కథ : భద్రాచలం యాత్ర ... వాళ్ళక్క కథ?
రచయిత : వంశీ
వంశీ అన్న పేరు తలుచుకుంటేనే ముందుగా గుర్తొచ్చేది గోదావరి. గోదావరి అందాలని వర్ణించటంలోనూ, ఆ యాసని జనులకి పరిచయం చేస్తూ పాఠకులని భూతల స్వర్గంలో విహరింపచేయటంలోనూ ఈయనది ప్రత్యేక శైలి. ఆ విధముగా సాగిపోయేదే ఈ భద్రాచలం యాత్ర. శీర్షికకు తగ్గట్టు రాజమండ్రీ నుండి పాపికొండల మీదుగా భద్రాచలం యాత్రా విశేషాలు, దారిలో తగిలే పల్లెలు - వాటి ప్రాముఖ్యత, గోదావరితో పెనవేసుకున్న వాళ్ళ జీవితాలను ఎంతో చక్కగా రూపొందించినదే భద్రాచలం యాత్ర ... వాళ్ళక్క కథ?
కథలోకి వస్తే అమెరికాలో ఉండే తెలుగు జనాలకి అఖండ గోదావరీ నదిలో ప్రయాణించి ఆనందించాలనిపించి మనదేశం వచ్చినపుడు రాజమండ్రీ నుండి గూటాల మూర్తి గారి లాంచీలో ప్రయాణం మొదలుపెడతారు. చక్కని, రుచికరమయిన భోజనం వండి వడ్డించే బోసు; రాత్రి పూట వెలుతురు కోసం జనరేటరు, లైట్లు పెట్టే కోరుకొండ బాబ్జీ; దారిలో ఎదురయ్యే ప్రాంతాలని వర్ణించి, విశేషాలను విడమరిచే గైడు మంగరాజు కూడా వెంట వెళతారు.
గోదావరీ నది ఒంపు సొంపులను, ఎత్తైన పాపికొండల అందాలను ఆస్వాదిస్తూ, ఆయా ప్రాంత విశేషాలు తెలుసుకుంటూ, వెన్నెలలో, ఇసుక తిన్నెలలో జనాలు జగాన్ని మైమరచిపోతున్నా, సమయానికి కోరినవి వండి వడ్డించే బోసు, వేమూరి రవికిరణ్ అనే ప్రయాణీకుడి దృష్టిని ఆకర్షిస్తాడు. ఆంధ్రులు భోజన ప్రియులు అన్నట్టుగా వారి జిహ్వకి కోరిన రుచులను అందించే గోదావరిలాంటి బోసు చిఱునవ్వు వెనుక అగాధం ఉందని, దానిని ఎలాగయినా తెలుసుకోవాలనే కోరిక అతనిలో పెరిగి, బోసు చేసే ప్రతీ పనినీ తీక్షణంగా గమనిస్తూ ఉంటాడు. బోసు తన గతం తాలూకు జ్ఞాపకాలను రవికిరణ్ తో పంచుకోవటంతో కథ ముగుస్తుంది.
నా వరకూ ఈ కథలో కథానాయకుడు బోసే. మనసు లోతుల్లో ఎన్ని ఆటుపోట్లున్నా, జీవితంలో సుడిగుండాలు ఎదురయినా, అనుకోని సంఘటనలు దొంగ ఊబుల్లోకి కూరేసినా అన్నిటినీ జయించి, దేనికీ చలించక, నిబ్బరంగా, గంభీరమయిన గోదావరిలా నవ్వులు చిందిస్తూ నిలబడ్డ మనీషి. అలానే సొంత నేల మీద అతనికున్న మమకారం, కాసుల మీద అతనికి లేని వ్యామోహం రెండూ కూడా అతను అమెరికా ఆహ్వానాన్ని తిరస్కరించడం ద్వారా తేట తెల్లమవుతాయి. "కాశీలో ప్రాణం పోతే ముక్తి, కురుక్షేత్రంలో దానం చేస్తే ముక్తి, జాహ్నవీ తీరంలో తపస్సు చేస్తే ముక్తి, ఈ మూడు ఫలితాలను ఇచ్చే గోదావరీ నదీతీరంలో క్షణంకాలం నివసించినా ముక్తి" అన్న మాటలు జ్ఞప్తికి వస్తాయి మనకు. ఈ కథకు వర్ణనలు ప్రధానమయిన ఆకర్షణ. చదువుతున్నంత సేపూ మనం కూడా ఆ లాంచీలోనే ప్రయాణం చేస్తున్న అనుభూతి కలుగుతుంది.
ఏ విధముగానయితే నిలకడగా ఉన్న గోదావరి అందాలే కాక, పోటు మీదున్న గోదావరి విధ్వంసాన్ని కూడా చూపిస్తుందో అదే విధముగా ఈ కథలో బోసు వాళ్ళక్క అయినటువంటి సుశీల జీవిత సంబంధిత విషాద ఛాయలని కూడా రచయిత ఎంతో పొందికగా మన ముందుకు తెస్తారు. బోసుకి అక్క మీదున్న ప్రేమ అతని ప్రతీ మాటలోనూ కనిపిస్తూ ఉంటుంది. కొన్ని గాయాల తాలూకు గుర్తులు మదిలోతుల్లో ఎప్పటికీ నిలిచే ఉంటాయి. పచ్చబొట్టు చెరిగిపోదులే........
13 comments:
రసజ్ఞ గారూ మీరు చెప్పింది నిజమేనండీ..
"కొన్ని గాయాల తాలూకు గుర్తులు మదిలోతుల్లో ఎప్పటికీ నిలిచే ఉంటాయి. పచ్చబొట్టు చెరిగిపోదులే........"
అందరికీ నచ్చే గోదావరి అందాలను వర్ణించే వంశీ గారి కధను విశ్లేషించారన్నమాట..
All The Best.
మీ విశ్లేషణ బాగుంది అండి. నేను గోదావరి జిల్లాకు చెందినవాణ్ణే.. :)
వంశీ గారి రచనలంటే నాకు కూడా చాలా ఇష్టమండి.
@ రాజి గారూ
ఎల్లప్పుడూ ప్రోత్సహించే మీ వ్యాఖ్యలకి హృదయపూర్వక ధన్యవాదాలు! ఏదో నేను సైతం అని తొలి అడుగు వేశాను!
@ రాజచంద్ర గారూ
మీకు నచ్చినందుకు ధన్యవాదాలండీ! ఆయ్! మీది కూడా గోదారి జిల్లానేట్టండీ!
@ లాస్య గారూ
ఐతే సేం పించ్ గట్టిగా గిల్లుకోండి! మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు!
"కొన్ని గాయాల తాలూకు గుర్తులు మదిలోతుల్లో ఎప్పటికీ నిలిచే ఉంటాయి".... ఇది నిజం రసజ్ఞగారూ.. ఆ గాయాలు కష్టపెట్టేవీ కావొచ్చు, ఇష్టపడేవీ కావచ్చు..... ఏవయినా మనసు మూలల్లో ఎప్పటికీ దాగుంటాయి. మంచి కథ గురించి మీవైన మాటల్లో పరిచయం బాగుందండీ..
aa katha inta varaku chadavaledu kaani... mee vyaakhya chadivaakaa... katha tappaka chadavaalani undandi...godaavari jillaavaaLLameanainaa... taruchu godaavari andaalani choosea bhaagyaaniki nOchukOni vaaLLam.
vamsi ante meeku nenu kuda gurthuravaalandoy...
KIDDING..
రసజ్ఞ గారు,,,
చాలా బాగా రాసారు ....కేక ...
ఇంట్రడక్షన్ చదవగానే ఈ కధ మా పసలపూడి కధల్లో ఉంది కదా అనిపించింది.
మొత్తానికి అదే అని కన్ఫర్ చేసుకున్నాను. అదేంటో ఆ వర్ణన లూ, క్యారెక్టర్స్, గోదారి యాస లో డైలాగ్స్, ఎన్ని సార్లు చదివినా బోర్ కొట్టవు..
నైస్ పోస్ట్ అండీ..
@ శోభ గారూ
నిజమేనండి ఇష్టమయినా కష్టమయినా కష్టమంటి ఇష్టమయినా మదిని వదిలి పోలేవు కదా! నా మాటల్లో వంశీగారి కథ నచ్చినందుకు ధన్యవాదాలు!
@ లక్ష్మీ మాధవ్ గారూ
ఆ వర్ణనల కోసం, యాస కోసం, అసలు గోదావరీ అందాలన్నీ కనిపించే వంశీ గారి కథలు తప్పక చదవాలండీ! అయ్యో! బాధపడకండి వంశీ గారి కథలన్నీ ఒక సారి తీరికగా చదవండి మీరు గోదావరి అందాలని చూస్తూ ఒడ్డున ఆడుకుంటున్నట్టే ఉంటాయి! ధన్యవాదాలు మీ స్పందనకి!
@ కమల్ గారూ
హహహ ఎంతమాట! మీరు గుర్తు రాకపోవడమేమిటి? గోదావరి తరువాత మీరే గుర్తొచ్చారు ;) ధన్యవాదాలు!
@ రాఫ్సున్ భాయ్
థాంక్యూ థాంక్యూ! భాయ్ నన్ను మెచ్చుకున్నారోచ్చ్!
@ రాజ్ కుమార్ గారూ
మీరు చెప్పింది నూటికి నూరుపాళ్ళూ నిజం! థాంక్స్ అండీ నచ్చినందుకూ, కామెంటినందుకూ!
వంశీ గారి మా పసల పూడి కథలు ఈ మధ్యనే చదివాను.చాలా బాగున్నాయి.
@ రమణారెడ్డి గారూ
అవునండీ! చాలా బాగుంటాయి! అవి చదువుతుంటే మనం కూడా గోదావరి ఒడ్డున ఉండి గమనిస్తున్నట్టు ఉంటాయి! ధన్యవాదాలు!
Post a Comment