమారుడే. ఇందాకా చెప్పుకున్నట్టు ఇది కూడా అదే తరం కనుక ఒక సర్దుబాటుగా తన గుణాన్ని కోల్పోయి వుండవచ్చును.

5) రైవత మన్వంతరం (ప్రస్తుత కాలానికి 738-429 మిలియన్ సంవత్సరాల క్రితం) - Formations of mountains and oceans, etc.: 
కొన్ని మిలియన్ సంవత్సరాల పాటూ భూమి మీద వాన కుండపోతగా కురవటం వలన నదులు, సముద్రాలు, పర్వతాలు, ఏర్పడగా ఇంకా మిగిలిన నీరు మేఘాలుగా ఏర్పడింది. ఆ తరువాతనే భూమి మీద మొదటిసారిగా చలనం మొదలయ్యి, సుడిగాలులు, సుడిగుండాలు, కెరటాలు ఏర్పడ్డాయి. రైవతం అనగా కదలిక, చలనం అనే అర్థాలున్నాయి. శ్రీ దేవీ భాగవతంలో రైవతుడు తామసుని సోదరుడు, ఇతను సర్వ సిద్ధులు లభించే శక్తిని పొందాడు అని వున్నది. బహుశః ఆ శక్తికీ, ఈ చలనానికీ ఏమయినా పొంతన వుందేమో?

6) చాక్షుష మన్వంతరం (ప్రస్తుత కాలానికి 429-120 మిలియన్ సంవత్సరాల క్రితం) - Emergence of conspicuous life in abundance: 
ఈ సమయంలోనే మొదటిసారిగా గుర్తించదగిన సృష్టి జరిగినది. సముద్రంలోని నీరు ఆవిరయ్యి (దీనికి కావలసిన వేడి సూర్యుని ద్వారా లభిస్తుంది) మరలా భూమిని వాన రూపంలో చేరుకోవడం అనే నిరంతర ప్రక్రియ జరగడం వలన జీవం ఆవిర్భవించింది. ఈ జీవ ఆవిర్భవాన్ని కనుల రూపంలో సూచించారు, అనగా కనులున్న జీవులు (పశు పక్ష్యాదులు) ఆవిర్భవించాయి కనుక చాక్షుష అనే పేరు తగినది. చాక్షుష అనగా చక్షువులు (కనులు) కలిగినవి అని అర్థం కదా! ఈ మన్వంతర ప్రభువయిన చాక్షుషుని ఆవిర్భావం గురించి నాకు పెద్దగా తెలియదు కానీ ఈ మనువు ప్రస్తావన మత్స్య, కూర్మ, వరాహ పురాణాల్లో వస్తుంది. కనుక ఇక్కడ చెప్పుకున్నట్టు జీవుల ఆవిర్భవానికీ, చాక్షుషునికీ సంబంధం వుండవచ్చును. 

7) వైవస్వత మన్వంతరం (120 మిలియన్ సంవత్సరాల క్రితం నుండీ ప్రస్తుత కాలం ...) - Emergence of Man: 
కాల చక్రంలో మనం ప్రస్తుతం శ్వేత వరాహ కల్పంలో, వైవస్వత మన్వంతరంలో 28వ మహాయుగంలో వున్నాము. ఆ ప్రకారంగా, ప్రస్తుత కల్పంలో ఎంత కాలం గడిచిందో చూద్దాం: 
గడచిన మన్వంతరాలు 6 కనుక 6 మన్వంతరాల కాలం = 6 x 71 మహాయుగాలు 
                                                                = 6 x 71 x 10 కలియుగాలు
                                                                = 4260 కలియుగాలు
గడచిన 6 మన్వంతరాలకీ 7 మన్వంతర సంధి కాలాలు = 7 x 4 కలియుగాలు
                                                               = 28 కలియుగాలు
గడచినవి 27 మహాయుగాలు కనుక 27 మహాయుగాలు = 27 x 10 కలియుగాలు
                                                                  = 270 కలియుగాలు
ప్రస్తుతం మనం కలియుగంలో వున్నాము అంటే, కృత, త్రేతా, ద్వాపర యుగాలు గడిచాయి అంటే (4+3+2)=9 కలియుగాల కాలం గడిచింది. అలానే ప్రస్తుతానికి (2014) కలియుగం మొదలయ్యి 5115 సంవత్సరాలు గడిచాయి. వీటి ఆధారంగా,
ప్రస్తుత (28వ) మహాయుగంలో గడచిన కాలం = 9 కలియుగాలు + 5115 సంవత్సరాలు 
                                        = 9 (4,32,000) + 5115 సంవత్సరాలు
                                        = 38,93,115 సంవత్సరాలు 
                                        = 3.9 మిలియన్ సంవత్సరాలు 
ఇహ, ప్రస్తుత కల్పంలో గడచిన కాలం = 6 మన్వంతరాల కాలం + 7 మన్వంతర సంధి కాలాలు + 27 మహాయుగాలు + ప్రస్తుత మహాయుగ కాలం
                                           = (4260 + 28 +  270) కలియుగాలు + 38,93,115 సంవత్సరాలు
                                           = 1972949115 సంవత్సరాలు = 1973 మిలియన్ సంవత్సరాలు లేదా 1.97 బిలియన్ సంవత్సరాలు. 
అనగా, ఈ శ్వేత వరాహ కల్పం మొదలయ్యి 1.97 బిలియన్ సంవత్సరాలు గడిచిందనమాట!

ఈ సమయంలోనే మొదటిసారిగా మానవుని ఆవిర్భావం జరిగినది. మన పురాణాల ప్రకారంగా మానవుని ఆవిర్భావం జరిగి నేటికి 120 మిలియన్ సంవత్సరాలు పూర్తయ్యింది కానీ మన శాస్త్రవేత్తలు 3.75-4 మిలియన్ సంవత్సరాల క్రితం మానవుని ఉనికి ఉన్నదని తెలుపుతున్నారు. కొంచెం శ్రద్ధగా గమనిస్తే, శాస్త్రవేత్తలు మానవుని ఉనికి తెలిపిన కాలానికి మనం లెక్కించిన ప్రస్తుత (28వ) మహాయుగ కాలం (3.9 మిలియన్ సంవత్సరాలు) దగ్గరగా వుంది. శ్రీ బ్రహ్మ పురాణం ప్రకారం, వైవస్వంతుడు అనగా సూర్యుడు అలాగే వైవస్వత మనువు సూర్యుని కుమారుడు. సూర్యుని ఆవిర్భావం తరువాతనే సకల ప్రాణుల ఆవిర్భావం కూడా జరిగి, ఆ తరువాతనే మానవుడి ఆవిర్భావం జరిగింది అన్నది అన్ని విధాలుగానూ ఆమోదించబడిన విషయం. భారత దేశంలో అటు చరిత్ర పరంగా చూసినా, ఇటు పురాణ పరంగా చూసినా కూడా సూర్య వంశ రాజులే ప్రప్రధమంగా మనల్ని పరిపాలించారు. 

ప్రస్తుత (28వ) మహాయుగం పూర్తి కావడానికి మిగిలి వున్న కాలం = 10 కలియుగాలు (మహాయుగ పూర్తి కాలం) - ప్రస్తుత మహాయుగంలో గడచిన కాలం = (10 x 4,32,000) - 38,93,115 సంవత్సరాలు = 4,26,885 సంవత్సరాలు.

అలాగే ప్రస్తుత మన్వంతరం పూర్తి కావడానికి మిగిలి వున్న కాలం = మొత్తం మన్వంతర కాలం - గడచిన మహాయుగాల కాలం = 71 మహాయుగాలు - 27.8 మహాయుగాలు = (71 x 10 కలియుగాలు) - (270 కలియుగాలు + 38,93,115 సంవత్సరాలు) = 306720000 - 120533115 సంవత్సరాలు
                                   = 186186885 సంవత్సరాలు = 186 మిలియన్ సంవత్సరాలు 

8-14) సావర్ణ మన్వంతరాలు: 
రాబోతున్న మన్వంతరాలన్నీ సావర్ణి అనే పేరుతోనే ముగుస్తాయి. సావర్ణి అనగా ఒకే రంగు కలిగినవి లేదా సమానమయిన (ఒకే విధమయిన) పదార్ధం కలిగినది అనుకోవచ్చును. 

సావర్ణ మన్వంతరాలు అన్నీ కలిపి 7 కనుక వాటి కాలాన్ని చూస్తే, 
7 సావర్ణ మన్వంతరాల కాలం = 7 x 71 మహాయుగాలు = 7 x 71 x 10 కలియుగాలు = 4970 కలియుగాలు
7 మన్వంతరాలకీ 8 మన్వంతర సంధి కాలాలు = 8 x 4 కలియుగాలు
                                                      = 32 కలియుగాలు
కనుక సావర్ణ మన్వంతరాల కాల మొత్తం = (4970 + 32) కలియుగాలు = 5002 x 4,32,000 సంవత్సరాలు = 2160864000 సంవత్సరాలు = 2161 మిలియన్ సంవత్సరాలు లేదా 2.16 బిలియన్ సంవత్సరాలు.
ఇక ఈ శ్వేత వరాహ కల్పంలో మిగిలి వున్న కాలం = సావర్ణ మన్వంతరాల కాలం + ప్రస్తుత మన్వంతరం పూర్తి కావడానికి మిగిలి వున్న కాలం = 2160864000 సంవత్సరాలు + 186186885 సంవత్సరాలు = 2347050885 సంవత్సరాలు = 2347 మిలియన్ సంవత్సరాలు లేదా 2.35 బిలియన్ సంవత్సరాలు. 

మనం మొదట్లో చెప్పుకున్నట్టు ఈ కల్పాంతంలో సృష్టి నశిస్తుంది కనుక 2347 మిలియన్ సంవత్సరాల తరువాత సృష్టి నశించాలి. మనం జాగ్రత్తగా గమనిస్తే ప్రతీ మన్వంతరానికీ 309 మిలియన్ సంవత్సరాలు పట్టి, మార్పు కనిపిస్తోంది. ఆ మార్పే రాబోతున్న మన్వంతర కాలాలలో జీవుల జన్యువులలో మార్పు కలిగి చివరికి అంతరించిపోవచ్చును. పురాణాల ప్రకారం, ఆఖరున వచ్చే భౌమ్య సావర్ణి కూడా అదే సూచిస్తోంది. 


ఇంచుమించు 250 మిలియన్ సంవత్సరాల తరువాత అన్ని ఖండాలూ కలిసి ఏక ఖండంగా ఏర్పడతాయని ఒక అంచనా. అలాగే, సూర్యుని ఉష్ణోగ్రత క్రమంగా పెరుగుతూ వుండటం వలన 300 - 800 మిలియన్ సంవత్సరాల (దాదాపుగా 3 మన్వంతరాల సమయం) తరువాత భూగ్రహం మీద జీవుల ఉనికి ప్రశ్నార్థకం. సూర్యుని శీతోష్ణ స్థితి పెరిగితే ఆ ప్రభావం వలన కలిగే విచ్ఛేదము కూడా పెరిగి, బొగ్గుపులుసు వాయు (నాకు తెలిసినంత వరకూ COని తెలుగులో అలాగే అంటారు) స్థాయిలు తగ్గి మొక్కలు కిరణ జన్య సంయోగ క్రియను (photosynthesis) చేసుకోలేవు. ఇలాగే సూర్యుని ఉష్ణోగ్రత పెరుగుతూ కొన్ని బిలియన్ సంవత్సాలకి అదొక గరిష్ట స్థాయికి చేరుకొని, అన్ని గ్రహాలనూ (లేదా మనం మొదట్లో చెప్పుకున్నట్టు స్వయం ప్రకాశిత గోళాలనన్నిటినీ) తనలో ఐక్యం చేసుకుని, కుదించుకునిపోయి, చిన్న మెరుపులా మారి, ప్రకాశ శక్తిని కోల్పోయి చీకటి స్థితికి చేరుకుంటుంది. ఈ క్రమంలోనే జీవులు అంతరించిపోయి, సముద్రాలు ఇంకిపోయి సృష్టి నశిస్తుంది. పురాణాల ప్రకారంగా ఈ సమయాన్నే ప్రళయ కాలం అని వుండవచ్చు.  



జైన మత గ్రంథాల ప్రకారం కొన్ని యుగాల సమూహం ఒక కల్పం. ప్రతీ యుగంలోనూ 12 అరములలో (వీటినే విభాగాలుగా పరిగణించవచ్చు) కాలచక్రం పైకి (6), క్రిందకి (6) కదులుతూ వుంటుంది. ఆ ప్రకారంగానే కాలచక్రం పైకి కదిలినప్పుడు ఆ యుగ భాగాన్ని ఉత్సర్పిణి అనీ, క్రిందకి కదిలినప్పుడు అపసర్పిణి అనీ అంటారు. యుగ ఆరంభంలోనూ మరియూ అంతంలోనూ వుండే భాగాన్ని దుషమ (దుఃఖానికి చిహ్నం) అనీ యుగ మధ్యలో వుండే భాగాన్ని సుషమ (ఆనందానికి చిహ్నం) అనీ అంటారు. అనగా ఒక యుగంలో చెడ్డవన్నీ మంచిగా మారి, ఆ మంచివన్నీ క్రమంగా అంతరిస్తూ చెడ్డగా మారిపోతాయి అనుకోవచ్చును. దీనినే మనం చెప్పుకున్న మన్వంతరాల కోణం నుండీ గమనిస్తే క్రమంగా సృష్టి ఏర్పడి, నశించడం అనుకోవచ్చు. వీటన్నిటి బట్టీ చూస్తే ఆయనెవరో అన్నట్టు మనం చెప్పుకునే బ్రహ్మ కాలం, విష్ణు కాలం, మొదలయినవి వేరే గ్రహాలకి చెందిన కాలాలు కావచ్చును. గ్రహాలన్నీ ఏర్పడి, కరిగిపోవడం అనేది ఆమోదించబడిన విషయమేగా! 

ఏమిటో, ఈ మధ్యన మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నాను కదూ! కాల చక్రంలో గడుస్తున్న కాలానికి వీడ్కోలు చెప్పి, క్రొత్త సంవత్సరాన్ని ఆహ్వానించే సమయం రానే వచ్చింది. పేరుకి తగ్గట్టుగా అందరికీ అన్నిటా జయం కలగాలని ఆశిస్తూ కాస్త ముందస్తుగా జయనామ నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. 


Monday, September 16, 2013

సాంబే పరబ్రహ్మణి


పరమేశ్వరుని నామ వైభవాలను స్మరిస్తూ, మనకు బాగా తెలిసిన ఎన్నో కథల ఆధారంగా శ్రీ శంకరాచార్యుల వారు రచించిన "దశ శ్లోక స్తుతి"కి ఒక వ్యాఖ్యాన ప్రయత్నం చేశాను. దానిని ప్రచురించిన మాలిక సంపాదక వర్గానికి ధన్యవాదాలు.   

Monday, February 04, 2013

తౌర్యత్రిక కళ


మానవుడు మనోహీనుడై జీవించలేడు. కనుక మానవునిగా మహోన్నత స్థితిని పొందాలన్నా, మానసిక ఆనందాన్ని పొందాలన్నా కళల సాన్నిహిత్యం తప్పనిసరి. తనంతట తాను ప్రకాశిస్తూ ఇతరులను సైతం ప్రకాశింపచేసేది కళ. "మనిషిలో మంచిని పెంచి, అమానుష లక్షణాలను త్రుంచి, పురుషోత్తమునిగా మలచుటకు, సర్వమానవ కళ్యాణానికీ, సాంస్కృతిక ఉన్నతికీ, దోహదపరచుటే కళకు ప్రయోజనం" అని ధర్మపురి కృష్ణమూర్తి గారు చెప్పారు. కళకు ఒక నిర్వచనం చెప్పటం అంత సులభం కాదు, ప్రకృతిలోని ప్రతీ దృశ్యమూ కళాత్మకమయినదే. "కళా సమన్వితమయిన జగత్తు సుందరమయినది, సుందరమయిన జగత్తు విశాలమైనది, విశాలమైన జగత్తు అనంత చైతన్యముతో విలసిల్లునది. ఈ బహుముఖ ప్రజ్ఞా తేజస్సు కళ వల్లనే ఆవిర్భవించుచున్నది" అని కళాశబ్దం ప్రస్తుతింపబడినది. మనకున్న 64 కళలలో, కొన్ని (చిత్రలేఖనం, సంగీతము, నృత్యము, నాటకము, మొ.) మాత్రమే ఇప్పుడు చెప్పుకున్న లక్షణాలను చూపిస్తాయి, వాటినే లలిత కళలు అంటారు. ఈ లలిత కళలనే జయదేవుడు గీత గోవిందంలో (మూడవ శ్లోకం) విలాస కళలుగా పేర్కొన్నాడు. వీటిల్లో ప్రథమ గణ్యమైనదీ, పరమోదాత్తమైనదీ, సర్వకాల సర్వావస్థలయందు మానవుని మనుగడతో పెనవేసుకొన్న అపూర్వ కళాసృష్టి, సర్వకళల సమాహార స్వరూపంగా చెప్పబడేదే తౌర్యత్రిక కళ.

సంగీత, సాహిత్య, నాట్య కళల సమాహార స్వరూపమయిన కళను తౌర్యత్రిక కళ అంటారు. ఇటువంటి తౌర్యత్రిక కళలలో ముఖ్యమయినది "హరికథ". సాధారణంగా గాయకుడు గానంలోనూ, సాహిత్యకారుడు సాహిత్యంలోనూ, నాట్యకారుడు నాట్యంలోనూ మాత్రమే తన ప్రతిభను చూపిస్తాడు. కానీ  తౌర్యత్రిక కళగా చెప్పబడుతున్న హరికథను చెప్పేవాడు మాత్రం అభినయ కళను కూడా జతచేసి ఈ మూడిటిలోనూ (సంగీత, సాహిత్య, నాట్యాలలో) ప్రతిభను చూపించాలి. హరికథలు వేదకాలం నుండీ ఉండేవి, అగ్నివేశాది మహర్షులు సృజించగా, బ్రహ్మమానస పుత్రుడైన నారదుడు భక్తి సూత్రాలను ఉపదేశిస్తూ నిత్యం హరికథా గానం చేస్తాడు. లవకుశలు ఇరువురూ హరికథా గానం చేసినట్టు రామాయణంలో కూడా ఉంది కదా! హరికథ దివ్యమయిన (దివిభవం దివ్యం - అనగా స్వర్గమున పుట్టినది అనే వ్యుత్పత్తి ఆధారంగా ఇది దివ్యం) కళ. "ఈ హరికథా ప్రక్రియ మహారాష్ట్రలో రెబ్బటిల్లి, తమిళ దేశంలో చిగిర్చి, ఆంధ్ర దేశంలో పూసి, కాసి, ఫలించింది" అని శ్రీ కడలి వీరదాసు గారు (హరికథా మహోత్సవ ప్రత్యేక సంచికలో) తెలియచేశారు.

యావదాంధ్ర వాఙ్మయములో బహుముఖ వైవిధ్యమును, వైశిష్ట్యమును కలిగిన విశాల సాహిత్య శాఖగానూ, సాహితీ ప్రక్రియలన్నింటిలోనూ పరమోత్కృష్టమైన శాఖగానూ పేరు ప్రఖ్యాతలు పొందిన యక్ష గానమే హరికథగా రూపాంతరము చెందినదని విజ్ఞుల అభిప్రాయము. హరికథా పితామహులుగా ప్రసిద్ధుడైన శ్రీ మదజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు గారు రచించిన ప్రహ్లాద చరిత్ర అను హరికథావతారికలో యక్షగానాలకు హరికథలకు అభేదం చెప్పారు. అయితే, ఈ రెంటికీ ప్రదర్శన విషయంలో కొంత భేదం కనిపించినా, అంగాలు, కీర్తనలూ, తత్వనలూ అన్నీ ఒకే విధంగా వుంటాయి. మరి రెంటికీ భేదం ఎక్కడుందంటే, యక్షగానంలో బహుపాత్రలను అనేకమంది నిర్వహిస్తే, హరికథలో ఒకే వ్యక్తి బహుపాత్రలను నిర్వహిస్తాడు. అందువలననే యక్షగానము కన్నా కూడా హరికథ ఉత్కృష్టమయినది. ముల్లోకాలనూ పునీతం చేసి, జాతిని తీర్చిదిద్ది, భారతీయ సంస్కృతికి నిజమైన దర్పణంగా నిలిచి, ఆబాల గోపాలాన్నీ ఆహ్లాదపరుస్తూ, అవ్యక్త మధురానుభూతిని ప్రసాదించే మహోన్నతమయిన కళ హరికథ. హరిని కీర్తించుటే హరికథ. "అనగా బ్రహ్మము అనగా వుండునది. బ్రహ్మమును కలిగి వుండి, వినుట ద్వారా బ్రహ్మమును పరిచయం చేసేదే  కథ" అని శ్రీ తంగిరాల సుబ్రహ్మణ్య శాస్త్రిగారు నిర్వచించారు. హరికథ చెప్పేవారిని కథకుడు అంటారు. భక్తి రస ప్రధాన పురాణ గాథలలో ఏదైనా ఒక అంశం తీసుకుని, గద్యములు, పద్యములు, గానము, హాస్యము, చతురత, సమయస్ఫూర్తి, మొదలైన వాటిని చొప్పించి శ్రోతలను ఆకట్టుకుంటూ ప్రవచించటమే హరికథ. 

భావంబొప్పవలెన్ ముఖాన నిసలౌ పాండిత్య మేతత్కళా
జీవంబై రససిద్ధి బొందవలె నౌచిత్యంబుపన్యాసవా
ణీవిన్యాసమునన్ ఘటిల్లవలెన్ దానేసర్వపాత్రంబులై
ప్రావీణ్యంబులన్ నటింపవలె విద్వాంసుడు సమ్యద్గతిన్   

అంటూ శ్రీ పెద్దింటి సూర్యనారాయణ దీక్షితదాసు గారు కథకుడు బహుపాత్రలను పోషిస్తూ కథకు రక్తినీ, తుష్టినీ చేకూర్చాలని చెప్పారు. కథకుడు సందర్భాన్ని బట్టే కాకుండా సభికులను బట్టి కూడా కథాగమనం కొనసాగించాలి. కనుక ముందుగా బాగా సాధన చేసి వెళ్లి హరికథ చెప్పేసి వచ్చేస్తే అది రక్తి కట్టదు. కథకుడు ఎప్పుడూ కూడా సభికులను ఆకట్టుకొనే విధంగా వ్యాకరణ పండితులున్న సభలో వ్యాకరణ పరిజ్ఞానాన్ని, సాహిత్యజ్ఞులున్న సభలో కవితా ప్రాభవాన్ని, సంగీతజ్ఞులున్న సభలో సంగీత ప్రజ్ఞను ప్రదర్శిస్తూ, పామరులు వున్న సభలో వారిని రంజింప చేసే విధంగా పిట్ట కథలు, ఉప కథలు, హాస్యం జోడిస్తూ మూల కథకు అడ్డు రాకుండా, ప్రచార విషయానికి భంగం కలిగించకుండా సభనంతటినీ ఆకట్టుకుంటూ చెప్పగలిగినవాడే తన లక్ష్యాన్ని సాధించి, ప్రజలలో తాననుకున్న మార్పును తీసుకువచ్చి, వారికి మార్గ దర్శకుడవుతాడు. ఇంకా సూటిగా చెప్పాలంటే హరికథకుడు నవరసాలూ పోషిస్తూ, అన్ని రసాలకూ ఏకాగ్రచిత్తుడై వుండాలి. ఇన్ని చేయాలి కనుకనే హరికథ కష్టమయినా కానీ అన్ని వర్గాల వారినీ అలరిస్తుంది.

మొదట భక్తి తత్వమే ప్రాణంగా హరికథలు ఆవిర్భవించాయి. అద్వైత సిద్ధి మొదలు ఆటవిక విశ్వాసం వరకు ఏ రకంగా ప్రదర్శింపబడినా అది భక్తిగానే పరిగణించారు. వీటి వలన ఆధ్యాత్మిక ప్రభోదం కూడా జరిగేది. ఇటువంటి హరికథల వలన కథకులు మోక్షసాధన కోసం సంగీత, సాహిత్య, నాట్యాలను ఆలంబనగా చేసుకుని, వైష్ణవాన్నీ, శైవాన్నీ సమానంగా భావించి, సామాజికుల చేత కూడా భావింపచేసి సర్వమత సామరస్యాన్ని చాటేవారు. కొంతకాలం ఇటువంటి హరికథలు కేవలం హిందువులకే పరిమితమయ్యి, హైందవ సంప్రదాయాన్ని ఎక్కువగా ప్రదర్శించడం వలన హైందవ మత ప్రచారానికే ఎక్కువగా దోహదం చేస్తూ వచ్చాయి. కాలం గడిచే కొద్దీ, ఇతర మతస్థులైన క్రైస్తవులను, మహమ్మదీయులను కూడా విశేషంగా ఆకర్షించింది. ప్రజల్లో ఏ విషయాన్ని ప్రచారం చేయాలన్నా (అప్పట్లో మరి ప్రచార సాధనాలు తక్కువ కదా!) హరికథా ప్రక్రియే సరైన, శక్తివంతమైన మార్గమని గుర్తించారు. వారి మత ప్రచారానికి ఆలంబనగా "హరి" శబ్దాన్ని అడ్డుగా భావించకుండా ఒక కథా కాలక్షేపంగా వారు ఏసు ప్రభువు జీవిత చరిత్రను, మహమ్మదీయుల చరిత్రలను కూడా కథా రూపాలుగా చేసుకుని వానిని హరికథలుగా మలచుకుని ప్రచార యోగ్యంగా కూర్చుకున్నారు. రాన్రాను కాలానుగుణంగా భగవత్సంబంధిత గాథలే కాక, దేశనాయకులు, క్విట్ ఇండియా, కుటుంబ నియంత్రణ, సమాజాన్ని పీడిస్తున్న అంశాలు, మొదలయినవెన్నో ఇతివృత్తాలుగా చేసుకుని హరికథలు చెప్పటం ప్రారంభించారు. ప్రజల నుండీ ఇటువంటి కథలకు మునుపటి వాటికంటే ఆదరణ, ప్రోత్సాహం ఎక్కువగా లభించాయి.

హరికథలు చెప్పటమే కాదు, వ్రాయటమూ ఒక కళే. శ్రీ రాంపల్లి శ్రీరామచంద్రమూర్తి గారు "కుమార సంభవము" ను, శ్రీ పెద్దింటి సూర్యనారాయణ దీక్షితులు గారు "అభిజ్ఞాన శాకుంతలం" ను, చక్రవర్తుల కృష్ణమాచార్యులు గారు "మాళవికాగ్ని మిత్రమ్" ను హరికథలుగా రచించారు. వీటి ప్రదర్శనల ద్వారా మన దేశానికే పరిమితమయిన హరికథలను విదేశీయులు సైతం అబ్బురపడేలా చేశారు మన హరికథకులు. శ్రీ అమ్ముల విశ్వనాధం గారు మలేషియాలో, శ్రీ వీరగంధం వెంకట సుబ్బారావు భాగవతార్ గారు అమెరికాలో, శ్రీ బోడావుల సీతారామయ్య భాగవతార్ గారు జర్మనీ, పారిస్, లండన్ వంటి దేశాలలో పలు ప్రదర్శనలిచ్చి, వాటి ద్వారా వారిలో భారతీయ సంస్కృతీ, సాంప్రదాయాల పట్ల అవగాహన ఏర్పరచడమే కాక, భారతీయ కళల పట్ల వారికి ఉన్నతమైన అభిప్రాయాన్ని కూడా కలిగించారు. ఇంతటి మహోన్నతమయిన హరికథకు పితామహులైన శ్రీ మదజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు గారి గురించి ఒక్క మాటలో (తాతారావు గారి పలుకుల్లో) చెప్పాలంటే: 

హరికథా ప్రక్రియకు ఆద్యుండు కవితలో
కాళిదాస పోతనలకు సాటి
ఆదిభట్ట బుధుడు అన్నిటన్ మొనగాడు
ఆట పాట మాట లందు మేటి
ఇంతటి అపూర్వమయిన కళ అంతరించిపోకుండా ఎంతో మంది నేర్చుకోవాలనే సదుద్దేశ్యంతో హరికథా శిక్షణకు ప్రత్యేకంగా ప్రప్రధమంగా 10-6-1973న కపిలేశ్వరపురం (రాజమహేంద్రవరానికి 36కిలోమీటర్ల దూరం), తూర్పు గోదావరి జిల్లాలో "హరికథా పాఠశాల"ను శ్రీ యస్.బి.పి.బి.కె.సత్యనారాయణ రావు (కపిలేశ్వరపురం జమీందారు)గారు స్థాపించి, ప్రధానాచార్యులుగా శ్రీ కడలి వీరదాసు (శ్రీ మదజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు గారి శిష్యుడు) గారిని నియమించారు. మన జాతి కళలు కాపాడుకోవలెనన్న ఆశయంతో ప్రభుత్వం వారు ఇక్కడ శిక్షణ పొందుతున్న విద్యార్ధులలో కొంతమందిని ఎంపిక చేసి స్కాలర్షిప్ కూడా ఇస్తారు. ఈ పాఠశాలలో అయిదు సంవత్సరాల శిక్షణాకాలం పూర్తయిన తరువాత పరీక్షలను నిర్వహించి, "హరికథా ప్రవీణ"  అను ధృవీకరణ పత్రాన్ని ఇచ్చి, వారిని ప్రదర్శనకు యోగ్యులుగా నిర్ణయిస్తుంది. ఈ సంస్థ నుండి తయారైన బాలబాలికలు తెలుగులో మాత్రమే గాక సంస్కృతంలో కూడా హరికథలు చెబుతూ ఎన్నో సత్కారాలు పొందారు. వారిలో ప్రముఖులు దాలిపర్తి ఉమామహేశ్వరి గారు. ఉజ్జయినిలో  కాళిదాస అకాడమీ వారు నిర్వహించే అంతర్జాతీయ సెమినార్ లో ఈవిడిచ్చిన ప్రదర్శనల ద్వారా హరికథా ప్రక్రియకు ఒక ప్రత్యేక స్థానం, గుర్తింపు లభించాయి.

మన రాష్ట్రంలో జానపద కళారూపాలుగా చెప్పబడుతున్న హరికథలు, బుఱ్ఱకథలు, మొదలైన వాటిని ప్రోత్సహించాలని తెలుగు విశ్వవిద్యాలయం వారు హరికథా రచనా పోటీలు, హరికథా ప్రవచనా పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ తెలుగు విశ్వవిద్యాలయానికి కులపతి గారైన ఆచార్య శ్రీ దోణప్ప గారు రచించిన "తెలుగు హరికథా సర్వస్వం" అనే పుస్తకాన్ని (హరికథకు సంబంధించిన ప్రతీ విషయాన్నీ పొందుపరుస్తూ) అత్యున్నత ప్రమాణాలతో తీర్చిదిద్దారు. డా. డి. శారద గారు రచించిన "హరికథా ప్రక్రియ - సామాజిక ప్రయోజనాలు" (ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండీ పి.హెచ్.డి. పొందిన గ్రంధం) అనే పరిశోధనా గ్రంధంలో హరికథల వలన దేశానికి జరిగే మేలు ఎలాంటిదో కూడా బాగా వివరించారు. ఈ రెండు పుస్తకాలనూ క్షుణ్ణంగా చదవటం వలన హరికథా ప్రక్రియల ప్రాచీన స్వరూపం నుండీ ఆధునిక స్వరూపం దాకా ప్రతీ విషయమూ వివరంగా తెలుస్తుంది.

కొన్ని చక్కని హరికథలను ఇక్కడ వినవచ్చును. పాత చలన చిత్రాలలో హరికథలు ఎక్కువగానే కని, వినిపించేవి కానీ ఈ మధ్యన వచ్చిన చిత్రాలలో దేవస్థానం అనే చలనచిత్రంలో చాలా కాలం తరువాత దండిభట్ల నారాయణమూర్తి గారు, స్వర వీణాపాణి గారు రచించిన హరికథలను (సామాజిక) వినిపించి మరచిపోతున్న హరికథా ప్రక్రియను గుర్తుచేశారు.

One must die as an artist to be reborn as a Yogi అన్న అరవిందుని సూక్తి కళాకారులకున్న ఔన్నత్యాన్ని చాటుతోంది. దీనిని ఎప్పుడూ జ్ఞప్తిలో వుంచుకుని, ఇటువంటి కళలను కాపాడుకుంటూ, తరువాతి తరాలకు పంచవలసిన (కనీసం పరిచయం చేయవలసిన) బాధ్యత మనందరి మీదా వుందని భావిస్తున్నాను. హరికథకు పూర్వ వైభవం దక్కాలని మనసారా కోరుకుంటూ...............

Monday, January 07, 2013

కుబేరుడు



నేను వ్రాసిన ఈ వ్యాసాన్ని ప్రచురించిన మాలిక సంపాదక వర్గానికి కృతజ్ఞతలతో…..

  

Monday, November 26, 2012

కాళిదాసు - మేఘ సందేశం


చిన్నప్పుడు మేఘ సందేశం సినిమా చూసి అదే కాళిదాసు వ్రాసినది అన్న అపోహలో ఉండేదానిని. తరువాత రెండూ వేరు వేరని, ఇదొక విరహ కావ్యం అని తెలిసింది. విరహం నాకెందుకో అంతగా నచ్చదు. కానీ కాళిదాసు విరహ కావ్యం చదివాక విరహంలో కూడా ఇంత అందం, ఆనందం ఉంటాయని తెలుసుకున్నాను. నవరసాలలో మొట్ట మొదటి స్థానం శృంగారానికే దక్కింది కనుక ముందుగా కాళిదాసు శృంగార రచనలని నాకు అర్థమయినంతలో పరిచయం చేస్తున్నాను. ఆ ప్రకారంగా అభిజ్ఞాన శాకుంతలం తరువాత స్థానం మేఘ సందేశానికి ఇచ్చాను. ఈ మేఘ సందేశం ఒక "ఖండ కావ్యం". ఖండ కావ్యం భవేద్కావ్యం ఏక దేశాను సారిచ అన్నారు. ఒక కథతో సంబంధం లేకుండా ఏదో ఒక భాగాన్ని లేదా ఘట్టాన్ని తీసుకుని వివరించడమే ఖండ కావ్య లక్షణం. ఈ మేఘ సందేశంలో పూర్వ మేఘం (63 శ్లోకాలు), ఉత్తర మేఘం (52 శ్లోకాలు) అని రెండే సర్గలు ఉన్నాయి.  
 
కాళిదాసు రచించిన కావ్యాలకి ఒక ప్రత్యేకత ఉంది. కాళిదాసు పుట్టుకతోనే పండితుడు కాదనీ, పెళ్ళయ్యాకే అమ్మవారి (కాళికా దేవి) అనుగ్రహం వలన పండితుడయ్యాడనీ అందరికీ తెలిసినదే. అయితే పెళ్ళయిన వెంటనే కాళిదాసు భార్య "వాగస్తి కశ్చిత్?" (వాక్కు ఏదన్నా నీకుందా?) అని అడుగుతుంది. ఈయన పండితుడయిన తరువాత, ఈ వాగస్తి కశ్చిత్ లో ఉన్న మూడు పదాలనీ (వాక్, అస్తి, కశ్చిత్) తీసుకునీ ఒక్కో పదంతో మొదలయ్యేట్టుగా ఒక్కో కావ్యాన్ని (వాక్కుతో మొదలుపెట్టిన మహా కావ్యం రఘువంశం, అస్తి తో మొదలుపెట్టిన మహా కావ్యం కుమార సంభవం మరియు కశ్చిత్ తో మొదలుపెట్టిన ఖండ కావ్యం మేఘ సందేశం) వ్రాశాడు. ఆ ప్రకారంగా ఇందులోని మొట్టమొదటి శ్లోకం:
కశ్చిత్కాంతావిరహగురుణా స్వాధికారాత్ప్రమత్తః
శాపేనాస్తంగమిత మహిమా వర్షభోగ్యేణ భర్తుః ।
యక్షశ్చక్రే  జనక తనయా స్నాన పుణ్యోదకేషు
స్నిగ్ధచ్ఛాయాతరుషు వసతిం రామగిర్యాశ్రమేషు ॥

అంటే తన విధులలో అశ్రద్ధ వహించటం వలన యజమాని ఆగ్రహానికి గురయ్యి, తన విధుల నుండి తొలగించబడి, తన శక్తులన్నీ కోల్పోయి, యేడాది కాలం కాంతా (భార్య) వియోగంతో గడపవలననే శాపాన్ని పొందిన యక్షుడు, జనకుని కూతురు అయినటువంటి సీతా దేవి స్నానం చేయటం వలన పవిత్రంగా మారిన నీరు కలిగినటువంటి, దట్టమయిన నీడనిచ్చే చెట్లు కలిగినటువంటి రామగిరి ఆశ్రమంలో ఉన్నాడు.

ఈ శ్లోకంతో నాయకుడయిన యక్షుని పరిచయం జరిగింది. దానికి రెండు విశేషణాలు వాడాడు. అవే స్వాధికారాత్ ప్రమత్తః, అస్తంగమిత మహిమ. దీని ఆధారంగా కాళిదాసు విధి నిర్వహణే ప్రధాన కర్తవ్యం అని చెప్తున్నాడు అనిపిస్తుంది. చేయవలసిన పని సరిగ్గా చేయకపోవటం వలన యక్షునికి కలిగిన అనర్థాలు ఉద్యోగం మరియు మహిమలు కోల్పోవటం, తద్వారా కాంతా వియోగం పొందటం. మనకి ధర్మార్థకామాలలో కూడా మొదటిది ధర్మ నిర్వహణే కదా! అది సరిగ్గా చేయకపోతే అన్నిటికీ దూరమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. అలాగే రామగిరి ఆశ్రమంలో ఉన్నాడు అని చెప్పాడు కానీ అదెక్కడుందో రెండు విశేషణాలతో చెప్పకనే చెప్పాడు. అవే జనక తనయా స్నాన పుణ్యోదకేషు అనగా సీతాదేవి స్నానం చేయటం వలన పవిత్రమయిన నీరు, స్నిగ్ధచ్ఛాయాతరుషు అనగా ఎక్కువగా నీడనిచ్చే చెట్లు. వీటి ఆధారంగా తెలిసేది ఏమిటంటే సీతాదేవి వనవాసం చేసిన చోటు అని. అదే చిత్రకూట పర్వతం. ఇటువంటి ఎన్నో రసవత్తరమయిన శ్లోకాలతో ఆద్యంతం ఆకట్టుకున్న అద్భుత కావ్యం మేఘ సందేశం.

అరణ్యంలో విరహంతో ఉన్న యక్షునికి (యక్షులు సాధారణంగా కాముకులు కనుక వారికి కాంతా వియోగం భరించలేనటువంటిది) మేఘుడు కనిపిస్తాడు. కనిపించిన వెంటనే ఏమీ ఆలోచించకుండా మేఘునితో అలకాపురి(యక్షుల నివాసం)లో ఉన్న తన భార్యకి సందేశాన్ని పంపాలి అనుకుంటాడు. శ్రీరాముడు సీతకి ఆంజనేయస్వామి ద్వారా, పాండవులు కౌరవులకి శ్రీ కృష్ణుని ద్వారా, నలోపాఖ్యానంలో దమయంతికి హంస ద్వారా, సందేశాలు పంపటం జరిగాయి. కానీ ఇక్కడ యక్షుడు - పొగ, వెలుతురు, నీరు, గాలి కలిసినటువంటి మేఘంతో (ప్రాణం లేని దానితో) సందేశం పంపబోతున్నాడు. ఆ మాత్రం కూడా కాళిదాసుకి తెలియదు అని జనం భావించకుండానే, కామార్తులకు (కామముతో ఉన్న వాడికి) అంత ఆలోచన ఎక్కడిది? అని తన కావ్యౌచిత్యాన్ని సమర్ధించుకున్నాడు (పూర్వ మేఘం, నాల్గవ శ్లోకంలో).

పూర్వ మేఘంలో మేఘానికి మార్గ నిర్దేశం చేస్తాడు. ఆ ప్రకారంగా, చిత్రకూట పర్వతం (ప్రస్తుతం దీనిని మధ్యప్రదేశ్ లోని రామ్ గఢ్ అంటారు) మీద బయలుదేరిన మేఘం, మాల పర్వతం (ప్రస్తుతం దీనిని ఛత్తీస్ గఢ్ అంటారు) మీదుగా ఆమ్రకూట పర్వతం (నర్మదా లేదా రేవా నదీ జన్మస్థానం) వెళ్ళి, అక్కడనుండీ దశార్ణ దేశ (మాళవ దేశ పూర్వ భాగాన్ని దశార్ణ దేశం అంటారు) రాజధాని అయినటువంటి విదిశా (ప్రస్తుతం దీనిని భిలాసా అంటారు) నగరానికి వెళ్ళి వేత్రవతీ (వింధ్య పర్వతాలకి ఉత్తర భాగంలో ఉద్భవించిన ఈ నదిని ప్రస్తుతం "బేత్ వా" అని పిలుస్తారు) నది అందాలని ఆస్వాదిస్తూ, కొంచెం చుట్టు తిరుగు అయినా ఉజ్జయిని (మాళవ దేశ రాజధాని. దీనినే అవంతి అని కూడా అంటారు) వెళ్ళి తప్పనిసరిగా (కాళిదాసుకి ఆ ఊరి మీదా, శివుని మీదా ఉన్న మమకారంతో ఇది చేర్చాడు అనిపిస్తుంది) ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటయిన మహాకాలుని దర్శనం (సాయంకాల సమయంలో) చేసుకుని, శిప్రా (ఉజ్జయినిలో ప్రవహించే నది) నదికి ఉపనదులయిన గంధవతి, గంభీర నదుల వద్ద సేద తీరి, దేవగిరి (ప్రస్తుతం దీనిని దౌలతాబాద్ అంటారు) పర్వతం వద్ద నివాసముండే శరవణభవుడయిన కుమారస్వామిని దర్శించుకుని, అక్కడ ప్రవహించే చర్మణ్వతి (వింధ్య పర్వతాలకి వాయువ్య దిశలో ఉద్భవించిన ఈ నదిని ప్రస్తుతం "చంబల్" అని పిలుస్తారు) నదిని దాటుకుంటూ, దశపురం (రంతిదేవుని రాజధాని నగరం), బ్రహ్మావర్తం (సరస్వతీ, దృషద్వతీ నదుల మధ్యన ఉన్న ప్రదేశం), కురుక్షేత్రం (మహా భారత యుద్ధం జరిగిన చోటు), కనఖలం (హరిద్వార్ వద్ద ఉన్న క్షేత్రం, ఇక్కడ గంగానది ప్రవహిస్తుంది), హిమవత్పర్వతం మీదుగా కైలాసం చేరాక, ఆ ప్రక్కనే ఉన్న అలకానగరం (మా అనగా యక్షుల నివాసం) వెళ్ళాలి.

ఉత్తర మేఘంలో అలకానగారాన్ని వివరించి, తన ఇంటికి దారి చెప్పి, తన భార్య గుర్తులు చెప్పి, వారిరువురికి (యక్షునికీ, తన భార్యకీ) మాత్రమే తెలిసిన కొన్ని సంగతులను చెప్పి (యక్షుని భార్యకి ఈ మేఘుడు నిజంగా యక్షుడు పంపిన వాడే అని నమ్మకం కలిగించటం కోసం), తన గురించి బాధ పడవద్దనీ, తాను త్వరగా వచ్చేస్తానని చెప్పమని మేఘుడిని రకరకాలుగా పొగిడి (తన పని జరగడం కోసం) మరీ పంపిస్తాడు. తీరా చూస్తే, మేఘం ఆ అలకానగరం వెళ్ళేసరికి యక్షుడే తన సంవత్సర కాలం పూర్తి చేసుకుని తన భార్యను చేరుకుంటాడు.

నాయకులు నాలుగు రకాలు. వారినే చతుర్విధ నాయకులు అంటారు. ధీరోదాత్తుడు (వీరత్వం అధికంగా ఉండి ఆవేశం లేకుండా ఆలోచన కలవాడు ఉదా: శ్రీ రాముడు), ధీరోద్ధతుడు (వీరత్వం ఎక్కువగా ఉండి ఆలోచన ఏ మాత్రం లేనివాడు ఉదా: భీముడు), ధీర లలితుడు (వీరత్వం, లాలిత్యం సమపాళ్ళలో కలిసిన ప్రేమ స్వరూపుడు ఉదా: శ్రీ కృష్ణుడు), ధీర శాంతుడు (శాంతాన్ని అధికంగా కలిగిన వీరుడు ఉదా: గౌతమ బుద్ధుడు). కాళిదాసు తన రచనలలో నాయకుడిని ఎప్పుడూ ధీరోదాత్తునిగానే మలుచుకుంటాడు. శాకుంతలంలో అదే జరిగి అభిజ్ఞాన శాకుంతలం అయ్యింది కదా! ఈ మేఘ సందేశంలో కూడా నాయకుడైన యక్షుని ధీరోదాత్తునిగానే చూపాడు (పూర్వ మేఘం, మూడవ శ్లోకంలో).

శృంగార నాయికలు ఎనిమిది రకాలు. వారినే అష్టవిధ శృంగార నాయికలు అంటారు. వారిలో నలుగురిని ఎన్నుకుని, ఒక్కొక్కరిగా ఈ కావ్యంలో పూర్వమేఘంలో పరిచయం చేశాడు కాళిదాసు. 

త్వా మారూఢం పవనపదవీ ముద్గృహీతాలకాన్తాః
ప్రేక్షిష్యన్తే పథికవనితాః ప్రత్యయాదాశ్వ సన్త్యః ।
కః సన్నద్ధే విరహవిధురా త్వయ్యుపేక్షేత జాయాం
న స్యాదన్యోఽప్యహమివ జనోయః పరాధీనవృత్తిః ॥
అంటూ ముందుగా పథికవనితాః అనగా ప్రోషిత భర్తృక లేదా ప్రోషిత పతిక గురించి చెప్పాడు. భర్త దూరంగా (పని మీద ఎక్కడికైనా వెళ్ళినా, దేశాంతరం వెళ్ళినా) ఉన్నప్పుడు తన గురించి ఆలోచిస్తూ విరహంతో ఉండే స్త్రీని ప్రోషిత భర్తృక అంటారు. మేఘుడు కామ ప్రకోపన చేసేవాడు. అసలే విరహంతో ఉండే స్త్రీలు నీ (మేఘుని) రాకతో, తమ భర్తతో కలవాలన్న కోరిక పెరిగి, భర్త కూడా అదే కాంక్షతో వస్తాడు అన్న ఆశతో తమ ఫాల భాగం మీద పడుతున్న ముంగురులను పైకి ఎత్తి నిన్ను చూస్తారు. అటువంటి స్త్రీని విడిచి అశక్తుడు, అస్వతంత్రుడు, పరాధీనుడు అయిన మగవాడు తప్ప మరెవ్వరూ ఉండలేరు అంటాడు. ప్రస్తుతం యక్షుని పరిస్థితి అదే కనుక ఆమెకు దూరంగా ఉన్నందుకు చింతిస్తూ మేఘుని వెళ్ళి తన క్షేమ సమాచారం తెలియ చేయమంటాడు. దీనికి సమర్ధింపుగా ఉత్తర మేఘంలో 21, 22, 23, 24, 25 శ్లోకాలలో యక్షుని భార్యలో ఉన్న ప్రోషిత భర్తృక లక్షణాలన్నీ విశదీకరిస్తాడు. నాకెందుకో కాళిదాసుకి ఈ ప్రోషిత భర్తృక అంటే ప్రత్యేక అభిమానం అనిపిస్తుంది. అభిజ్ఞాన శాకుంతలంలో కూడా శకుంతలని ప్రోషిత భర్తృక (దూర్వాస మహాముని శాపానికి కారణమయినప్పుడు) గానే చూపిస్తాడు.  

గచ్ఛన్తీనాం రమణవసతిం యోషితాం తత్రనక్తం
రుద్ధాలోకే నరపతి పథే సూచి భేద్యై, స్తమోభిః ।
సౌదామన్యా, కనక నికషస్నిగ్ధయా దర్శయోర్వీం
తోయోత్సర్గస్తనితముఖరో మాస్మభూర్విక్లవాస్తాః ॥

అంటూ రమణవసతిం గచ్ఛన్తీనాం అనగా అభిసారిక గురించి చెప్పాడు. అందంగా అలంకరించుకుని, ప్రియుని వద్దకు తాను వెళ్ళే స్త్రీని అభిసారిక అంటారు. ఉజ్జయనిలోని స్త్రీలను వర్ణిస్తూ చెప్పిన ఈ శ్లోకంలో అక్కడి అభిసారికలు (స్త్రీలు) రాత్రిపూట ప్రియుని ఆవాసానికి బయలుదేరతారు కనుక ఆ సమయంలో నువ్వు (మేఘుడు) మెఱుపులతో దారి చూపు కానీ ఉరుముతూ వాన పడి వారిని భయపెట్టకు. వారసలే మిక్కిలి భయస్తులు అని మేఘుడిని హెచ్చరిస్తూ స్త్రీలతో సున్నితత్వం వహించాలని చెప్తాడు. పూర్వ మేఘంలో ఉజ్జయినిలోని (కాళిదాసు నివాస స్థలం) అభిసారికలు ప్రియుని వద్దకు వెళ్ళేటప్పుడు ఎలా ఉంటారో చెప్పిన కాళిదాసు ఉత్తర మేఘంలో (తొమ్మిదవ శ్లోకంలో) అలకాపురిలోని (యక్షుని నివాస స్థలం) అభిసారికలు తమ ప్రియుని వద్ద నుండీ వచ్చేటప్పుడు ఎలా ఉంటారో వివరిస్తాడు. దీని ద్వారా కాళిదాసు పురుషుల ఏక పత్నీత్వం, స్త్రీల పాతివ్రత్యం ఇష్టాధీనమే కానీ కృత్రిమం కాదు అని చెప్తున్నాడనిపిస్తుంది. మన నాయకుడయిన యక్షుడు ఏకపత్నీ వ్రతుడు, ముందుగా చెప్పుకున్నట్టు ధీరోదాత్తుడు కాకపోతే తన భార్యకి మేఘుడిని బ్రతిమాలుకుని మరీ సందేశం పంపవలసిన అవసరం లేదు కదా! అలా మన నాయకుని ధీరోదాత్త లక్షణం మళ్ళీ చూపాడు.

తస్మిన్కాలే నయన సలిలం యోషితాం ఖణ్డితానాం
శాన్తిం నేయం ప్రణయిభిరతో వర్త్మభానోస్త్య జాశు ।
ప్రాలేయాస్రం కమలవదనాత్సోఽపి హర్తుం నలిన్యాః
ప్రత్యావృత్తస్త్వయి కరరుధి స్యాదనల్ఫాభ్యసూయః ॥

అంటూ ఖణ్డితానాం అనగా ఖండిత నాయిక గురించి చెప్పాడు. రాత్రంతా పర స్త్రీతో గడిపి, తెల్లవారిన తరువాత రతి చిహ్నాలతో ఇంటికి వచ్చిన భర్తని చూచి దుఃఖించే స్త్రీని ఖండిత అంటారు. ఆ సమయంలో అనగా సూర్యోదయ సమయంలో ఇంటికి తిరిగి వచ్చిన భర్తలు తమ భార్యల కన్నీరు తుడుస్తారు. ఈ శ్లోకంలో పద్మం అనే ఖండిత స్త్రీ ముఖము నుండీ కారే మంచు అనే కన్నీటిని తొలగించే భర్త (లేదా ప్రియుడు) సూర్యుడు అని వర్ణించాడు. అటువంటి సూర్యునికి నువ్వు (మేఘుడు) అడ్డు రాకుండా, తన కిరణాలు అనే చేతులతో మంచు అనే కన్నీటిని తుడవనివ్వు, ప్రేయసీ ప్రియుల మధ్యలో నువ్వెందుకు? అడ్డు తొలగు అంటూ హితోపదేశం చేస్తున్నాడు.

తస్యోత్సఙ్గే ప్రణయిన ఇవస్రస్త గఙ్గాదుకూలాం
న త్వం దృష్ట్వా న పునరలకాం జ్ఞాస్యసే కామచారిన్ ।
యావః కాలే వహతి సలిలోద్గారముచ్చైర్విమానా
ముక్తాజాలగ్రథిత మలకం కామినీ వాభ్ర బృన్దమ్ ॥

ఈ శ్లోకంలో స్వాధీన పతిక లేదా స్వాధీన భర్తృక అనే నాయికను ప్రతిబింబిస్తున్నాడు. ఇందులో కైలాస పర్వతాన్ని నాయకుని(ధీర లలితుడు)గా, అలకా నగరాన్ని నాయిక(స్వాధీన పతిక)గా భావించి వర్ణిస్తున్నాడు కవి. స్వాధీన పతికలోని ప్రేమకి, సుగుణాలకి పూర్తిగా వశమయిన ప్రియుడు ఆమెను అనునిత్యం లాలిస్తూ ఉంటాడుట. అలిగిన ప్రేయసిని లాలించే ప్రియుడు ఆమెను తన తొడపై పడుకో పెట్టుకుంటే ఆ స్త్రీ రూపం ఎలా ఉంటుందో, కైలాస పర్వతంపై ఉన్న అలకా నగరం అలా ఉందని కవి భావన! అక్కడ ఆకాశంలో జాలువారే గంగానది ఈ ప్రియురాలు (అలకానగరం) కట్టుకున్న తెల్ల పట్టు చీరలా ఉందిట!

"ఉపమా కాళిదాసస్య, అర్ధాంతరన్యాసోపి విధీయతే" అంటారు. ఈ కావ్యంలో నాకు నచ్చినవి చాలా ఉన్నా, మిక్కిలి ఆకర్షించిన కొన్ని ఉపమానాలు:
ఆమ్రకూట పర్వతాన్నీ, అక్కడ ప్రవహించే రేవా నదినీ వర్ణిస్తూ ఏనుగు ఆకారంలో ఉన్న పర్వతానికి, పాయలు పాయలుగా ప్రవహిస్తున్న నది ఆ ఏనుగు పెట్టుకున్న విభూది రేఖల వలె ఉన్నది అంటాడు.
మార్గ మధ్యలో కనిపించిన "నిర్వింధ్య" నదిని ఒక స్త్రీగా, మేఘాన్ని తన ప్రియునిగా భావిస్తూ, నదిలో వచ్చే సుడులను ఆ స్త్రీ యొక్క నాభిగా అభివర్ణించడం.
చర్మణ్వతీ నదిని ఆకాశం నుండీ చూస్తే భూదేవి మెడలో ధరించిన ఒంటి పేట ముత్యాల హారంలా కనిపిస్తోంది, ఆ నీటి కోసం నువ్వు (మేఘుడు) వంగితే ఆ ముత్యాల హారం మధ్యలో ఉన్న ఇంద్ర నీలమణిలా ఉంటావు అంటాడు.

ఇటువంటి ఎన్నో అద్భుతమయిన ఉపమానాలతో మనోజ్ఞ సీమకి తీసుకెళ్ళాడు కాళిదాసు. చదువుతున్నంత సేపూ ఆ ప్రదేశాలన్నీ అక్కడే ఉండి చూసినట్టు అనిపిస్తుంది. ఇందులో వ్రాసిన ప్రతీ శ్లోకాన్నీ ఒక చిత్రంగా గీయచ్చు. భావకులు ఆ పారవశ్యం నుండీ తేరుకుని బయటకి రావటం చాలా కష్టం. ఏమి ఉపమానాలు! ఏమి విశేషణాలు! ఎన్ని అలంకారాలు! ఆహా! ఒక మహాద్భుతం చూసిన అనుభూతి దక్కింది. విరహం, తన్మయత్వం, భక్తి, ప్రేమ, అనురాగం, శృంగారం, ప్రకృతి వర్ణనలూ, సందేశాలూ అన్నిటినీ సమపాళ్ళల్లో పండించినటువంటి మేఘ సందేశం ఒక చక్కని కావ్యం అనడంలో అతిశయోక్తి లేదు.