Monday, November 26, 2012

కాళిదాసు - మేఘ సందేశం


చిన్నప్పుడు మేఘ సందేశం సినిమా చూసి అదే కాళిదాసు వ్రాసినది అన్న అపోహలో ఉండేదానిని. తరువాత రెండూ వేరు వేరని, ఇదొక విరహ కావ్యం అని తెలిసింది. విరహం నాకెందుకో అంతగా నచ్చదు. కానీ కాళిదాసు విరహ కావ్యం చదివాక విరహంలో కూడా ఇంత అందం, ఆనందం ఉంటాయని తెలుసుకున్నాను. నవరసాలలో మొట్ట మొదటి స్థానం శృంగారానికే దక్కింది కనుక ముందుగా కాళిదాసు శృంగార రచనలని నాకు అర్థమయినంతలో పరిచయం చేస్తున్నాను. ఆ ప్రకారంగా అభిజ్ఞాన శాకుంతలం తరువాత స్థానం మేఘ సందేశానికి ఇచ్చాను. ఈ మేఘ సందేశం ఒక "ఖండ కావ్యం". ఖండ కావ్యం భవేద్కావ్యం ఏక దేశాను సారిచ అన్నారు. ఒక కథతో సంబంధం లేకుండా ఏదో ఒక భాగాన్ని లేదా ఘట్టాన్ని తీసుకుని వివరించడమే ఖండ కావ్య లక్షణం. ఈ మేఘ సందేశంలో పూర్వ మేఘం (63 శ్లోకాలు), ఉత్తర మేఘం (52 శ్లోకాలు) అని రెండే సర్గలు ఉన్నాయి.  
 
కాళిదాసు రచించిన కావ్యాలకి ఒక ప్రత్యేకత ఉంది. కాళిదాసు పుట్టుకతోనే పండితుడు కాదనీ, పెళ్ళయ్యాకే అమ్మవారి (కాళికా దేవి) అనుగ్రహం వలన పండితుడయ్యాడనీ అందరికీ తెలిసినదే. అయితే పెళ్ళయిన వెంటనే కాళిదాసు భార్య "వాగస్తి కశ్చిత్?" (వాక్కు ఏదన్నా నీకుందా?) అని అడుగుతుంది. ఈయన పండితుడయిన తరువాత, ఈ వాగస్తి కశ్చిత్ లో ఉన్న మూడు పదాలనీ (వాక్, అస్తి, కశ్చిత్) తీసుకునీ ఒక్కో పదంతో మొదలయ్యేట్టుగా ఒక్కో కావ్యాన్ని (వాక్కుతో మొదలుపెట్టిన మహా కావ్యం రఘువంశం, అస్తి తో మొదలుపెట్టిన మహా కావ్యం కుమార సంభవం మరియు కశ్చిత్ తో మొదలుపెట్టిన ఖండ కావ్యం మేఘ సందేశం) వ్రాశాడు. ఆ ప్రకారంగా ఇందులోని మొట్టమొదటి శ్లోకం:
కశ్చిత్కాంతావిరహగురుణా స్వాధికారాత్ప్రమత్తః
శాపేనాస్తంగమిత మహిమా వర్షభోగ్యేణ భర్తుః ।
యక్షశ్చక్రే  జనక తనయా స్నాన పుణ్యోదకేషు
స్నిగ్ధచ్ఛాయాతరుషు వసతిం రామగిర్యాశ్రమేషు ॥

అంటే తన విధులలో అశ్రద్ధ వహించటం వలన యజమాని ఆగ్రహానికి గురయ్యి, తన విధుల నుండి తొలగించబడి, తన శక్తులన్నీ కోల్పోయి, యేడాది కాలం కాంతా (భార్య) వియోగంతో గడపవలననే శాపాన్ని పొందిన యక్షుడు, జనకుని కూతురు అయినటువంటి సీతా దేవి స్నానం చేయటం వలన పవిత్రంగా మారిన నీరు కలిగినటువంటి, దట్టమయిన నీడనిచ్చే చెట్లు కలిగినటువంటి రామగిరి ఆశ్రమంలో ఉన్నాడు.

ఈ శ్లోకంతో నాయకుడయిన యక్షుని పరిచయం జరిగింది. దానికి రెండు విశేషణాలు వాడాడు. అవే స్వాధికారాత్ ప్రమత్తః, అస్తంగమిత మహిమ. దీని ఆధారంగా కాళిదాసు విధి నిర్వహణే ప్రధాన కర్తవ్యం అని చెప్తున్నాడు అనిపిస్తుంది. చేయవలసిన పని సరిగ్గా చేయకపోవటం వలన యక్షునికి కలిగిన అనర్థాలు ఉద్యోగం మరియు మహిమలు కోల్పోవటం, తద్వారా కాంతా వియోగం పొందటం. మనకి ధర్మార్థకామాలలో కూడా మొదటిది ధర్మ నిర్వహణే కదా! అది సరిగ్గా చేయకపోతే అన్నిటికీ దూరమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. అలాగే రామగిరి ఆశ్రమంలో ఉన్నాడు అని చెప్పాడు కానీ అదెక్కడుందో రెండు విశేషణాలతో చెప్పకనే చెప్పాడు. అవే జనక తనయా స్నాన పుణ్యోదకేషు అనగా సీతాదేవి స్నానం చేయటం వలన పవిత్రమయిన నీరు, స్నిగ్ధచ్ఛాయాతరుషు అనగా ఎక్కువగా నీడనిచ్చే చెట్లు. వీటి ఆధారంగా తెలిసేది ఏమిటంటే సీతాదేవి వనవాసం చేసిన చోటు అని. అదే చిత్రకూట పర్వతం. ఇటువంటి ఎన్నో రసవత్తరమయిన శ్లోకాలతో ఆద్యంతం ఆకట్టుకున్న అద్భుత కావ్యం మేఘ సందేశం.

అరణ్యంలో విరహంతో ఉన్న యక్షునికి (యక్షులు సాధారణంగా కాముకులు కనుక వారికి కాంతా వియోగం భరించలేనటువంటిది) మేఘుడు కనిపిస్తాడు. కనిపించిన వెంటనే ఏమీ ఆలోచించకుండా మేఘునితో అలకాపురి(యక్షుల నివాసం)లో ఉన్న తన భార్యకి సందేశాన్ని పంపాలి అనుకుంటాడు. శ్రీరాముడు సీతకి ఆంజనేయస్వామి ద్వారా, పాండవులు కౌరవులకి శ్రీ కృష్ణుని ద్వారా, నలోపాఖ్యానంలో దమయంతికి హంస ద్వారా, సందేశాలు పంపటం జరిగాయి. కానీ ఇక్కడ యక్షుడు - పొగ, వెలుతురు, నీరు, గాలి కలిసినటువంటి మేఘంతో (ప్రాణం లేని దానితో) సందేశం పంపబోతున్నాడు. ఆ మాత్రం కూడా కాళిదాసుకి తెలియదు అని జనం భావించకుండానే, కామార్తులకు (కామముతో ఉన్న వాడికి) అంత ఆలోచన ఎక్కడిది? అని తన కావ్యౌచిత్యాన్ని సమర్ధించుకున్నాడు (పూర్వ మేఘం, నాల్గవ శ్లోకంలో).

పూర్వ మేఘంలో మేఘానికి మార్గ నిర్దేశం చేస్తాడు. ఆ ప్రకారంగా, చిత్రకూట పర్వతం (ప్రస్తుతం దీనిని మధ్యప్రదేశ్ లోని రామ్ గఢ్ అంటారు) మీద బయలుదేరిన మేఘం, మాల పర్వతం (ప్రస్తుతం దీనిని ఛత్తీస్ గఢ్ అంటారు) మీదుగా ఆమ్రకూట పర్వతం (నర్మదా లేదా రేవా నదీ జన్మస్థానం) వెళ్ళి, అక్కడనుండీ దశార్ణ దేశ (మాళవ దేశ పూర్వ భాగాన్ని దశార్ణ దేశం అంటారు) రాజధాని అయినటువంటి విదిశా (ప్రస్తుతం దీనిని భిలాసా అంటారు) నగరానికి వెళ్ళి వేత్రవతీ (వింధ్య పర్వతాలకి ఉత్తర భాగంలో ఉద్భవించిన ఈ నదిని ప్రస్తుతం "బేత్ వా" అని పిలుస్తారు) నది అందాలని ఆస్వాదిస్తూ, కొంచెం చుట్టు తిరుగు అయినా ఉజ్జయిని (మాళవ దేశ రాజధాని. దీనినే అవంతి అని కూడా అంటారు) వెళ్ళి తప్పనిసరిగా (కాళిదాసుకి ఆ ఊరి మీదా, శివుని మీదా ఉన్న మమకారంతో ఇది చేర్చాడు అనిపిస్తుంది) ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటయిన మహాకాలుని దర్శనం (సాయంకాల సమయంలో) చేసుకుని, శిప్రా (ఉజ్జయినిలో ప్రవహించే నది) నదికి ఉపనదులయిన గంధవతి, గంభీర నదుల వద్ద సేద తీరి, దేవగిరి (ప్రస్తుతం దీనిని దౌలతాబాద్ అంటారు) పర్వతం వద్ద నివాసముండే శరవణభవుడయిన కుమారస్వామిని దర్శించుకుని, అక్కడ ప్రవహించే చర్మణ్వతి (వింధ్య పర్వతాలకి వాయువ్య దిశలో ఉద్భవించిన ఈ నదిని ప్రస్తుతం "చంబల్" అని పిలుస్తారు) నదిని దాటుకుంటూ, దశపురం (రంతిదేవుని రాజధాని నగరం), బ్రహ్మావర్తం (సరస్వతీ, దృషద్వతీ నదుల మధ్యన ఉన్న ప్రదేశం), కురుక్షేత్రం (మహా భారత యుద్ధం జరిగిన చోటు), కనఖలం (హరిద్వార్ వద్ద ఉన్న క్షేత్రం, ఇక్కడ గంగానది ప్రవహిస్తుంది), హిమవత్పర్వతం మీదుగా కైలాసం చేరాక, ఆ ప్రక్కనే ఉన్న అలకానగరం (మా అనగా యక్షుల నివాసం) వెళ్ళాలి.

ఉత్తర మేఘంలో అలకానగారాన్ని వివరించి, తన ఇంటికి దారి చెప్పి, తన భార్య గుర్తులు చెప్పి, వారిరువురికి (యక్షునికీ, తన భార్యకీ) మాత్రమే తెలిసిన కొన్ని సంగతులను చెప్పి (యక్షుని భార్యకి ఈ మేఘుడు నిజంగా యక్షుడు పంపిన వాడే అని నమ్మకం కలిగించటం కోసం), తన గురించి బాధ పడవద్దనీ, తాను త్వరగా వచ్చేస్తానని చెప్పమని మేఘుడిని రకరకాలుగా పొగిడి (తన పని జరగడం కోసం) మరీ పంపిస్తాడు. తీరా చూస్తే, మేఘం ఆ అలకానగరం వెళ్ళేసరికి యక్షుడే తన సంవత్సర కాలం పూర్తి చేసుకుని తన భార్యను చేరుకుంటాడు.

నాయకులు నాలుగు రకాలు. వారినే చతుర్విధ నాయకులు అంటారు. ధీరోదాత్తుడు (వీరత్వం అధికంగా ఉండి ఆవేశం లేకుండా ఆలోచన కలవాడు ఉదా: శ్రీ రాముడు), ధీరోద్ధతుడు (వీరత్వం ఎక్కువగా ఉండి ఆలోచన ఏ మాత్రం లేనివాడు ఉదా: భీముడు), ధీర లలితుడు (వీరత్వం, లాలిత్యం సమపాళ్ళలో కలిసిన ప్రేమ స్వరూపుడు ఉదా: శ్రీ కృష్ణుడు), ధీర శాంతుడు (శాంతాన్ని అధికంగా కలిగిన వీరుడు ఉదా: గౌతమ బుద్ధుడు). కాళిదాసు తన రచనలలో నాయకుడిని ఎప్పుడూ ధీరోదాత్తునిగానే మలుచుకుంటాడు. శాకుంతలంలో అదే జరిగి అభిజ్ఞాన శాకుంతలం అయ్యింది కదా! ఈ మేఘ సందేశంలో కూడా నాయకుడైన యక్షుని ధీరోదాత్తునిగానే చూపాడు (పూర్వ మేఘం, మూడవ శ్లోకంలో).

శృంగార నాయికలు ఎనిమిది రకాలు. వారినే అష్టవిధ శృంగార నాయికలు అంటారు. వారిలో నలుగురిని ఎన్నుకుని, ఒక్కొక్కరిగా ఈ కావ్యంలో పూర్వమేఘంలో పరిచయం చేశాడు కాళిదాసు. 

త్వా మారూఢం పవనపదవీ ముద్గృహీతాలకాన్తాః
ప్రేక్షిష్యన్తే పథికవనితాః ప్రత్యయాదాశ్వ సన్త్యః ।
కః సన్నద్ధే విరహవిధురా త్వయ్యుపేక్షేత జాయాం
న స్యాదన్యోఽప్యహమివ జనోయః పరాధీనవృత్తిః ॥
అంటూ ముందుగా పథికవనితాః అనగా ప్రోషిత భర్తృక లేదా ప్రోషిత పతిక గురించి చెప్పాడు. భర్త దూరంగా (పని మీద ఎక్కడికైనా వెళ్ళినా, దేశాంతరం వెళ్ళినా) ఉన్నప్పుడు తన గురించి ఆలోచిస్తూ విరహంతో ఉండే స్త్రీని ప్రోషిత భర్తృక అంటారు. మేఘుడు కామ ప్రకోపన చేసేవాడు. అసలే విరహంతో ఉండే స్త్రీలు నీ (మేఘుని) రాకతో, తమ భర్తతో కలవాలన్న కోరిక పెరిగి, భర్త కూడా అదే కాంక్షతో వస్తాడు అన్న ఆశతో తమ ఫాల భాగం మీద పడుతున్న ముంగురులను పైకి ఎత్తి నిన్ను చూస్తారు. అటువంటి స్త్రీని విడిచి అశక్తుడు, అస్వతంత్రుడు, పరాధీనుడు అయిన మగవాడు తప్ప మరెవ్వరూ ఉండలేరు అంటాడు. ప్రస్తుతం యక్షుని పరిస్థితి అదే కనుక ఆమెకు దూరంగా ఉన్నందుకు చింతిస్తూ మేఘుని వెళ్ళి తన క్షేమ సమాచారం తెలియ చేయమంటాడు. దీనికి సమర్ధింపుగా ఉత్తర మేఘంలో 21, 22, 23, 24, 25 శ్లోకాలలో యక్షుని భార్యలో ఉన్న ప్రోషిత భర్తృక లక్షణాలన్నీ విశదీకరిస్తాడు. నాకెందుకో కాళిదాసుకి ఈ ప్రోషిత భర్తృక అంటే ప్రత్యేక అభిమానం అనిపిస్తుంది. అభిజ్ఞాన శాకుంతలంలో కూడా శకుంతలని ప్రోషిత భర్తృక (దూర్వాస మహాముని శాపానికి కారణమయినప్పుడు) గానే చూపిస్తాడు.  

గచ్ఛన్తీనాం రమణవసతిం యోషితాం తత్రనక్తం
రుద్ధాలోకే నరపతి పథే సూచి భేద్యై, స్తమోభిః ।
సౌదామన్యా, కనక నికషస్నిగ్ధయా దర్శయోర్వీం
తోయోత్సర్గస్తనితముఖరో మాస్మభూర్విక్లవాస్తాః ॥

అంటూ రమణవసతిం గచ్ఛన్తీనాం అనగా అభిసారిక గురించి చెప్పాడు. అందంగా అలంకరించుకుని, ప్రియుని వద్దకు తాను వెళ్ళే స్త్రీని అభిసారిక అంటారు. ఉజ్జయనిలోని స్త్రీలను వర్ణిస్తూ చెప్పిన ఈ శ్లోకంలో అక్కడి అభిసారికలు (స్త్రీలు) రాత్రిపూట ప్రియుని ఆవాసానికి బయలుదేరతారు కనుక ఆ సమయంలో నువ్వు (మేఘుడు) మెఱుపులతో దారి చూపు కానీ ఉరుముతూ వాన పడి వారిని భయపెట్టకు. వారసలే మిక్కిలి భయస్తులు అని మేఘుడిని హెచ్చరిస్తూ స్త్రీలతో సున్నితత్వం వహించాలని చెప్తాడు. పూర్వ మేఘంలో ఉజ్జయినిలోని (కాళిదాసు నివాస స్థలం) అభిసారికలు ప్రియుని వద్దకు వెళ్ళేటప్పుడు ఎలా ఉంటారో చెప్పిన కాళిదాసు ఉత్తర మేఘంలో (తొమ్మిదవ శ్లోకంలో) అలకాపురిలోని (యక్షుని నివాస స్థలం) అభిసారికలు తమ ప్రియుని వద్ద నుండీ వచ్చేటప్పుడు ఎలా ఉంటారో వివరిస్తాడు. దీని ద్వారా కాళిదాసు పురుషుల ఏక పత్నీత్వం, స్త్రీల పాతివ్రత్యం ఇష్టాధీనమే కానీ కృత్రిమం కాదు అని చెప్తున్నాడనిపిస్తుంది. మన నాయకుడయిన యక్షుడు ఏకపత్నీ వ్రతుడు, ముందుగా చెప్పుకున్నట్టు ధీరోదాత్తుడు కాకపోతే తన భార్యకి మేఘుడిని బ్రతిమాలుకుని మరీ సందేశం పంపవలసిన అవసరం లేదు కదా! అలా మన నాయకుని ధీరోదాత్త లక్షణం మళ్ళీ చూపాడు.

తస్మిన్కాలే నయన సలిలం యోషితాం ఖణ్డితానాం
శాన్తిం నేయం ప్రణయిభిరతో వర్త్మభానోస్త్య జాశు ।
ప్రాలేయాస్రం కమలవదనాత్సోఽపి హర్తుం నలిన్యాః
ప్రత్యావృత్తస్త్వయి కరరుధి స్యాదనల్ఫాభ్యసూయః ॥

అంటూ ఖణ్డితానాం అనగా ఖండిత నాయిక గురించి చెప్పాడు. రాత్రంతా పర స్త్రీతో గడిపి, తెల్లవారిన తరువాత రతి చిహ్నాలతో ఇంటికి వచ్చిన భర్తని చూచి దుఃఖించే స్త్రీని ఖండిత అంటారు. ఆ సమయంలో అనగా సూర్యోదయ సమయంలో ఇంటికి తిరిగి వచ్చిన భర్తలు తమ భార్యల కన్నీరు తుడుస్తారు. ఈ శ్లోకంలో పద్మం అనే ఖండిత స్త్రీ ముఖము నుండీ కారే మంచు అనే కన్నీటిని తొలగించే భర్త (లేదా ప్రియుడు) సూర్యుడు అని వర్ణించాడు. అటువంటి సూర్యునికి నువ్వు (మేఘుడు) అడ్డు రాకుండా, తన కిరణాలు అనే చేతులతో మంచు అనే కన్నీటిని తుడవనివ్వు, ప్రేయసీ ప్రియుల మధ్యలో నువ్వెందుకు? అడ్డు తొలగు అంటూ హితోపదేశం చేస్తున్నాడు.

తస్యోత్సఙ్గే ప్రణయిన ఇవస్రస్త గఙ్గాదుకూలాం
న త్వం దృష్ట్వా న పునరలకాం జ్ఞాస్యసే కామచారిన్ ।
యావః కాలే వహతి సలిలోద్గారముచ్చైర్విమానా
ముక్తాజాలగ్రథిత మలకం కామినీ వాభ్ర బృన్దమ్ ॥

ఈ శ్లోకంలో స్వాధీన పతిక లేదా స్వాధీన భర్తృక అనే నాయికను ప్రతిబింబిస్తున్నాడు. ఇందులో కైలాస పర్వతాన్ని నాయకుని(ధీర లలితుడు)గా, అలకా నగరాన్ని నాయిక(స్వాధీన పతిక)గా భావించి వర్ణిస్తున్నాడు కవి. స్వాధీన పతికలోని ప్రేమకి, సుగుణాలకి పూర్తిగా వశమయిన ప్రియుడు ఆమెను అనునిత్యం లాలిస్తూ ఉంటాడుట. అలిగిన ప్రేయసిని లాలించే ప్రియుడు ఆమెను తన తొడపై పడుకో పెట్టుకుంటే ఆ స్త్రీ రూపం ఎలా ఉంటుందో, కైలాస పర్వతంపై ఉన్న అలకా నగరం అలా ఉందని కవి భావన! అక్కడ ఆకాశంలో జాలువారే గంగానది ఈ ప్రియురాలు (అలకానగరం) కట్టుకున్న తెల్ల పట్టు చీరలా ఉందిట!

"ఉపమా కాళిదాసస్య, అర్ధాంతరన్యాసోపి విధీయతే" అంటారు. ఈ కావ్యంలో నాకు నచ్చినవి చాలా ఉన్నా, మిక్కిలి ఆకర్షించిన కొన్ని ఉపమానాలు:
ఆమ్రకూట పర్వతాన్నీ, అక్కడ ప్రవహించే రేవా నదినీ వర్ణిస్తూ ఏనుగు ఆకారంలో ఉన్న పర్వతానికి, పాయలు పాయలుగా ప్రవహిస్తున్న నది ఆ ఏనుగు పెట్టుకున్న విభూది రేఖల వలె ఉన్నది అంటాడు.
మార్గ మధ్యలో కనిపించిన "నిర్వింధ్య" నదిని ఒక స్త్రీగా, మేఘాన్ని తన ప్రియునిగా భావిస్తూ, నదిలో వచ్చే సుడులను ఆ స్త్రీ యొక్క నాభిగా అభివర్ణించడం.
చర్మణ్వతీ నదిని ఆకాశం నుండీ చూస్తే భూదేవి మెడలో ధరించిన ఒంటి పేట ముత్యాల హారంలా కనిపిస్తోంది, ఆ నీటి కోసం నువ్వు (మేఘుడు) వంగితే ఆ ముత్యాల హారం మధ్యలో ఉన్న ఇంద్ర నీలమణిలా ఉంటావు అంటాడు.

ఇటువంటి ఎన్నో అద్భుతమయిన ఉపమానాలతో మనోజ్ఞ సీమకి తీసుకెళ్ళాడు కాళిదాసు. చదువుతున్నంత సేపూ ఆ ప్రదేశాలన్నీ అక్కడే ఉండి చూసినట్టు అనిపిస్తుంది. ఇందులో వ్రాసిన ప్రతీ శ్లోకాన్నీ ఒక చిత్రంగా గీయచ్చు. భావకులు ఆ పారవశ్యం నుండీ తేరుకుని బయటకి రావటం చాలా కష్టం. ఏమి ఉపమానాలు! ఏమి విశేషణాలు! ఎన్ని అలంకారాలు! ఆహా! ఒక మహాద్భుతం చూసిన అనుభూతి దక్కింది. విరహం, తన్మయత్వం, భక్తి, ప్రేమ, అనురాగం, శృంగారం, ప్రకృతి వర్ణనలూ, సందేశాలూ అన్నిటినీ సమపాళ్ళల్లో పండించినటువంటి మేఘ సందేశం ఒక చక్కని కావ్యం అనడంలో అతిశయోక్తి లేదు.  

42 comments:

ధాత్రి said...

అద్భుతంగా రాసారు..శ్లోకాలను ఎంత బాగా విశదీకరించారో..

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी said...

రసజ్ఞ గారు,
మీ చక్కటి సమీక్ష చదివి ఎంతో ఆహ్లాదం కలుగుతున్నది.
ఒక చిన్న విషయం.
ఈసందేశం చేరేలోపల శాపసమయం అయిపోవడం కాదు.

ఈ మేఘుని సందేశం విని యక్ష పత్ని ఊరట జెందుతుంది.
తర్వాత
శ్రుత్వా వార్తాం జలదకథితాం తాం ధనేశోఽపి సద్యః
శాపస్యాన్తం సదయహృదయః సన్నిధాయాస్తకోపః
సంయోజ్యైతౌ విగళితచౌ దమ్పతీ హృష్టచిత్తౌ
భోగానిష్టానభిమతసుఖాన్ ప్రాపయామాస భూయః
అని చివరి శ్లోకము.
ఈ విలక్షణమైన సందేశాన్ని విన్న యక్షుల రాజు కుబేరునికి తెలిసి దయతో శాపాన్ని అంతం చేసి దంపతులను ఏకం చేస్తాడు.
ఇంక మీరు కాళిదాసు రచనల్లో విరహిణుల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడం బాగుంది.
ఈ మేఘసందేశం లో భౌగౌళిక వర్ణన కూడా చాలా ప్రసిద్ధి పొందినది.

భారతి said...

అత్యద్భుతం అన్నది చిన్నపదం. చక్కటి విశ్లేషణలతో మేఘసందేశాన్ని ఓ దృశ్యకావ్యంలా కళ్ళ ముందు ఉంచావమ్మా.

Dantuluri Kishore Varma said...

చాలా కాలానికి రాశారు. అద్భుతమైన పరిచయం. హ్యాట్సాఫ్ టు యూ రసజ్ఞగారు.

ఫోటాన్ said...

చాలా బాగా రాసారు.. ఏమీ తెలియని నాలాంటి వాడికి కుడా అర్థం అయ్యే విధంగా :)
హాట్స్ ఆఫ్ టు యు రసజ్న గారు!

భాస్కర్ కె said...

ఏం రాశారండి,..నాకు సంస్కృతం రాదే ,.ఏం చేయను,....

Unknown said...

చిన్నప్పుడు తెలుగు, సంస్కృతం మాస్టార్లు శ్లోకాలూ, కథా, అర్ధాలూ వివరిస్తున్న రోజులు గుర్తొచ్చాయి. ఇప్పుడు మళ్ళీ క్లాస్ లో కూర్చుని వింటున్న ఫీలింగ్ కలిగింది ఇది చదువుతుంటే.
మేఘ మార్గ నిర్దేశాలలో ప్రదేశాల అప్పటి, ఇప్పటి పేర్లతో, నాయకులూ నాయికల వివరణలతో మీరు రాసిన ఈ విశ్లేషణ మహాకవి కాళిదాసు కావ్యం చదివి వడపోసినట్టుగా ఉంది.
ఎవరైనా మీరన్నట్టు ఇందులో ప్రతి శ్లోకాన్నీ చిత్రం తో ఈ మహాకావ్యాన్ని చిత్రకావ్యంగా మలిస్తే చూడాలనుంది. అష్ట నాయికలను బాపుగారిప్పటికే చాలా చిత్రాల్లో గీశారు. ఆ చిత్రాలను ఈ పోస్ట్ కి చేరిస్తే మరింత నిండుదనం వచ్చేదేమో!
Anyway,
Hats off to you రసజ్ఞ గారూ!

వనజ తాతినేని/VanajaTatineni said...

Wonder full post RasaGna . Ilaa meeru maatrame vraaya galaru. Thank you very much.

vamkasannam said...

విరహము కూడా సుఖమేకాదా!
విరహపు చింతన మధురము కాదా!!
వియోగ వేళల విరిసే ప్రేమల విలువను కనలేవా?

నీ కోసమె నే జీవించునది, ఈ విరహములో ఈ నిరాశాలో :)

హరే కృష్ణ said...

రసజ్ఞ గారు చాలా చాలా రోజులకి అద్భుతంగా రాసారు
మరింత తరచుగా రాయాలని కోరుకుంటూ

Krishna said...

మేఘ సందేశం గురించి బాగా రాసారు! ఈ కావ్యం లో కాశ్మీరం /హిమాలయాలను గురించి అద్భుతమైన వర్ణనలు ఉని అని వినాను..వీలు ఉంటె పరిచయం చేయగలరు!

రసజ్ఞ said...

@ ధాత్రి గారూ
మీకు నచ్చినందుకు ధన్యవాదాలండీ!

@ లక్ష్మీదేవి గారూ
ముందుగా మీ మెచ్చుకోలుకు ధన్యవాదాలు!
ఉత్తర భాగంలో వచ్చే ఈ చివరి శ్లోకం రెండు రకాలుగా ఉందండీ! http://www.vedabhoomi.org/MeghaSandesha.html (మల్లినాథ సూరి గారి సంస్కృత వ్యాఖ్యానం ఆడియో) ఆధారంగా మరియు మల్లినాథ సూరి గారి సంస్కృత వ్యాఖ్యానంతో ఉన్న వావిళ్ళ వారి పుస్తకం ఆధారంగా ఆఖరి శ్లోకం ఏతత్కృత్వా. ఆ శ్లోకం ద్వారా ఏమి తెలుస్తుంది అంటే, నీలాంటి గొప్పవాడు చేయవలసిన పని ఇది కాకపోయినా, నా మీద అనుగ్రహంతో అయినా నువ్వు (మేఘుడు) చేస్తావు అన్న నమ్మకం నాకుంది, నీకు మాత్రం ఇటువంటి విరహ వేదన ఎన్నడూ కలగకూడదు అంటూ ముగించేస్తాడు. మరి కొన్ని పుస్తకాలలో, ఈ శ్లోకం తరువాత తత్సందేశం శ్లోకము, మీరు చెప్పిన శ్లోకము చేర్చి ముగింపు ఉంది. ఇవన్నీ ప్రక్కన పెడితే, యక్షుని శాప కాలం యేడాది అని మొదటి శ్లోకంలోనే చెప్పాడు కాళిదాసు. తరువాత కొన్ని నెలల తరువాత మేఘం కనిపించింది, ఇది ఖచ్చితంగా ఆషాఢ మేఘం అన్నాడు. అనగా యక్షుడు మేఘాన్ని చూసి దూతగా పంపాలి అనుకున్నది ఆషాఢ శుద్ధ పాడ్యమి నాడు. మరి ఉత్తర మేఘంలో కార్తీక శుద్ధ ఏకాదశి తన శాపాన్తమనీ, మిగిలిన నాలుగు నెలలూ కళ్ళు మూసుకుని గడిపేస్తాననీ అన్నాడు. ఈ ప్రకారంగా చూసుకుంటే యక్షుని శాపారంభం కార్తీక శుద్ధ పౌర్ణమి అనుకోవాలి. దీనిని బట్టీ, యక్షుడు ఎనిమిది నెలల పాటు వియోగం అనుభవించాక, సందేశం పంపుతున్నాడు. ఇంకా మిగిలినవి నాలుగు నెలలే కదా! మేఘుడు సంవత్సరం ఎక్కడ చలించినా ఈ ఆషాఢ శుద్ధ పాడ్యమి నాటికి చిత్రకూట పర్వతం చేరుకుంటాడు, తనకి (మేఘుడికి) తిరిగి అక్కడకి రావటానికి సంవత్సర కాలం పడుతుంది అని కూడా చెప్పనే చెప్పాడు. తను చెప్పిన ప్రతీ చోటా విహరిస్తూ, చెప్పినవన్నీ ఆస్వాదిస్తూ, తను చెప్పినంత సేపు ప్రతీ చోటా ఆగిపోతే ఆ నాలుగు నెలల కాలం సరిపోదు కదా! అందువలననే కాళిదాసు నువ్వు వెళ్తావు అని చెప్పేసి ముగించేసాడు అనిపిస్తుంది. అసలు ప్రతిలో మరి ఎన్ని ఉన్నాయో నాకు కూడా తెలియదు కానీ, మల్లినాథ సూరి వారి సంస్కృత వ్యాఖ్యానం ఆధారంగా ఇలా సస్పెన్సులో పెట్టి ముగించేసాడు కాళిదాసు. అసలు ముగింపు శ్లోకం ఏమిటి అన్నది ఇప్పటికీ ఖచ్చితమైన నిర్ణయం లేదు! ఎవరైనా విజ్ఞులు అసలు ప్రతిలో ఏముందో చెప్తే తప్ప తెలియదు. మీ చక్కని వ్యాఖ్యకి మరొక్కసారి కృతజ్ఞతలు!

రసజ్ఞ said...

@ అమ్మా
నాకు చేతనయినంతలో వ్రాశాను. మీకు నచ్చినందుకు సంతోషంగా ఉంది. ధన్యవాదాలు!

@ కిశోర్ వర్మ గారూ
ఈ మధ్యన అస్సలు కుదరటం లేదండీ, అందుకే వ్రాయలేకపోతున్నాను :( మీకు నచ్చినందుకు కృతజ్ఞతలండీ!

@ హర్ష గారూ
అర్థమయ్యేలా వ్రాయగలిగినందుకు సంతోషంగా ఉందండీ :) మీకు నచ్చింది, అదే చాలు. ధన్యవాదాలండీ!

@ భాస్కర్ గారూ
అంటే ఏమి వ్రాశానో అర్థం కాలేదా :(:( యమర్జెంటుగా నేర్చేసుకోండి :) అప్పుడు బాగా ఆస్వాదించగలరు :) ధన్యవాదాలండీ!

రసజ్ఞ said...

@ చిన్ని ఆశ గారూ
మరీ కాచి వడపోయలేదు కానీ, నాకు అర్థమయినంతలో వ్రాశాను. మీకు నచ్చినందుకు ధన్యవాదాలండీ!
చిత్రకావ్యంగా ఎవరైనా దాకా ఎందుకు? మీరే ఎందుకు శ్రీ కారం చుట్టకూడదు? ఈ వర్నలలు ఊహల్లో ఎంత అందంగా ఉంటాయో, మీరు కూడా అంతే అందంగా చిత్రాలుగా మలచండి. బాపు గారు గీసిన అష్టనాయికల చిత్రాలు, కాళిదాసు వర్ణించిన నాయికలకు సరిపోవని నా అభిప్రాయం. కాళిదాసు నాయికలను ప్రకృతి ద్వారా చూపించాడు తప్ప నాయికగా చూపించలేదు. ఆయన ఇచ్చిన వర్ణనలకి తగ్గ చిత్రాలు లేవనే చెప్పాలి, అందుకనే పెట్టలేదు.

@ వనజ గారూ
మీకు నా మీద ఉన్న ప్రేమతో అలా అంటున్నారే కానీ మహా మహులున్నారు మన బ్లాగుల్లో. వారిలో నేనెంత? ఇప్పుడిప్పుడే అక్షరాలూ నేర్చుకుంటున్నదానిని. నెనర్లండీ!

@ vamkasannam గారూ
ఈ కావ్యానికి బహు చక్కగా సరిపోయే పాట! కాళిదాసు కూడా అదే చెప్పాడు, విరహంలో ప్రేమ మరింత పెరుగుతుంది అని. ధన్యవాదాలు!

@ హరే కృష్ణ గారూ
ఈ వచ్చే నెల ఎలాగో సెలవలేగా, మీ కోరిక ప్రకారం తప్పకుండా తరచుగా వ్రాస్తానండీ :) ధన్యవాదాలండీ!

రసజ్ఞ said...

@ కృష్ణ గారూ
అవునండీ, నిజమే! హిమాలయాల సొగసులు, మందాకినీ జలాల జల్లులతో మైమరచిపోవలసినదే! అంత హృద్యంగా వ్రాశారు. దీని కోసం ఒక ప్రత్యేక టపా వ్రాయలేను కానీ, మీ కోసం నాకు నచ్చినవి కొన్ని
హిమవత్పర్వతాల మీద శివుడు తాండవం (నృత్యం) చేస్తుంటే, కిన్నెర స్త్రీలు గానం చేస్తున్నారుట. అక్కడి వృక్షాలలో వెదురుపై పక్షులు, తుమ్మెదలు రంధ్రాలు చేస్తే అందులో గాలి చేరటం వలన సహజమైన వేణునాదం కూడా ఉందిట. లేనిది ఏమిటయ్యా అంటే, మృదంగం కనుక మేఘుడిని ఉఱుములు ఉరిమి ఆ మృదంగ లోటు తీర్చి ప్రక్క వాయిద్యం కూర్చమంటాడు.అలానే పార్వతీ పరమేశ్వరులకి మేఘుడిని మెట్లగా మారి సేవించుకోమంటాడు.
హిమవత్పర్వతం వద్ద చూడదగిన ప్రాంతం పరశురాముని కీర్తికి పతాకమైన క్రౌంచ పర్వత బిలం (రంధ్రం) అంటాడు.
వెండి పర్వతమైన ఆ హిమవత్పర్వతం దేవతా స్త్రీలు చూసుకునే అద్దమని కవి ఉత్ప్రేక్ష! అక్కడ ఉండే ఎత్తైన శిఖరాలు తెల్ల కలువల వలె ఉన్నాయి, కైలాస పర్వత సానువుల బంధాలు రావణాసురుడు పెకలిమ్చడం వలన కదిలాయంటాడు. మేఘుడు (మెత్తగా నూరిన కాటుకతో పోలుస్తాడు) హిమాలయ కొండ చరియ వద్ద ఉన్నప్పుడు ఏనుగు లాంటి నీకు (మేఘుడికి), ఆ తెల్లని కొండ చరియ ఏనుగు దంతంగా ఉందంటాడు.
ధన్యవాదాలండీ!

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी said...

రసజ్ఞ గారు,
ఇంత శ్రద్ధతో స్పందించినందుకు కృతజ్ఞతలు.
నేను చదివింది కోసూరు వేంకట నరసింహరాజు గారు వ్యాఖ్యానించిన ఒక ముద్రిత ప్రతి మాత్రమే.
ఖచ్చితంగా మీరు నాకన్నా ఎక్కువ చదవగలరని, మరింత పరిశోధించి మాత్రమే వ్రాస్తారని తెలిసిఉన్నా చపల చిత్తం కొద్దీ నాకు తెలిసిన విషయాన్ని మీతో పంచుకోవాలని నా మొదటి వ్యాఖ్య వ్రాసినాను.
ధన్యవాదాలు రసజ్ఞ గారూ! ఉంటాను మఱి.
తర్వాత ఏ కావ్యాన్ని పరిచయం చేయబోతున్నారో అని ఆసక్తి గా వేచి చూసే మీ అభిమాని.

thanooj said...

aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa naa tharvatha sanskrit baaga vachchina vallani mimmalne choosthunna .hahahaha yeah seriously no kidding.


chaala rojula tarvaatha meeru thrigi rasinanduku thanks andee.

జలతారు వెన్నెల said...

Rasagna, as always I would say highly informative post for me. It took me a while to read the entire post and read it again to understand it better. I guess you are one of the blessed souls to be able to write so well.

Anonymous said...

ఏంటీ విరహం నచ్చదా?!!! ప్చ్!

కాళిదాసే స్వయంగా తన కావ్యానికి అర్థతాత్పర్యాలను వివరించినంత చక్కగా రాశారు.

పన్లో పనిగా తెగ కుళ్ళుకుని తన సంస్కృత పుస్తకాల దుమ్ము దులపటానికి ప్రయత్నిస్తున్న అచంగ!

కొత్తావకాయ said...

మంచి పరిచయం రసజ్ఞ గారూ. కొండను అద్దంలో చూపించారు. బావుంది.

"విరహం నాకెందుకో అంతగా నచ్చదు. కానీ కాళిదాసు విరహ కావ్యం చదివాక విరహంలో కూడా ఇంత అందం, ఆనందం ఉంటాయని తెలుసుకున్నాను."

విరహంలో ఆనందం ఉండదండీ. కాళిదాస కావ్యాలు ఇప్పుడే చదివేయడం మీరు చేస్తున్న మంచిపని అని చెప్పక తప్పదు. ఇప్పుడు రుచి చూసారు కనుక కొన్నేళ్ళయ్యాక చదివితే సంపూర్ణంగా ఆస్వాదించగలరు. అప్పుడు మీరు టపా రాస్తే ఇలా అయితే ఉండదు. కాళిదాసు మహిమ కాదది. :)

Kottapali said...

విరహాన్ని స్వయంగా అనుభవించడంలో ఆనందం ఉండదు కానీ కావ్యాల్లో ఆస్వాదించడానికి బాగుంటుంది.

Anonymous said...

మీ పోస్ట్లన్నీ డిఫరెంట్గా ఉంటాయి నాకు చాలా చాలా నచ్చుతాయి
కాళిదాసు లాంటి వాళ్ళ గురిన్చి రాస్తే కామెంట్లు పెద్దగా రావు వేరే ఏమైనా ట్రై చేయండి ఇది నా సజెషన్ ;)

madhavarao.pabbaraju said...

శ్రీ రసజ్న గారికి, నమస్కారములు.

టూకీగా మేఘ సందేశం గురించి తెలుసుకానీ, ఇంత విశ్లేషణతో కథను వినలేదు. రామాయణంలో జియోగ్రఫీ గురించి చెప్పినట్లే, మేఘ సందేశంలోకూడా కవి ఆ మేఘం ప్రయాణం చేస్తున్న దారిలో కనిపించేవాటిని చదువరులకు పరిచయం చేయటం ఒక గొప్ప విశేషం. చాలా బాగా వ్రాశారు.

ఇకపోతే, మీ మైల్ ఐ.డి. నాకు తెలియదు కాబట్టి, ఈ నా స్పందనలోనే ఒక request మీకు పంపుతున్నాను. ఈ రోజే నేను ఒక టపా వ్రాశాను: `శ్రీ శంకరాచార్యులవారి ప్రశ్నోత్తరీ మణిరత్నమాల' లోని ఒక ఏడు శ్లోకాలలోని కొన్ని చరణాలపై నా అభిప్రాయాలతో కూడిన చిన్న వ్యాసం:- (స్త్రీపిశాచమా!?) దీనిని మీరు చదివి మీ అమూల్యమైన అభిప్రాయాల్ని తెలియచేయగలరు.
మీ స్నేహశీలి,
మాధవరావు.

నా బ్లాగ్ లింక్:
http://madhavaraopabbaraju.wordpress.com/

Anonymous said...

మీ రచన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
కాళిదాసు వేశ్యాలోలుడని విన్నాను, దీని మీద మీ అభిప్రాయం ఏమిటి?


శాస్త్రి

Satya said...

ఇటువంటి సబ్జెక్ట్స్ మీద పెద్దగ ఆసక్తి లేని నా బోటి వాళ్ళ చేత కూడా పరుగులు పెట్టి చదివించేలా ఉంటుంది మీ శైలి..పొగిడేస్తున్నాను అనుకోకుంటే, మీ లాంటి వాళ్ళు బ్లాగ్స్ వ్రాయటం నిజంగా అదృష్టం గా భావిస్తా. information and inspiration.. రెండూ ఒకేసారి ఇస్తారు మీ పోస్ట్స్ తో..

Krishna said...

నేను కూడా మేఘసందేశం పుస్తకం ఈ మధ్యే కొన్ననండి..తెలుగు దే..మీ స్ఫూర్తి తో చదవాలి ఇంకా...
చాల సంతోషం ...హిమాలయాలు..గంగ నది వర్ణన కూడా రాసినందుకు...

vamkasannam said...

నూతన సంవత్సర శుభాకాంక్షలు
మీలాటివారు పండగపూటా కనపడకపోతే ఎలాగండీ?

thanooj said...

issu appy nuu ear.

రసజ్ఞ said...

@ లక్ష్మీదేవి గారూ
అయ్యయ్యో భలేవారే! ఎంతమాట! మీ అభిమానం సంపాదించినందుకు మహదానందంగా ఉంది. మరొక కాళిదాసు రచన ఈ మధ్యనే మొదలుపెట్టానండీ చదవటం. పూర్తి చేసిన వెంటనే మీ ముందుకి తెస్తాను. ధన్యవాదాలు!

@ తనూజ్ గారూ
హహహ ఆచార్యదేవోభవ :)
ఇది వ్రాయడానికి మాత్రం ముఖ్య కారణం మీరే అని చెప్పాలి. మీరు అన్ని సార్లు అడిగేసరికి వెంటనే వ్రాసేశాను. మీకు కూడా నూతన సంవత్సర (ఆంగ్ల) శుభాకాంక్షలు!

@ జలతారువెన్నెల గారూ
మీ అందరి ఆశీర్వాద బలమే నన్ను ముందుకి నడిపిస్తోందండీ! కృతజ్ఞతలు!

రసజ్ఞ said...

@ అరుణ్ గారూ
వావ్! మీ నుండీ ఇటువంటి వ్యాఖ్య అందుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మునగ చెట్టు ఎక్కేసి కూర్చున్నాను :)
"ఏంటీ విరహం నచ్చదా?!!! ప్చ్!" అవునండీ నాకు నిజంగానే నచ్చదు. విరహంలో ఉండే వాళ్ళని చూసీ చూసీ ఏర్పడిన అయిష్టం అనమాట! ఈ క్రొత్త సంవత్సరంలో దుమ్ముని పూర్తిగా దులిపేసి చదవటం ప్రారంభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ........... కృతజ్ఞతలు!

@ కొత్తావకాయ గారూ
ముందుగా మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలండీ! విరహంలో ఆనందం అనటం వెనుక కొన్ని కారణాలున్నాయి.
మనిషి ఏ మానసిక స్థితిలో ఉంటే ప్రపంచం అంతా కూడా అదే స్థితిలో కనపడుతుంది, చూస్తాడు అంటారు కదా! ఇక్కడ విరహం, బాధ కలిసిన మానసిక స్థితిలో ఉన్న యక్షుడు (కాళిదాసు) మాత్రం ఎన్ని ప్రకృతి వర్ణనలూ, ప్రాంత ప్రాముఖ్యతలనూ తెలియ చేస్తున్నా కూడా ఎక్కడా తన స్థితిని ప్రతిబింబించలేదు. అదే కాక, విరహానంతరం తన భార్యని కలిసినప్పుడు కలిగే ఆనందాన్నీ, వారి మధ్య పెరిగే సాన్నిహిత్యాన్ని తలుచుకుంటూ వారి మధ్యన ప్రేమ మరింత పెరుగుతుంది అని ఊహించుకుంటూ ఆ ఆనంద పారవశ్యాన్ని కలగలిపి శృంగారాన్ని చూపించాడు. విరహాన్ని ప్రేయసీ (యక్షుని భార్య), ప్రియులకి (యక్షునికి) మాత్రమే పరిమితం చేసి, మిగతా వర్ణన, ఉపమానాలు, మొ. వాటితో చదివేవాళ్ళకి మాత్రం ఆనందాన్నే ఎక్కువగా పంచాడు.

ఒక కావ్యంలో ఒక్కొక్కరు ఒక్కొక్కటి చూస్తారు, ఒక్కోలా అర్థమవుతుంది. అందువలననే కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలానికి సుమారు ముప్ఫైమంది మహావిద్వాంసుల ప్రామాణికవ్యాఖ్యలు, డెబ్భైకి పైగా తెలుగు అనువాదాలు, ఏడెనిమిది పద్యానువాదాలు, నూటికి పైచిలుకు ప్రత్యేక సమీక్షాగ్రంథాలు (ఏల్చూరి వారి వ్యాఖ్య ఆధారంగా) వెలువడ్డాయి. నేను ముందుగానే చెప్పినట్టు.. ఇవన్నీ నాకు అర్థమయినట్టు పరిచయం చేస్తున్నాను. మీరు చెప్పినట్టుగా విరహ విషయంలో నాకు స్వీయానుభవం లేదు. నాకు ఆ అనుభవం ఉండి ఉంటే, నా వ్యక్తిగత అనుభవ ప్రభావం ఈ కావ్యం మీద ఎక్కువగా ఉండటంవలన - చదివి, అర్థం చేసుకునేటప్పుడు రచయిత భావాన్ని నా అనుభవం ఆధిపత్యం చేసే అవకాశం ఉంటుంది. దాని నుండీ తప్పించుకోవడానికే అన్నీ ఇప్పుడే చదివేసి, నా అభిప్రాయాలని ఇప్పుడే వ్రాసుకుంటున్నాను. "కొన్నేళ్ళయ్యాక చదివితే, అప్పుడు మీరు టపా రాస్తే ఇలా అయితే ఉండదు" నిజమే కానీ, అప్పుడు వచ్చే మార్పు నాలోనే ఉంటుంది కానీ కావ్యంలో కాదు అన్నది నా భావన. సమయముతో, అనుభవాలతో, పరిస్థితులతో మారేది మనిషి ఆలోచనలే కానీ ముద్రించబడిన కావ్య భావం కాదన్నది నా అభిప్రాయం.

మీరు చెప్తుంటే మాత్రం ఆ తేడా ఏమిటో తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది. కనుక, దయచేసి కాస్త వీలు చూసుకుని కాళిదాస విరచిత మేఘ సందేశ కావ్యాన్ని మీ అన్వయంతో పరిచయం చేయవలసినదిగా వేడుకుంటున్నాను. నా అభ్యర్ధనను మన్నించి పరిచాయక వ్యాసానికి శ్రీకారం చుడతారని ఆశిస్తూ... మరొక్కసారి కృతజ్ఞతలు!

@ కొత్తపాళీ గారూ
:) అయ్యుండచ్చు, అందుకేనేమో నాకు ఆనందాన్నిచ్చింది, ధన్యవాదాలండీ!

రసజ్ఞ said...

@ అజ్ఞాత గారూ
వ్రాసిన టపాలకి వ్యాఖ్యలు వస్తాయి కానీ వ్యాఖ్యల కోసం టపాలు వ్రాయలేము కదండీ! మీకు నచ్చినందుకు ధన్యవాదాలు.

@ మాధవరావు గారూ
నమస్కారమండీ!
నిజమే బాగా చెప్పారండీ! అదే కవి యొక్క గొప్పతనాన్ని తెలియచేస్తుంది. మీకు నచ్చినందుకు ధన్యవాదాలు!
ఎంతమాట! తప్పకుండా, త్వరలోనే చదివి నా అభిప్రాయాన్ని తెలియచేస్తాను! ధన్యవాదాలు!

@ శాస్త్రి గారూ
"కాళిదాసు వేశ్యాలోలుడని విన్నాను" అన్నారు. నాకు తెలిసినంతవరకూ, నేను చదివినంత వరకూ ఎక్కడా అలా లేదు. కాళిదాసు ఒకనాడు వేశ్యలు ఉండే వీధిలో తాంబూలం చుట్టుకుంటూ నడుస్తూ ఉండగా ఒక తమలపాకు ఎగిరి క్రిందన (చెత్తలో) పడిపోవటం, సరిగ్గా ఆకు పడే ముందు ఆయన కృష్ణార్పణం అనేసి ఆ ఆకుని వృధాగా పోనీయకపోవటం గురించి అయితే విన్నాను. అంతకుమించి కాళిదాసు వేశ్యా వీధిలో నడిచిన విషయం కూడా ఎక్కడా లేదు. తెనాలి రామలింగడు మాత్రం వేశ్యా గృహాలలోకి వెళ్ళి చాలా మందిని మంచివారిగా మార్చి, ఆ వృత్తిని వదిలిపెట్టేలా చేశాడని ఉంది. మహానుభావులు, అమ్మవారి పరమ భక్తులు ఒకవేళ వెళ్ళినా కూడా ఏదో ఆంతర్యం ఉండి ఉండవచ్చును అని నా అభిప్రాయం. ధన్యవాదాలు!

రసజ్ఞ said...

@ సత్య గారూ
ఇది నిజంగా పెద్ద పొగడ్తే :) ఆసక్తి లేకపోయినా కూడా ఇష్టంగా చదువుతున్నారు, అదే చాలు నాకు. ధన్యవాదాలండీ!

@ కృష్ణ గారూ
భలే వారే! అవన్నీ టపాలోనే వ్రాయాలని వున్నా నిడివి బాగా పెరిగిపోతుందని వ్రాయలేదు, ఇప్పుడు మీరు వ్రాయించి పూర్తి చేయించారు. నేనే మీకు ధన్యవాదాలు చెప్పాలి.
శుభం! త్వరగా చదివి, మీ అభిప్రాయాలను తెలియచేస్తారని ఆశిస్తున్నాను

@ vamkasannam గారూ
ధన్యవాదాలు, మీకు కూడా నూతన సంవత్సర (ఆంగ్ల) శుభాకాంక్షలు!
:) భలేవారే! అది మన పండుగ కాదుగా, అందుకే కనపడలేదనమాట

..nagarjuna.. said...

పోస్ట్ లు రాసి క్లాసిక్స్ ను పరిచయం చేస్తున్నందుకు మీకు, ఈ పోస్ట్ లో వ్యాఖ్య పెట్టి టపాను/విషయాన్ని మరింత ఆసక్తికరంగా చేసినందుకు లక్ష్మీదేవి గారికి ధన్యవాదాలు.

రసజ్ఞ said...

@ నాగార్జున గారూ
మీరన్నట్టుగా లక్ష్మీదేవి గారికి నిజంగానే ధన్యవాదాలు తెలియచేయ్యాలండీ! ముఖ్యంగా ఇటువంటి టపాలు వ్రాసిన ప్రతీసారీ ఎంతో ప్రోత్సాహాన్ని అందిస్తూ, నేను వ్రాయకుండా వదిలేసిన వాటిని వ్యాఖ్యల్లో వ్రాయించి సంపూర్ణత తీసుకుని వస్తూ వుంటారు. చదివి ప్రోత్సహిస్తూ, అభినందించే మీకు కూడా కృతజ్ఞతలండీ!

Sai Kiran said...

రసజ్ఞ గారు,
చాలా బాగా రాశారండి..
హ్యాట్సాఫ్ టు యూ..

శ్యామలీయం said...

వారెవరో కాళిదాసుగారి (కావ్యం) గురించి వ్రాస్తే ఆట్టే వ్యాఖ్యలు రావన్నారు కానీ చూదండీ బోలడన్ని వచ్చాయి. ఇంకా వస్తాయి కూడా.

అన్నట్లు మేఘసందేశంలో కవిగారు వాడినవి అన్నీ‌ మందాక్రాంత వృత్తాలు. మందాక్రాంతం అంటే మెల్లగా ఆక్రమించుకొంటూ పోయేది - మేఘం అవటం చాలా సముచితమైన విషయం.

మేఘసందేశం ప్రపంచ సాహిత్యంలోనే అరుదైన గ్రంధం. దీనిలో ఉన్నది ఇద్దరే యక్షుడూ అతని భార్యానూ - ఇద్దరికీ పేర్లు చెప్పలేదు కవి. మిగిలిది సరే మేఘం. ఇలాంటిది యే పాత్రకూ పేర్లులేని గ్రంధం మరేదైనా ఉందేమో నాకు తెలియదు.

మేఘుణ్ణి ప్రయాణించమంటూ కవిగారు సెలవిచ్చన మార్గం గురించి భారతి సాహిత్యమాసపత్రికలో ఒక మంచి వ్యాసం వచ్చింది.

అలాగే ఈ గ్రంధంలో చాలా విశేషాలున్నాయి. 'ఆషాఢస్య ప్రథమదివసే' అన్నారు కాళిదాసు గారు - ఆరోజున ఉత్తరదిక్కుగా మేఘం దర్శనం ఇస్తే దేశం శుభిక్షంగా ఉంతుందని నానుడి - ఇలా మంగళాశాసనం చేసారన్న మాట కవి.

మంచి వ్యాసం అందిచ్చినందుకు అభినందనలు.

Anonymous said...

నా తెలియనితనం వల్ల ఏమో ఇలా నాకనిపించింది. ఋతుపవనాల గురించి కూడా స్పష్టమైన వివరణ కూడా ఉంది అని. జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి అంటే జూన్ రెండొవ వారంలో నుండి జూలై మొదటి వారం వరకు ఎప్పుడైనా రావొచ్చు అలానే కార్తీక పౌర్ణమి అంటే నవంబర్ నెలలో వస్తుంది. మనం చూస్తే ఋతుపవనాలు ఎంత ఆలస్యంగా చేరుకున్నా కాని ఆలోపు హిమాలాయాల దగ్గర ఉన్న అలకాపురి చేరుకోవటం ఖాయం అని కాళీదాసు మహాకవి, ఇంకను ఆ దారీ కూడా వర్ణించిన విధానం చూస్తే ఆయన వాతావరణ శాస్త్రవేత్త అని అనిపించింది. సంవత్సరానికే మళ్ళీ వస్తుందనటంలో ఋతుపవనాలు సంవత్సరానికి అదే సమయానికి వస్తాయి అని చెప్పటం, మేఘం పై ఆదరపడ్డాడు కామార్తునికి అంత ఆలోచన ఎక్కడ ఉంది అనటంలో మేఘాలు సమయానికి చేరుకుంటాయో లేదనేది చెప్పటం కష్టం, (ఐనా కూడా మేఘాలు సమయానికి వస్తాయని, పంటలు బాగా పండుతాయని కోరుకునే రైతు ఎలా మేఘాలని నమ్ముతాడో)అలానే ఆశావాహి ఐన యక్షుడు మేఘాలు అలకాపురి చేరుకుంటాయని నమ్మాడు అని కూడా నిగూఢంగా ఉందేమో అనిపించింది.

Anonymous said...

This is a great tip particularly to those new to the blogosphere.
Brief but very precise information… Appreciate your sharing this
one. A must read post!

Take a look at my blog: dating sites (http://Bestdatingsitesnow.com)

Anonymous said...

I think this is among the most important info for me.
And i'm glad reading your article. But wanna remark on some general things, The web site
style is perfect, the articles is really great : D.

Good job, cheers

my web site HeideCElsner

KOLLURI VEERA PUSHKAR said...

మీ పుస్తక సేకరణ అధ్బుతం మేడం, "వెన్నెల్లో ఆవకాయ" మీరు చెప్పిన గుత్తి మామిడి ఆవకాయలా (నేను తినలేదుగాని [నా ఊహల్లో]) చాల బాగుందండి.

తెలుగోడు_చైతన్య said...

కవికులగురువు కాళిదాసు గారి కావ్యాన్ని రాసి మీరు నిజమైన రసజ్ఞులు అయ్యారు...చాలా బాగున్నది...ధన్యవాదాలు...తెలుగోడు.

Unknown said...

ఈ పుస్తకం కావాలి నాకు....మి దగ్గర ఉందా